కశింకోట: మండలంలోని జాతీయ రహదారిపై వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదనపు ఎస్ఐ జె.నాగేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.. కశింకోట శివారులోని బంకు వద్ద అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళుతున్న స్కూటీని గుర్తు తెలియని లారీ ఢీకొంది. దీంతో స్కూటీ నడుపుతున్న అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన టీచర్ సేనాపతి శిరీషజ్యోతి(26) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీ వెనుక కూర్చున్న కర్రి భాగ్యశ్రీకి గాయాలవడంతో, ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. జ్యోతి స్థానిక సెయింట్ జాన్స్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్గా పని చేస్తున్నారు. స్కూల్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని సిఐ ఎ.రవికుమార్ సందర్శించారు.
మండలంలోని బయ్యవరం వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్న ఒమ్మి శ్రీను(43) మృతి చెందాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని తన స్వగ్రామం జమాదులపాలెం వెళుతుండగా అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళుతున్న ప్రైవేట్ బస్సు వెనుకగా వచ్చి ఢీకొంది. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.