పుట్టపర్తి టౌన్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో నేడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వినియోగిస్తున్నారు. 1952, 1957 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరికి ఓ బ్యాలెట్ బాక్స్ను ఏర్పాటు చేసేవారు. ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేస్తే వారికి కేటాయించిన పెట్టెలోనే బ్యాలెట్ పేపర్ వేయాల్సి ఉండేది. సంస్కరణల్లో భాగంగా 1962లో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ బూత్కు ఓ బ్యాలెట్ బాక్స్ ఏర్పాట చేస్తూ వచ్చారు. కాలక్రమేణా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం ఆరంభం కావడంతో ఓటింగ్ ప్రక్రియలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి.
25న చింత,
వేరుశనగ చెక్క వేలం
బుక్కరాయసముద్రం: ఈ నెల 25న బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఓపెన్ ఎయిర్ జైలులో చింతపండు పంటకు వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ జైలు సూపరింటెండెంట్ చిన్నారావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలంలో పాల్గొనే వారు రూ.3వేలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. వేలం ముగిసిన తర్వాత ధరావత్తును వెనక్కు చెల్లిస్తారు. అలాగే 25వ తేదీ జిల్లా జైలు ఆవరణలో 20 వేల కిలోల వేరుశనగ చెక్కకు వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ జైలు సూపరింటెండెంట్ రహమాన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం పాటలో పాల్గొనేవారు రూ.17,600 చెల్లించాల్సి ఉంటుంది. వేలం పాట ముగిసిన తర్వాత డిపాజిట్ సొమ్ము వెనక్కు చెల్లిస్తారు.
సెల్ఫోన్ ఇవ్వలేదని
బాలిక ఆత్మహత్య
బ్రహ్మసముద్రం : సెల్ఫోన్ చేతికి ఇవ్వకపోవడంతో క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం ఎస్.కోనాపురం గ్రామానికి చెందిన రుద్రప్ప కుమార్తె రూప (16) తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో స్కూల్ మానేసింది. ఈ క్రమంలోనే ఇంటి పట్టునే ఉంటూ పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ వచ్చింది. ఇటీవల సెల్ఫోన్కు ఎక్కువగా అలవాటు పడడంతో విషయం గమనించిన తల్లిదండ్రులు మందలించారు. రెండు రోజులుగా ఆమె చేతికి సెల్ఫోన్ ఇవ్వకుండా కట్టడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె క్షణికావేశంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలానికి వెళ్లిన ఆలస్యంగా ఇంటికి చేరుకున్న తండ్రి... ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి బోరున విలపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ పరుశురాముడు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
డబ్బు, మద్యం పంచినా.. ప్చ్
● ‘గుమ్మనూరు’ నామినేషన్ కార్యక్రమానికి జనం కరువు
● అసహనంతో పోలీసులపై గుమ్మనూరు ఈశ్వర్ జులుం
గుంతకల్లు: విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచినా గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరామ్ నామినేషన్ కార్యక్రమానికి జనం కరువయ్యారు. సోమవారం నిర్వహించిన నామినేషన్ కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడ్డారు. విచ్చలవిడిగా డబ్బు, కేసుల కొద్దీ మద్యం, పదుల సంఖ్యలో వాహనాలు సమకూర్చినా ఫలితం కానరాలేదు. వచ్చిన కొద్ది మంది కూడా ఆలూరు నియోజకవర్గ వాసులే. గుంతకల్లు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ఆసక్తి కనబరచకపోవడంతో తన సొంత నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జనాన్ని తీసుకొచ్చారు. ఇక.. నామినేషన్ సందర్భంగా గుమ్మనూరు నిర్వహించిన ర్యాలీలో కొంతసేపు కనిపించిన జితేంద్రగౌడ్ ఆ తర్వాత కనిపించకపోవడం గమనార్హం.
పోలీసులపై గుమ్మనూరు కుమారుడి జులుం..
మద్యం, డబ్బు గుమ్మరించినా జనం రాకపోవడంతో గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ సహనం కోల్పోయాడు. పోలీసులపై జులుం ప్రదర్శించాడు. నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితోపాటు నలుగురికి మాత్రమే అనుమతి ఉందని, అంతకంటే ఎక్కువ మంది వెళ్లడానికి వీలు లేదని పోలీసులు ఆయన్ను అడ్డుకోగా.. వారిపైనే దౌర్జన్యానికి దిగాడు. ‘నన్నే అడ్డుకుంటారా.. మీ కథేంటో త్వరలో చెప్తా’ అంటూ చిందులు తొక్కాడు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించాక తోక ముడిచాడు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
పెద్దపప్పూరు: మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన జూటూరు, చీమలవాగుపల్లి, నరసాపురం, పెద్దపప్పూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సోమవారం సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ, ఎస్ఐ శరత్చంద్ర పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలూ చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలను చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.