-
శ్రీలంక అమ్మాయి.. జగిత్యాల అబ్బాయి
రాయికల్: ఉద్యోగం కోసం జోర్డాన్ దేశం వెళ్లిన మేడిపల్లి అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో హిందూసాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మెట్పల్లి మండలం మూడుబొమ్మల మేడిపల్లి గ్రామానికి చెందిన జొరిగె అశోక్ ఉద్యోగం కోసం జోర్దాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ శ్రీలంక దేశానికి చెందిన సమన్వి పరిచయమైంది. ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో అశోక్ అక్కాబావలైన రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన చేగంటి శేఖర్–పూజితలు హిందూ సాంప్రదాయ ప్రకారం భూపతిపూర్లోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వీరి వివాహం జరిపారు. దంపతులను ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీ సర్పంచులు వాసరి రవి, మాజీ ఎంపీటీసీ బెజ్జంకి మోహన్, వైస్ ఎంపీపీ మహేశ్వర్రావు ఆశీర్వదించారు. -
లవ్ మ్యారేజ్ ఆపై విడాకులు.. మరో వ్యక్తితో పెళ్లి.. మళ్లీ మొదటి భర్తతో..
మల్యాల(చొప్పదండి): వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య కలాహాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో యువతిని మరో వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. అయినప్పటికీ ఆమె తన మొదటి భర్తతో సన్నిహితంగానే ఉంటోంది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఆమెను గొంతునులిమి హతమార్చి చెట్లపొదల్లో పడేశాడు. ఈ సంఘటన మల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణానికి చెందిన కరిపే అంజలి.. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన కొల్లూరి నరేశ్ ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కుటుంబకలహాల కారణంగా రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అనంతరం అంజలిని సిద్దిపేటకు చెందిన వ్యక్తికిచ్చి మరో పెళ్లి చేశారు. అయినా మొదటి భర్త నరేశ్ అంజలితో ఫోన్లో తరచూ మాట్లాడుతున్నాడు. రెండురోజుల క్రితం సిద్దిపేట నుంచి జగిత్యాలలోని పుట్టింటికి వచ్చిన అంజలికి ఫోన్ చేసిన నరేశ్.. ఈనెల 17న తన బైక్పై తీసుకెళ్లాడు. మ్యాడంపల్లి శివారులోకి చేరగానే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె గొంతునులిమి చంపి చెట్లపొదల్లో పడేశాడు. సోమవారం అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నీలం రవి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని...కోపంతో తండ్రి...
కన్నకూతురు తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు కుటుంబసభ్యులు వరుడి ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి కూతురిని లాక్కెళ్లిన ఘటన ఏలూరు జిల్లా: ఈ ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆగిరిపల్లి మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన కందుల వంశీ, అదే గ్రామానికి చెందిన అత్తి శ్రావణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి శ్రావణి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో... వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు ఆగ్రహంతో వంశీ ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి శ్రావణిని ఎత్తుకెళ్లారు. -
ప్రేయసిని పెళ్లాడిన ఖైదీ.. జైల్లో జరిగిన వివాహం
భువనేశ్వర్: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమే కానీ, ఇది మాత్రం జైలులో భిన్నంగా జరిగిన పెళ్లి. ప్రియురాలి వర్గాల నేరారోపణతో జైలు పాలైన ప్రేమికుడితో చట్టపరమైన లాంఛనాలతో పెళ్లి జరిగింది. జైలు అధికారుల అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఝరపడా ప్రత్యేక జైలు సోమవారం పెళ్లి కళతో కళకళలాడింది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా అమ్మాయి తరపువారు ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలానుక్రమంగా వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు సంతోషకరమైన మలుపు దక్కింది. ఇరువురి కుటుంబాలు తమ మనసు మార్చుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రేమికులకు పెళ్లి జరిపించేందుకు హృదయపూర్వకంగా ముందుకొచ్చారు. దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి వివాహాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. -
చెల్లెలి భర్తను నరికి చంపిన యువకుడు
సాక్షి, చైన్నె: తన సోదరిని కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని ఓ అన్న తన స్నేహితులతో కలిసి హతమార్చాడు. ఈ పరువు హత్య చైన్నె శివార్లలో కలకలం రేపింది. ఈ కేసులో ఐదుగురిని పళ్లికరణై పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. స్థానిక అంబేడ్కర్ వీధికి చెందిన ప్రవీణ్(26) ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఎలిటియన్ పేటకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించ లేదు. దీంతో ఈ ప్రేమ జంట గత ఏడాది చివర్లో ఇంటి నుంచి పారిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. తమ కుటుంబ పరువును బజారు కీడ్చిన ప్రవీణ్పై ఆ యువతి కుటుంబం కక్ష పెంచుకుంది. ఆమె సోదరుడు దినేష్(24) తన మిత్రులతో కలిసి ప్రవీణ్ కదలికలపై నిఘా పెట్టాడు. శనివారం రాత్రి వేళచ్చేరి నుంచి పళ్లికరణై టాస్మాక్ రోడ్డు వైపుగా వెళ్తున్న ప్రవీణ్ను దినేష్ తన స్నేహితులతో కలిసి చుట్టుముట్టాడు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి పడేసి ఉడాయించారు. రక్తపు మడుగులో పడి ఉన్న దినేష్ను ఆ పరిసర వాసులు 108లో క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మరణించినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పళ్లికరణై ఇన్స్పెక్టర్ నెడుమారన్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. అతడి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించింది. ఆ పరిసరాలలోని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులు పారి పోయిన మార్గంలో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయాన్నే దినేష్తో పాటు అతడి స్నేహితులు చిత్తాల పాక్కం శ్రీరాం(23), స్టీఫన్(24), విష్ణు రాజు(23), జ్యోతిలింగం(23) మాంబాక్కం వద్ద ఓ చోట తలదాచుకుని ఉండడంతో వారిని చుట్టుముట్టి అరెస్టు చేశారు. తన చెల్లెల్ని కులాంతరం వివాహం చేసుకున్నందుకే ప్రవీణ్ను మట్టుబెట్టినట్టుగా నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
ప్రేమజంటకు పెద్దల బ్రేక్
సాక్షి, బళ్లారి: కూతురు మరో కులం యువకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపగించుకున్న తల్లిదండ్రులు వారి రిజిస్టర్ పెళ్లిని అడ్డుకున్న ఘటన చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా బీజీకెరెలో జరిగింది. వివరాలు.. బీజీకెరె గ్రామానికి చెందిన ప్రవీణ్, పద్మజ అనే ఇద్దరు ఐదేళ్ల నుంచి ప్రేమించుకుని గత వారం క్రితం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కులాలు వేర్వేరని వారి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. ప్రేమికులిద్దరూ మంగళవారం రిజిస్టర్ పెళ్లి చేసుకోవాలని మొళకాళ్మూరుకు బయల్దేరారు. ఇంతలో పద్మజను వారి బంధువులు అడ్డుకుని బలవంతంగా బైక్పై తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ అయింది. బీజీకెరె గ్రామానికి చెందిన ప్రవీణ్నాయక్ ఎస్టీ అయితే, కోనసాగర గ్రామానికి చెందిన పద్మజ బీసీ కులం యువతి. పద్మజ మంగళూరు నర్సింగ్ కళాశాలలో అతిథి లెక్చరర్గా పని చేస్తుండేది. ఆమె బంధువులు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రవీణ్ ఆరోపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Valentines Day: వ్యాపార దిగ్గజాలు.. ఈ ప్రేమ పక్షులు
కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. ఆపినా ఆగదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రేమికుల రోజును వ్యాపారంగా మలుచుకుంటున్నారు. కానీ నిత్యం వ్యాపారం చేస్తూ ప్రేమికులుగానే ఉండనున్నట్లు కొన్ని ప్రేమవివాహం చేసుకున్న జంటలు తెలుపుతున్నాయి. ఆ ప్రేమజంటలు చేస్తున్న వ్యాపారం విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ - షుగర్ కాస్మోటిక్స్ వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ 2015లో షుగర్ కాస్మొటిక్స్ను స్థాపించారు. వీరు అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో కలిసి చదువుకున్నారు. బిపిన్ ప్రీత్ సింగ్, ఉపాసన టకు - మొబిక్విక్ ఉపాసన టకు, బిపిన్ ప్రీత్ సింగ్ 2009లో మొబిక్విక్ కంపెనీని ప్రారంభించారు. ఇది మొబైల్ ఫోన్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, డిజిటల్ వాలెట్లతో సహా అనేక రకాల సేవలను అందించే కంపెనీ. ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ - వెడ్మి గుడ్ ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ హెల్త్ న్యూట్రిషన్ కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్క్లైన్లో ఇంటర్న్షిప్ సమయంలో కలుసుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. తరువాత 2012లో వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ జంటకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. దాంతో బ్యాండ్-బాజా, క్యాటరింగ్ సేవలు, డెకరేషన్స్ వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో వారి పెళ్లి అనంతరం వారు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం అందిస్తూ దాన్ని బిజినెస్గా మలుచుకున్నారు. తర్వాత 2014లో వెడ్మి గుడ్ కంపెనీను స్థాపించారు. శుభ్ర చద్దా, వివేక్ ప్రభాకర్-చుంబక్ శుభ్ర, వివేక్ 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ముదురు రంగుల్లో ఉండే ‘కిట్చీ-చిక్’ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కాని అందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో ఏకంగా తమ ఇంటిని అమ్మేందుకు సిద్ధపడ్డారు. 2009లో చుంబక్ కంపెనీను స్థాపించారు. ప్రత్యేకమైన గృహాలంకరణ వస్తువులు, ఫ్యాషన్ ఉపకరణాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. గజల్ అలఘ్, వరుణ్ అలఘ్-మామా ఎర్త్ గజల్ అలఘ్ టాక్సిన్ ఫ్రీ బేబీ కేర్ ఉత్పత్తులను తయారుచేయాలని భావించి హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మామాఎర్త్ను ఆగష్టు 2016లో తన భర్త వరుణ్ అలఘ్తో కలిసి స్థాపించారు. తల్లిదండ్రులు, పిల్లల కోసం సహజమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు మామాఎర్త్ తెలిపింది. రోహన్, స్వాతి భార్గవ - క్యాష్కరో ఇదీ చదవండి: దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి.. స్వాతి, రోహన్ భార్గవ క్యాష్కరో, క్యాష్బ్యాక్, కూపన్ వెబ్సైట్ను స్థాపించారు. ఏప్రిల్ 2011లో వీరు యూకేలో పోరింగ్ పౌండ్స్ పేరుతో క్యాష్బ్యాక్ వెబ్సైట్ను ప్రారంభించారు. 2013లో లండన్ నుంచి గుర్గావ్కు తిరిగి వచ్చిన తర్వాత అదే బిజినెస్ మోడల్ను క్యాష్కరో పేరుతో భారత్లో ప్రారంభించారు. క్యాష్కరోలో టాటా, కలారీ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టాయి. -
వాలెంటైన్స్ డే స్పెషల్.. టాలీవుడ్ ప్రేమ జంటలు!
మరో ఏడాదిలో వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్తో ఉంటారు. ప్రేమ అనే రెండు అక్షరాలను.. పెళ్లి వరకు తీసుకెళ్లిన వారు చాలా అరుదుగానే కనిపిస్తారు. రెండు అక్షరాలతో మొదలై.. అదే రెండక్షరాల పెళ్లిగా మారేదే నిజమైన ప్రేమకు నిదర్శనం. ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అలా ప్రేమలో పడి.. పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ జంటలు చాలానే ఉన్నాయి. వారిలో మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. టాలీవుడ్ సక్సెస్ అయిన ప్రేమకథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. నాగార్జున-అమల: మొదట కిరాయి దాదా మూవీ సెట్స్లో కలుసుకున్న ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో 1992లో (జూన్ 11న) వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్దం, చినబాబు, శివ, నిర్ణయం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు. అయితే నాగార్జునని పెళ్లాడిన తర్వాత అమల సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత కూడా ఒకటి,రెండు సినిమాల్లో నటించింది. 2. రాజశేఖర్-జీవిత: తెలుగు స్టార్ హీరోల్లో రాజశేఖర్ అంటేనే ఓ స్పెషల్. రాజశేఖర్, జీవిత జంటగా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మొదట జీవితనే రాజశేఖర్కు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఆహుతి, స్టేషన్మాస్టర్, అంకుశం, బావ మరుదుల సవాల్ లాంటి చిత్రాలు వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. 3. శ్రీకాంత్-ఊహా: 1994లో ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె, ఆయనగారు లాంటి చిత్రాల్లో కలిసి నటించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో జంటగా నటించారు. వీరి ప్రేమను 1997 జనవరి 20న పెళ్లితో పదిలపర్చుకున్నారు. వీరి పెళ్లయిన ఏడాది తర్వాత ఆయనగారు చిత్రం విడుదలైంది. 4. మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్: 2000వ సంవత్సరంలో వంశీ చిత్రంలో మహేశ్ - నమ్రత కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్లపాటు సీక్రెట్గా తమ బంధాన్ని కొనసాగించారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 5. అల్లు అర్జున్-స్నేహ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగానూ సంబంధం లేకపోయినా.. అల్లు అర్జున్ ఓ స్నేహితుడి వివాహంలో తనను కలుసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకోవడం.. రోజూ ముచ్చట్లు చెప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు.. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్- స్నేహరెడ్డిల 2011న మార్చి 6న జరిగింది. 6. రామ్ చరణ్-ఉపాసన: మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరేంజ్’ సినిమా నుంచి వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమాలతో సంబంధం లేదు. 7. లక్ష్మి మంచు-ఆండీ శ్రీనివాసన్: మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు.. ఆండీ శ్రీనివాసన్ని అనుకోకుండా కలిశారు. ఆమె చెన్నైలో తన స్నేహితురాలి వివాహానికి షాపింగ్కు వెళ్లినప్పుడు అతన్ని మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆండీ, లక్ష్మి ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఈ జంట ఆగస్ట్ 4న 2006లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 8. నాని-అంజనా యలవర్తి: టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రేమజంట నాని-అంజనా యలవర్తి. నాని భార్య అంజన సాఫ్ట్వేర్ ఇంజినీర్. నాని విశాఖపట్నంలో వీడియో జాకీ(వీజే)గా ఉన్నప్పుడు అంజనా ఓ పని మీద అతన్ని కలిసింది. ఆ తర్వాత ఫోన్లో స్నేహితులుగా మారిన వీరిద్దరు ప్రేమాయణం కొనసాగించారు. ఐదేళ్లపాటు డేటింగ్ ఉన్నప్పటికీ ఎక్కడా రివీల్ చేయలేదు. ఆ తర్వాత చివరకు 27 అక్టోబర్ 2012న వివాహం చేసుకున్నారు. 9. నాగ చైతన్య-సమంత: 2009లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా సెట్స్లో యంగ్ హీరో నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభు మొదటిసారి కలుసుకున్నారు. వీరిద్దరు ప్రేమలో పడిన తర్వాత ఆటోనగర్ సూర్య, మనం వంటి చిత్రాల్లో కలిసి నటించారు. చైతూ సూపర్ హిట్ ప్రేమమ్ చిత్రంలో సామ్ అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే 2021లోనే నాగచైతన్య- సమంత తమ వివాహాబంధానికి ముగింపు పలికారు. 10. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్.. నవంబర్ 1న 2023న పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్లో జంటగావరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది. 11.మంచు మనోజ్- భూమా మౌనిక టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వారి కుటుంబంతో ఉన్న పరిచయంతో భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు. మంచు లక్ష్మీ నివాసంలో జరిగిన వివాహ వేడుకలో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. 12.సూపర్ స్టార్ కృష్ణ- విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. ఇద్దరి మనసులు కలవడంతో 1969లో రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికీ ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరితో పాటు ఇంకా టాలీవుడ్లో ప్రేమవివాహం చేసుకున్నా స్టార్స్ కూడా ఉన్నారు. సుమంత్- కీర్తి రెడ్డి, బాలాజీ-మధుమిత, వరుణ్ సందేశ్- వితికా షేరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. -
ప్రేమ వివాహం.. కూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు
తమిళనాడు: తిరుపూర్ జిల్లాలో పరువు హత్య చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా ఒరత్తనాడుకు చెందిన పెరుమాళ్ కూతురు ఐశ్వర్య (19). పూవలూరుకు చెందిన భాస్కర్ కుమారుడు నవీన్ (19). డిప్లమో చదివాడు. చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడిన వీరిద్దరూ తిరుపూర్ జిల్లా అరవప్పాలయంలోని ఓ ప్రైవేటు బనియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు వర్గాలకు చెందిన వీరిద్దరూ గత డిసెంబర్ 31న స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకుని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో వాట్సాప్లో వైరల్గా మారింది. ఈ విషయమై ఐశ్వర్య తండ్రి పెరుమాళ్ పల్లడం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2వ తేదీన పోలీసులు ఐశ్వర్యను తన కుటుంబీకులతో పంపారు. ఈ స్థితిలో గత 3వ తేదీన ఐశ్వర్యని ఆమె తండ్రి, బంధువులు కొట్టి వేధించి హత్య చేసి దహనం చేసినట్లు నవీన్కు అతని స్నేహితులు సెల్ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు. ఒరత్తనాడుకు వచ్చిన నవీన్ ఈ విషయాన్ని వట్టతిక్కోట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెయ్వడుతి, పూవలూరు గ్రామంలో బుధవారం తంజావూరు ఎస్పీ అసిస్రావత్ ఆధ్వర్యంలో పోలీసులు ఐశ్వర్య మృతదేహాన్ని దహనం చేసిన శ్మశాన వాటికను సందర్శించారు. మృతదేహాన్ని దహనం చేసిన తరువాత బూడిద కూడా లేకపోవడంతో పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఐశ్వర్య తండ్రి పెరుమాళ్, భార్య రోజా, ఐశ్వర్య అమ్మమ్మ మలర్, అతని సోదరి అగదాసి, 16 ఏళ్లబాలిక సహా 11 మందిని అరెస్టు చేసి విచారణ కోసం వట్టతిక్కోట్టై పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. పరారీలో వున్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
సినిమాకు మించిన ట్విస్టులు.. కారులో పెళ్లి.. అంతలోనే..
సాక్షి, బళ్లారి: సినిమా తరహాలో కారులోనే ఓ ప్రేమ జంట వివాహం చేసుకోవడం సంచలనం కలిగించింది. రాకింగ్ స్టార్ యశ్ నటించిన కిరాతక సినిమాలో ప్రేమ పెళ్లి జరిగిన విధంగా నగరంలో ఓ ప్రేమజంట కారులో మూడుముళ్లు వేసుకోవడం చూసి నగరవాసులు ఔరా అని నోరెళ్లబెట్టారు. కులాంతర వివాహం కావడంతో తల్లిదండ్రులు అడ్డు చెప్పడం వల్ల ప్రేమపక్షులు ఇలా చేశాయి. కొప్పళ అమ్మాయి, బళ్లారి అబ్బాయి.. వివరాలు... కొప్పళ జిల్లాకు చెందిన యువతి అమృత, బళ్లారి జిల్లాలోని తెక్కలకోటకు చెందిన యువకుడు శివప్రసాద్ ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరంటూ యువతి తల్లిదండ్రులు అడ్డు చెబుతూ వచ్చినా వారు పట్టించుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని బళ్లారి నగరంలోని శాంతిధామ సాంత్వన కేంద్రం వద్దకు చేరారు. ఇద్దరు కారులో పూలదండలు మార్చుకొని పెళ్లి అయిందనిపించారు. ఇరువర్గాల వాగ్వాదం.. ఇంతలో ఇరువర్గాల పెద్దలు వారిని అటకాయించారు. యువతి కొంతసేపు తనకు తల్లిదండ్రులు కావాలని, మరి కొంతసేపు ప్రేమికుడు కావాలని చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం నడిచింది. వధూవరులు కూడా గొడవలో తలదూర్చడంలో హైడ్రామా సాగింది. పోలీసులు వచ్చి ప్రేమికులను తెక్కలకోట పోలీస్ స్టేషన్కు తరలించి మాట్లాడారు, తరువాత యువతిని శాంతిధామ కేంద్రానికి తరలించారు. ఈ పెళ్లి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. పెళ్లయిన క్షణాల్లోనే జంటను విడదీయడం విశేషం. -
నవ దంపతుల ఆత్మహత్య
అనంతపురం: నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మండలంలోని గంగంపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ జనార్దన్ నాయుడు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల దాదాఖలందర్ (24), బోయ జ్యోత్స (20) రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరూ ఇంట్లో బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ నాయుడు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం
చెన్నై: తమిళనాడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కోటి కలలతో ఏడు అడుగులు వేసిన జంటను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన అనేక పరువు హత్యలను గుర్తుకు తెచ్చింది. తమకంటే పేదవాడైన అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో నవదంపతులను సొంత తండ్రే హత్య చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం..కోవిల్పట్టికి చెందిన మరిసెల్వం (24), ఎం కార్తీక (20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇంటినుంచి పారిపోయారు. రక్షణ కోరుతూ కోవిల్పట్టి ఈస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆశ్రయించారు. ఆ తర్వాత అదే రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకుని బుధవారం వరకు కోవిల్పట్టిలో ఉన్నారు. సంచలనం సృష్టించింది. ఇదిలావుండగా, వీరి పెళ్లి ముందు ఇరు కుటుంబాలు వ్యతిరేకించినప్పటికీ పెళ్లి తరువాత, సెల్వం కుటుంబం కొత్త జంటను ఆదరించింది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా సెల్వం తన భార్య కార్తీకతో కలిసి జిల్లాలోని మురుగేషన్ నగర్ ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నాడు. దీంతో అదను కోసం వేచి చూస్తున్న దుండగులు పథకాన్ని పక్కాగా అమలు చేశారు. మూడు బైక్లపై వచ్చిన ఆరుగురు గుర్తుతెలియని ముఠా మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడి నవ దంపతులపై దాడి చేసి హత్య గావించింది ఆ తరువాత అక్కడినుంచి అక్కడి నుండి పారిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని తూత్తుకుడి ఎస్పీ ఎల్ బాలాజీ శరవణన్ తెలిపారు. అలాగే అమ్మాయి తండ్రి ముత్తు రామలింగం కిరాయి హంతకులతో వారిద్దరినీ హత్య చేయించినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. మూడు ప్రత్యేక బలగాలతో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
భార్య, మామపై అల్లుడి హత్యాయత్నం
వైఎస్సార్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేస్తుండగా అడ్డొచ్చిన మామపై కూడా అల్లుడు విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మంగళవారం ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. సీఐ శివాంజనేయులు, ఎస్ఐ గాయత్రి కథనం మేరకు వివరాలు.. మండలంలోని దేవులచెరువు పంచాయతీ రాజుగారిపల్లెకు చెందిన చంద్రశేఖర్, వసంతమ్మ కుమార్తె అపూర్వ(25)కు అదే గ్రామానికి చెందిన దేవరాజుతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వీరంతా అపూర్వ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం టమాట డబ్బులు రూ. 2 లక్షలు అల్లుడు వాడుకున్నాడని మామ చంద్రశేఖర్ అడగడంతో అప్పుల వాళ్లకు కట్టినట్లు చెప్పాడు. డబ్బుల విషయమై ఇంట్లో గొడవ జరిగింది. దీంతో అత్తామామల ఇంట్లో ఉండకుండా భార్య, పిల్లలతో దేవరాజు వేరుగా కాపురం పెట్టాడు. డబ్బుల విషయంపై తరచూ దేవరాజుకు, అతని భార్య అపూర్వకు మధ్య గొడవ జరిగేది. దీంతో రెండు రోజుల క్రితం ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. డబ్బు విషయమై తనను అవమానించారని భార్య, మామపై కక్ష పెంచుకున్న దేవరాజు తన భార్య అపూర్వ పొలం వద్ద పనులు చేసుకుంటుండగా ఆమైపె కత్తితో దాడికి దిగాడు. గమనించిన మామ చంద్రశేఖర్ అడ్డురావడంతో మామపై కూడా దాడిచేసి పారిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం తంబళ్లపల్లె పీహెచ్సీకి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనతో తిరుపతికి తరలించారు. సీఐ శివాంజనేయులు రాజుగారిపల్లెకు వెళ్లి జరిగిన సంఘటనపై విచారించారు. అపూర్వ తల్లి వసంతమ్మ ఫిర్యాదుతో దేవరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి ముందు వరకు నాకు ఆ విషయం తెలియదు: అనసూయ
యాంకర్ అనసూయ గురించి అందరికి తెలిసిందే. బుల్లితెరపై గ్లామర్ క్వీన్గా పేరు సంపాదించి.. ఇప్పుడు వెండితెరపై రాణిస్తోంది. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీ చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఏ విషయం గురించి అయినా ముక్కు సూటిగా మాట్లాడడం అనసూయకు అలవాటు. తన పర్సనల్ విషయాలను కూడా ఓపెన్గానే షేర్ చేసుకుంటుంది. తాజాగా తన భర్త భరద్వాజ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. 9 ఏళ్లుగా ప్రేమలో అనసూయది ప్రేమ వివాహం. ఇంటర్లో ఉన్నప్పుడు భరద్వాజ్తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత భరద్వాజ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే అనసూయ వెంటనే ఓకే చెప్పలేదు. ఏడాదిన్నర తర్వాత ఆయన ప్రేమను అంగీకరించింది. 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2010లో వివాహం చేసుకున్నారు. మొదట్లో వీరి వివాహానికి కుటుంబం సభ్యులు ఒప్పుకోలేదు. కానీ ఇద్దరూ పట్టుపట్టి మరీ ఒప్పించారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కొడుకులు. భరద్వాజ్ కులం ఏంటో తెలియదు: అనసూయ తొమిదేళ్లుగా ప్రేమలో ఉన్నా.. వీరిద్దరి మధ్య కుల ప్రస్థావన ఒక్కసారి కూడా రాలేదట. లగ్న పత్రిక రాసే ముందు వరకు భరద్వాజ్ కులం ఏంటో అనసూయకు తెలియదట. ‘పెద్ద కాపు – 1’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘కుల మతాలను నేను ఎక్కువగా పట్టించుకోను. తొమ్మిదేళ్లు ప్రేమలో ఉన్నప్పటికీ.. భరద్వాజ్ కులం ఏంటో నాకు తెలియదు. లగ్న పత్రిక రాసే ముందు గోత్రం, కులం అడిగారు. అప్పుడు ఆయన పలాన కులానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. మేమిద్దరం కులమతాలను పట్టించుకోం’ అని అనసూయ చెప్పుకొచ్చింది. -
బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు..
సైదాబాద్(హైదరాబాద్): వైద్యానికైన బిల్లు చెల్లించేస్తోమత లేక నిరుపేద దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. ఐదురోజులుగా ఎంత ప్రయత్నించినా ఆదుకునేనాథుడులేక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో నివసించే నితిన్, ప్రవల్లిక ఏడాదిన్నర క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. నితిన్ కిరాయి ఆటో నడుపుతూ భార్యను పోషిస్తున్నాడు. 13 రోజుల క్రితం వారికి కూతురు జన్మించింది. అయితే పసిపాపకు ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒవైసీ ఆసుపత్రిలో చేర్చారు. ఏడురోజుల చికిత్స అనంతరం చిన్నారి కోలుకుంది. వైద్యానికిగాను రూ.లక్షా 16 వేల బిల్లు అయింది. అయితే వారి వద్ద కేవలం రూ. 35 వేలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన డబ్బులు కట్టడానికి సహాయం కోసం ఎవరిని అడిగినా ఫలితం లేకపోయింది. దాంతో బిల్లు కట్టలేక ఆ దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. గత ఐదు రోజులుగా తమను ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం సేవాలాల్ బంజారా సంఘం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ దాతలు ఈ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి ఆసుపత్రి బిల్లు కట్టేందుకు సాయం చేయాలని కోరారు. -
కూతురుకి ప్రేమ పెళ్లి చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
-
కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన పెద్ద కుమార్తె పల్లవికి ఆదర్శ వివాహం చేశారు. రాచమల్లు శివప్రసాద్రెడ్డి కుమార్తె పల్లవి, కమ్మర లీలా గోపి పవన్కుమార్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు అయిప్పటికీ వారి పెళ్లికి ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పలేదు. ఆయనే స్వయంగా పల్లవి, పవన్కుమార్లను గురువారం స్థానిక బొల్లవరంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు. అనంతరం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో వారికి రిజిష్టర్ మ్యారేజీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీఏ చదివేటప్పుడు పవన్కుమార్ను ప్రేమించిందని తెలిపారు. తన కుమార్తె ఇష్ట్రపకారం మనస్ఫూ ర్తిగా ప్రేమ వివాహం చేశానని చెప్పారు. పవన్కుమార్ తండ్రి ఆర్టీసీలో మెకానిక్గా పనిచేస్తున్నారని, ఇష్టపడిన అబ్బాయితో కుమార్తె వివాహం చేశానన్న తృప్తి తనకు ఉందని వివరించారు. వాస్తవానికి ఈ వివాహాన్ని ఘనంగా చేయాలని భావించానని, అయితే తన కు మార్తె ఇందుకు అంగీకరించకపోవడంతో నిరాడంబరంగా జరిపించానని ఎమ్మెల్యే చెప్పారు. చదవండి: ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం -
కూతురికి ప్రేమ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
-
సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్రీవిద్య అనుమానాస్పద మృతి
కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తే సర్వం అని ఆ యువతి అతని వెంట నడచింది. వివాహం జరిగి ఆరు నెలలు కూడా తిరక్కుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. దీంతో ఆమె కన్నవాళ్లు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబీకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండలంలోని మల్లెల దళితవాడకు చెందిన నరసింహులు, ఉషారాణి దంపతుల కుమార్తె శ్రీవిద్య (22) మదనపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. నీరుగంటివారిపల్లిలో కాపురం ఉండే మల్లీశ్వరి, మారపరెడ్డి దంపతుల కుమారుడు విజయ్ కుమార్రెడ్డి (23)తో కాలేజీ రోజుల్లోనే ప్రేమ మొదలైంది. యువకుని కుటుంబీకులు అడ్డుచెప్పినా ఇద్దరూ ఈ ఏడాది మార్చి నెలలో మదనపల్లిలోని ఓ ఆలయంలో దండలు మార్చుకుని అనంతరం అక్కడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి నమోదు చేసుకున్నారు. బెంగళూరులో కాపురం తరువాత బెంగళూరులోని మునిరెడ్డిపాళ్యలో కాపురం పెట్టారు. యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుండగా యువకుడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం దంపతులిద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. అనంతరం ఏం జరిగిందో ఏమో శ్రీవిద్య ఇంట్లోనే మంచంపై శవమై తేలింది. విజయ్కుమార్రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రులు మృతదేహాన్ని సోమవారం మల్లెలదళితవాడకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనేది అక్కడి పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
విదేశీ యువతులు.. తెలుగింటి కోడళ్లు..
ఆదిలాబాద్: పెళ్లంటే ఒకప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల చరిత్రను చూసి సంబంధాలు కుదుర్చుకునే వారు. క్రమంగా ఆ సంప్రదాయానికి కాలం చెల్లుతోంది. ఉన్నత చదువుల కోసం, వృత్తిరీత్యా స్థిరపడేందుకు విదేశాల బాట పడుతున్న యువత అక్కడే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రేమించి.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొస్తున్నారు. ఇక్కడి అబ్బాయిలను ఇష్టపడుతున్న విదేశీ యువతులు భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొని మెట్టినింట్లో అడుగు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలుగింటి కోడళ్లుగా అడుగు పెట్టిన విదేశీ అమ్మాయిలపై ప్రత్యేక కథనం. ►అమెరికా అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి.. (టేలర్ డయానా – అభినయ్రెడ్డి) ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాకు చెందిన యువతిని ప్రేమించి గత అక్టోబర్లో పెద్దల అంగీకారంతో మనువాడాడు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా బంధుమిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఏడడుగులు కలిసి నడిచారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దేవీదాస్– కళావతి దంపతుల పెద్ద కుమారుడు అభినయ్రెడ్డి, అమెరికాకు చెందిన టేలర్ డయానా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు. వారి అంగీకారంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లో ఆదిలాబాద్ అబ్బాయి, అమెరికా అమ్మాయికి చెందిన ఇరుకుటుంబాల పెద్దలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు కూడా హాజరై ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతితో పాటు భారతీయ వంటకాలు చాలా ఇష్టమని వారు చెప్పడం గమనార్హం. వధూవరులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ►ఆస్ట్రేలియా అమ్మాయి.. నిర్మల్ అబ్బాయి.. (హనా,ఆస్ట్రేలియా – నామని కార్తీక్) ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి నిర్మల్ అబ్బాయితో ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది. నిర్మల్ శాస్త్రినగర్ కాలనీకి చెందిన నామని పద్మ– సదానందం దంపతుల కుమారుడు కార్తీక్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ హనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కార్తీక్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుండగా, అమ్మాయి హనా అక్కడే మెడ్ల్యాబ్లో సైంటిస్టుగా పనిచేస్తోంది. వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించారు. ఆగస్టు 22న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ మహోత్సవానికి వధువు తల్లిదండ్రులు వెరోనికా–డార్రెన్ దంపతులు సైతం హాజరై హిందూ సంప్రదాయరీతిలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని టౌన్స్ ప్రిన్సిల్యాండ్స్లోకొత్తకాపురం మొదలుపెట్టారు. ►మయన్మార్ అమ్మాయి.. గుడిహత్నూర్ అబ్బాయి.. (కేథరీన్ – గొల్లపల్లి రవికుమార్) మయన్మార్ అమ్మాయి, గుడిహత్నూర్ అబ్బాయి ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు. గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన గొల్లపల్లి రవికుమార్కు, మయన్మార్కు చెందిన కేథరీన్ ప్రేమించుకున్నారు. రవికుమార్ ఆరేళ్ల క్రితం ఖాతర్ దేశానికి వెళ్లాడు.. మయన్మార్లోని జిన్న్వేథేన్ నగరంలో ఓ హోటల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఆమోదం తెలిపారు. చింతగూడలో సెయింట్ థామస్ చర్చిలో గత ఫిబ్రవరి 6న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి అమ్మాయి సోదరుడు క్యాహు థియేన్ హాజరుకాగా, వరుడి తరఫున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరై ఆశీస్సులు అందజేశారు. -
అక్కాతో వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్య..
కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే మోసం చేసిందనే ఆవేదనతో భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బీబీఎంపీలో పౌర కార్మికుడిగా పని చేస్తున్న లోకేశ్ చిక్కమారనహళ్లిలో నివాసం ఉంటున్నాడు. 11 ఏళ్ల క్రితం శశికళ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు ఇద్దరు చిన్నారులున్నారు. ఇతనికి చిరంజీవి అనే స్నేహితుడు ఉన్నాడు. శశిళకళను అక్కా అక్కా అని పిలిచేవాడు. అయితే శశికళ, చిరంజీవి సన్నిహితంగా ఉండటాన్ని గమనించి లోకేష్ షాకయ్యాడు. శశికళ తనను మోసం చేసిందనే బాధతో తోట వద్దకు వెళ్లాడు. శశికళ చేసిన మోసాన్ని సూసైడ్ నోట్ రాసి ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు వస్తాడని తల్లి ఎదురు చూస్తుండగా పెంపుడుకుక్క లోకేశ్ విగతజీవిగా ఉన్న చోటుకు తీసుకెళ్లింది. నెలమంగల గ్రామాంతర పోలీసులు వచ్చి మృతదేహాన్ని, ఘటన స్థలంలో పడి ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కలకాలం తోడుంటానని చెప్పి..
కిర్లంపూడి: బైక్పై వెళ్తున్న ఆ ఇద్దరి పైకి ట్రాలీ రూపంలో మృత్యువు దూసుకువచ్చింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కిర్లంపూడి ఎస్సై బి.ఉమామహేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని సింహాద్రిపురం అడ్డురోడ్డు నర్సరావు కాలనీకి చెందిన గొడుగుల దుర్గామల్లేశ్ (21) అడ్డురోడ్డులో మోటార్ సైకిల్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఇసుకపల్లి బాల వీర వెంకట సత్య దుర్గసాయి అలియాస్ బాలు (15) ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ కలసి శుక్రవారం అర్ధరాత్రి ప్రత్తిపాడు వైపు బైక్పై వెళ్తున్నారు. అదే మార్గంలో ఎదురుగా వస్తున్న ట్రాలీ జగపతినగరం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వీరి బైక్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలు అక్కడికక్కడే మరణించాడు. ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్గా మల్లేశ్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, లారీని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై శనివారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు. వివాహమైన కొద్ది నెలల్లోనే.. ఈ ప్రమాదంలో మృతుడు దుర్గా మల్లేశ్ 15 నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏలేశ్వరం మండలం మొక్కారావు కాలనీకి చెందిన కొండేటి సోమరాజు కుమార్తె దేవి, మల్లేశ్ ప్రేమించుకుని, గత ఏడాది మే నెలలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన వ్యక్తితో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని దేవి ఎన్నో కలలు కంది. ఆ కలలు నెరవేరకుండానే ట్రాలీ రూపంలో మృత్యువు తన భర్తను బలిగొందని దేవి పెద్ద పెట్టున విలపిస్తోంది. మృతుడు మల్లేశ్కు భార్యతో పాటు తల్లిదండ్రులు నాగమణి, చిన్నరామస్వామి, సోదరి ఉన్నారు. అతడి మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ప్రయోజకుడిని చేయాలని.. శివమ్మ, వీరబాబు దంపతులకు బాలు లేకలేక పుట్టిన ఒక్కగానొక్క సంతానం. దీంతో అతడిని ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు. తాము పడుతున్న ఇబ్బందులు కొడుకు పడకూడదనే ఉద్దేశంతో వడ్రంగి పనికి వెళ్తూ.. బాలును వారు బాగా చదివించుకుంటున్నారు. పెద్దయ్యాక ప్రయోజకుడై తమకు ఆసరాగా నిలుస్తాడని జీవిస్తున్న తమ ఆశల్ని మృత్యువు చిదిమేసిందంటూ బాలు తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. -
కులాంతర వివాహం చేసుకున్నాడని దాడి
ప్రకాశం: తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్న యువకుడి తల్లి, అక్కపై యువతి తల్లిదండ్రులు దాడిచేసి గాయపరిచిన సంఘటన దర్శి మండలం బొట్లపాలెం ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. డీఎస్పీ అశోక్వర్ధన్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ దంపతుల కుమార్తె భార్గవి ఎస్సీ కులానికి చెందిన అనురాధ కుమారుడు సాయిరాం మార్చి 2వ తేదీన వివాహం చేసుకున్నారు. వారి వినతి మేరకు రక్షణ కల్పించాలని ఎస్పీ మలికాగర్గ్ దర్శి పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేసి ఎలాంటి గొడవలు పడవద్దని చెప్పి పంపారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మ కలిసి అర్ధరాత్రి ఎస్సీ కాలనీకి వెళ్లి యువకుడి తల్లి అనూరాధ, ఆమె కుమార్తె మౌనిక కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. మౌనికను కత్తితో పొడవబోగా చేయి అడ్డు పెట్టడంతో ఆమె చేతికి గాయమైంది. ఇనుపరాడ్డుతో తలపై కొట్టి గతంలో ఉన్న కేసులు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని భయబ్రాంతులకు గురిచేశారు. వారిద్దరినీ కొట్టుకుంటూ బ్రహ్మారెడ్డి ఇంటికి తీసుకువెళ్లి కట్టేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రహ్మారెడ్డి ఇంట్లో తాళ్లతో కట్టేసి ఉన్న అనూరాధ, అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను గుర్తించారు. వారిని పోలీసు వాహనంలో తీసుకెళ్లి దర్శి సీహెచ్సీలో వైద్యం అందించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ అశోక్వర్థన్ తెలిపారు. బాధితులను ట్రైనీ ఎస్పీ అంకితా సురానా పరామర్శించారు. ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. -
ఒకరితో ప్రేమ.. మరొకరితో రహస్య వివాహం
విశాఖపట్నం: ట్రయాంగిల్ లవ్స్టోరీ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒకరిని పేమించి.. మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది. వివాహం చేసుకున్న వాడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివీ.. కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన బాలిక(16) ఇటీవల ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు పలువురు యువకులతో పరిచయాలున్నాయి. ఆదర్శనగర్కు చెందిన సీపాన సూర్యప్రకాష్రావుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ.. ఇందిరానగర్కు చెందిన లెంకా సాయికుమార్ను రహస్యంగా వివాహం చేసుకుంది. ఆమె సూర్యప్రకాష్తో చనువుగా ఉండడంతో సాయికుమార్కు నచ్చలేదు. అలాగే సాయికుమార్తో చనువుగా వ్యవహరించడం సూర్యప్రకాష్కు నచ్చలేదు. దీంతో వీరి ముగ్గురి మధ్య మనస్పర్థలు వచ్చాయి. బాలిక ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఆమె ఇంటికి ఇద్దరూ వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన ఆమె.. ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సూర్య ప్రకాష్, సాయికుమార్లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్యప్రకాష్ గోపాలపట్నం ఆర్ఆర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు సూర్యప్రకాష్గా గుర్తించారు. లంకా సాయికుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ప్రియుడి కోసం ప్లాన్.. తండ్రిని కారు ఆపమని, హఠాత్తుగా వెనుక నుంచి..
ముంబై: తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని ఓ కూతురు దారుణానికి పాల్పడింది. తన ప్రియుడితో కలిసి ప్లాన్ కూడా చేసింది. అందుకోసం కొందరిని మాట్లాడుకుని సఫారీ కూడా ఇచ్చింది. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది. అసలేం జరిగిందంటే.. పోలీసుల కథనం ప్రకారం.. షోలాపూర్ జిల్లా మాదా తాలూకాకు చెందిన మహేంద్ర షా వ్యాపారి. అతని కుమార్తె సాక్షి. ఆమె చైతన్య అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరి ప్రేమకు తన తండ్రి అంగీకరించడని భావించిన సాక్షి.. ప్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.అయితే తన తండ్రి నుంచి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని.. ఏకంగా కన్న తండ్రినే అడ్డుతొలగించుకోవాలనుకుని పథకం వేసింది. అందులో భాగంగా పూణె వెళ్లిన సాక్షి ఆదివారం రాత్రి మాదాకు తిరిగి వచ్చింది. షెట్ఫాల్ ప్రాంతంలో బస్సు దిగి తన తండ్రిని రమ్మని పిలిచింది. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు మహేంద్ర కారులో వచ్చాడు. తర్వాత తిరిగి వెళ్తుండగా వడచివాడి గ్రామ సమీపంలో సాక్షి తండ్రిని కారు ఆపమంది. అసలు విషయం తెలియన ఆ తండ్రి కారు ఆపగానే.. హఠాత్తుగా రెండు బైక్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. వారు అతన్ని తీవ్రంగా కొట్టారు, అతని రెండు కాళ్ళు విరిచారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచాడు. మహేంద్ర గట్టిగా అరవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మహేంద్ర అరుపులు విన్న వాడచివాడి గ్రామ ఉపసర్పంచ్ బాపు కాలే, రామ్ చరణ్ అనే మరో వ్యక్తి సంఘటనా స్థలానికి వచ్చారు. తీవ్ర గాయాలపాలైన మహేంద్రను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కుమార్తె ప్రధాని నిందితురాలిగా తేలింది. ఈ కుట్రలో ఆమె ప్రియుడు కూడా హస్తం ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: Hyderabad: అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య ఆత్మహత్య
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి
జన్మభూమి కమిటీలతో టీడీపీ దోపిడీ
పథకాల నగదును చంద్రబాబే ఆపించారు
వ్యాపారులపై పగబట్టిన దామచర్ల
జగనన్న పంపిన సేవకుడిని
మౌలిక వసతులకు పెద్దపీట
అధునాతన వైద్యం
'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
పరిశ్రమలపై పనికిమాలిన కథ
సీఎం జగన్తోనే రాష్ట్రాభివృద్ధి
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement