-
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఐరీష్ జట్టుకు పాల్ స్టిర్లింగ్ నాయకత్వం వహించనున్నాడు. వరల్డ్కప్తో పాటు స్వదేశంలో పాకిస్తాన్తో జరిగే టీ20 సిరీస్, నెదర్లాండ్స్ ,స్కాట్లాండ్తో జరిగే ట్రై-సిరీస్కు ఐర్లాండ్ కూడా తమ జట్టును ప్రకటించింది.టీ20 వరల్డ్కప్లో పాల్గోనే జట్టునే ఈ రెండు సిరీస్లకు కూడా ఐరీష్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐరీష్ పేసర్ జాషువా లిటిల్.. పాక్, డచ్, స్కాట్లాండ్తో ట్రై-సిరీస్కు దూరం కానున్నాడు.ఇక ఐరీష్ వరల్డ్కప్ జట్టులో మాజీ కెప్టెన్ బల్బర్నీ, హ్యారీ టెక్టార్, కాంఫ్హెర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్ తమ తొలి మ్యాచ్లో జూన్ 5న టీమిండియాతో తలపడనుంది. ఐర్లాండ్ టీ20 వరల్డ్కప్ జట్టు:పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెక్కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.పాక్, పాక్, డచ్, స్కాట్లాండ్తో ట్రై-సిరీస్కు ఐరీష్ జట్టు:పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, బారీ మెక్కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్. -
ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్ల కోసం పాక్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ జట్టులో కూడా వీరే..!
ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగే ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం 18 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (మే 2) ప్రకటించారు. ఇదే జట్టు నుంచే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేస్తామని పాక్ సెలెక్టర్లు తెలిపారు. ఇంగ్లండ్తో తొలి టీ20 (మే 22) అనంతరం వరల్డ్కప్ జట్టు ప్రకటన ఉంటుందని వెల్లడించారు. జట్ల ప్రకటనకు మే 24 డెడ్లైన్ కావడంతో ఆలోపే తమ వరల్డ్కప్ జట్టును వెల్లడిస్తామని పీసీబీ ప్రతినిధులు తెలిపారు. పాక్ ఐర్లాండ్ పర్యటన ఈనెల 10న మొదలవుతుంది. ఈ పర్యటనలో పాక్ మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది. మే 10, 12, 14 తేదీల్లో డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం పాక్ ఐర్లాండ్ నుంచి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. మే 22, 25, 28, 30 తేదీల్లో నాలుగు టీ20 జరుగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన అనంతరం పాక్ ఇక్కడి నుంచే నేరుగా టీ20 ప్రపంచకప్ వేదికకు బయల్దేరుతుంది. టీ20 వరల్డ్కప్ యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జూన్ 1న ప్రారంభంకానుండగా.. ఈ టోర్నీలో పాక్ ప్రయాణం జూన్ 6న మొదలవుతుంది. ఆ రోజున జరిగే తమ తొలి మ్యాచ్లో పాక్ ఆతిథ్య యూఎస్ఏతో తలపడనుంది. డల్లాస్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్లో పాక్.. భారత్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా జట్లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది.పాక్ జట్టు విషయానికొస్తే.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేసిన పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వం వహించనున్నాడు. పేసర్ హసన్ అలీ చాలాకాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అఘా సల్మాన్ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. కొద్దిరోజుల కిందట స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న హరీస్ రౌఫ్, ఆజమ్ ఖాన్ తిరిగి జట్టులోకి చేరారు. మణికట్టు స్పిన్నర్ ఉసామా మీర్, పేసర్ జమాన్ ఖాన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు.ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉస్మాన్ ఖాన్ -
‘ఐర్లాండ్లో భారత రాయబారిని వెంటనే తొలగించాలి’
ఐర్లాండ్లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అఖిలేష్ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైం రమేష్ స్పందించారు. అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు చేయటం వృతిపరంగా ఆయన అవమానకరమైన ప్రవర్తనకు నిదర్శనం అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘భారత ప్రభుత్వాన్ని సమర్థించటం ఊహించినదే. కానీ, ఒక రాయబారి ప్రతిపక్ష పార్టీలపై బహిరంగంగా ఇలా విమర్శలు చేయటం సరికాదు. ఆయనది వృత్తిపరంగా చాలా అవమానకరమై ప్రవర్తన. రాయబారిగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా సిగ్గుచేటు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదించదగినవి కాదు. ఆయన సర్వీసు నియమాలను ఉల్లంఘించారు. వెంటనే రాయబారి పదవి నుంచి తొలగించాలి’ అని జైరాం రమేష్ మండిపడ్డారు. అఖిలేష్ మిశ్రా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఐర్లాండ్లోని ఓ దినపత్రికలో ప్రచురితమైన సంపాదకీయంలో ‘మోదీకి అపూర్వమైన ప్రజాదరణ ఉంది’ అనే శీర్షికపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన ప్రజాదరణ పొందారు. దానికి మోదీ వ్యక్తిగత స్వాభావంతో పాటు పరిపాలనలో చూపించే సమగ్రత, స్థిరమైన అభివృద్ధిపై నాయకత్వమే కారణం. మోదీ రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. భారత్తో పాటు ప్రపంచ దేశాల్లోని లక్షలాది ప్రజలకు మోదీ వ్యక్తిగత జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకే కుటుంబానికి చెందిన అవినీతి పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయటమే మోదీకి పెరుగుతన్న ప్రజాదరణ వెనక ఉన్న ప్రధానమైన అంశం’ అని అఖిలేష్ మిశ్రా అన్నారు. ‘సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకొని ప్రధాని మోదీ ప్రభుత్వం భారత్లో అవినీతిని అంతం చేయటంలో విజయం సాధించింది. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా దృఢమైనది. 80 శాతం హిందూ మెజార్టీ ఉన్న భారతదేశాన్ని కొందరు మూస పద్దతులతో తప్పదారి పట్టిస్తున్నారు’ అని అఖిలేష్ మిశ్రా తెలిపారు. ఇక.. ‘అత్యంత పక్షపాతంతో ప్రధాని మోదీ, భారత ప్రజాస్వామ్యం, చట్టం అమలు చేస్తున్న సంస్థలపై విమర్శలు చేస్తున్నారు’ అని డబ్లిన్లోని భారత రాయబార కార్యాలయం అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. Ambassador @AkhileshIFS’s rejoinder to @IrishTimes' highly biased & prejudiced editorial [Modi tightens his grip” April 11, 2024)], casting aspersion on Prime Minister of India, Shri @narendramodi, Indian democracy, law enforcement institutions & “Hindu-majority” people of India. pic.twitter.com/Oh5rFly92Z — India in Ireland (Embassy of India, Dublin) (@IndiainIreland) April 15, 2024 -
నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్
షార్జా వేదికగా ఐర్లాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది (2-1 తేడాతో). నిన్న (మార్చి 18) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 17.2 ఓవర్లలో 98 పరుగులకే చాపచుట్టేసింది. మెరుపు అర్దశతకంతో సత్తా చాటిన జద్రాన్.. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మెరుపు అర్దశతకంతో విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో జద్రాన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. మొహమ్మద్ ఇషాక్ (27), సెదీఖుల్లా అటల్ (19), ఇజాజ్ అహ్మద్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్కార్తీ, కర్టిస్ క్యాంపర్, డెలానీ, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్.. 156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4-0-9-4), నవీన్ ఉల్ హక్ (2.2-0-10-3) నిప్పులు చెరగడంతో 98 పరుగులకే కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ, రషీద్ ఖాన్, ఖరోటే తలో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంపర్ (28) టాప్ స్కోరర్గా నిలువగా.. గెరాత్ డెలానీ (21), హ్యారీ టెక్టార్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ ఐర్లాండ్ గెలువగా.. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
Viral Video: కళ్లు చెదిరే సిక్సర్ బాదిన రషీద్ ఖాన్
ఐర్లాండ్తో నిన్న జరిగిన రెండో టీ20 ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో ఇరగదీసిన రషీద్.. ఆతర్వాత బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీఖుల్లా అటల్ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పై ముగ్గురు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఎవ్వరూ రాణించలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 3, జాషువ లిటిల్, బ్యారీ మెక్కార్తీ తలో 2 వికెట్లు, బెంజమిన్ వైట్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. రషీద్ ఖాన్ (4-0-14-4), ఖరోటే (4-0-23-2), నబీ (3-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో బల్బిర్నీ (45), గ్యారెత్ డెలానీ (39) మాత్రమే రాణించారు. We have seen that before! 😄 Just @RashidKhan_19 being Rashid Khan! 🤩👏🙌#AfghanAtalan | #AFGvIRE2024 pic.twitter.com/yxRqBibMQf — Afghanistan Cricket Board (@ACBofficials) March 17, 2024 బంతిని చూడకుండానే సిక్సర్ బాదిన రషీద్.. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన రషీద్ ఖాన్ అడపాదడపా బ్యాట్తోనూ ప్రతాపం చూపించడం తెలిసిందే. ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో రషీద్ మరోసారి బ్యాట్తో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్లో 18వ ఓవర్ ఆఖరి బంతికి రషీద్ బాదిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. బ్యారీ మెక్కార్తీ బౌలింగ్లో రషీద్ బంతిని చూడకుండానే సిక్సర్గా మలిచాడు. లెగ్సైడ్ దిశగా మెక్కార్తీ సంధించిన ఫుల్ టాస్ బంతిని రషీద్ కళ్లు మూసుకుని సిక్సర్ కొట్టాడు. రషీద్కు ఇలాంటి షాట్లు ఆడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి షాట్లు చాలాసార్లు ఆడాడు. రషీద్ బాదిన ఈ సిక్సర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఐర్లాండ్ తొలి మ్యాచ్లో గెలవగా.. ఆఫ్ఘనిస్తాన్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (మార్చి 18) జరుగనుంది. -
రీ ఎంట్రీలో అదరగొట్టిన రషీద్ ఖాన్.. 14 ఏళ్ల రికార్డు బద్దలు
అఫ్గానిస్తాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న రషీద్.. శుక్రవారం ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన రీ ఎంట్రీ మ్యాచ్లో రషీద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో రషీద్ సత్తాచాటాడు. తన 4 ఓవర్ల కోటా స్పెల్లో 19 పరుగులిచ్చి రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. పాల్ స్టిర్లింంగ్, క్యాంప్హెర్ వంటి కీలక వికెట్లను ఖాన్ పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అఫ్గానిస్తాన్ కెప్టెన్గా రషీద్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆ జట్టు మాజీ కెప్టెన్ నవ్రోజ్ మంగల్ పేరిట ఉండేది. 2014 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో ఐర్లాండ్పై మంగల్ 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్తో మంగల్ ఆల్టైమ్ రికార్డును రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ అనుహ్యంగా 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా ఐపీఎల్-2024 సీజన్కు ముందు రషీద్ ఫుల్ ఫిట్నెస్ సాధించడం గుజరాత్ టైటాన్స్కు కలిసొచ్చే అంశం. The Magician King @rashidkhan_19 is Back https://t.co/FkSsk7O91b — Baaz Khan (@Im_BaazKhan) March 15, 2024 -
అఫ్గానిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్..
అఫ్గానిస్తాన్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. షార్జా వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి టీ20లో 38 పరుగుల తేడాతో ఐర్లాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(56) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు బల్బర్నీ(22), స్టిర్లింగ్(25) పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నంగేయాలియా ఖరోటే 2వికెట్లు, ఓమర్జాయ్ చెరో వికెట్ సాధించారు. చెలరేగిన బెంజిమిన్ వైట్.. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 38 పరుగుల తేడాతో అఫ్గాన్ ఓటమి పాలైంది. ఐర్లాండ్ స్పిన్నర్ బెంజిమిన్ వైట్ 4 వికెట్లతో అఫ్గాన్ను దెబ్బతీశాడు. అతడితో పాటు లిటిల్ 3 వికెట్లు, మెక్గ్రాతీ రెండు, అడైర్ వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ ఇషాఖ్(32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 17న జరగనుంది. చదవండి: CSK: సీఎస్కేకు బిగ్ షాక్! డెత్ ఓవర్ల స్పెషలిస్టు అవుట్! -
గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్.. స్టార్ వచ్చేస్తున్నాడు!
IPL 2024- Gujarat Titans: అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ ధ్రువీకరించాడు. కాగా అఫ్గన్ లెగ్ స్పిన్నర్ భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ, లీగ్ క్రికెట్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో మార్చి 15 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్- ఐర్లాండ్ టీ20 సిరీస్తో తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు రషీద్ ఖాన్ వెల్లడించాడు. ‘‘రానున్న సిరీస్లో జాతీయ జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టాను. అన్నీ సజావుగా సాగుతున్నాయి. నిజానికి సర్జరీ కారణంగా గడిచిన మూడు నెలల కాలం కష్టంగా తోచింది. ఏడెనిమిది నెలలుగా వెన్నునొప్పి బాధపెడుతోంది. వరల్డ్కప్ టోర్నీకి ముందుగానే సర్జరీకి వెళ్తే బాగుంటుందని డాక్టర్లు సూచించారు. అయితే, ఐసీసీ మెగా ఈవెంట్లో దేశం తరఫున ఆడాలనే నేను నిర్ణయించుకున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడంతా బాగుంది. రానున్న రోజులు మరింత గొప్పగా ఉంటాయని భావిస్తున్నాను’’ అని రషీద్ ఖాన్ అఫ్గన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా.. టీ20 వరల్డ్కప్-2024కు ముందు ఐపీఎల్ ఆడటం కూడా తమకు కలిసి వస్తుందని రషీద్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్కాగా రషీద్ ఖాన్ రీఎంట్రీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు కూడా శుభవార్తగా పరిణమించింది. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడి ముంబై ఇండియన్స్ సారథి కాగా.. మహ్మద్ షమీ తాజా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఆగమనం టైటాన్స్కు ఊరట కలిగించనుంది. ఇక గత సీజన్లో రషీద్ ఖాన్ 17 మ్యాచ్లు ఆడి 27 వికెట్లు తీశాడు. తద్వారా అత్యధిక వికెట్ టేకర్ల మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. మార్చి 15- 18 వరకు అఫ్గన్- ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇక ఐపీఎల్-2024లో గుజరాత్ మార్చి 24న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ -
39 మ్యాచ్ల చిన్న కెరీర్లో ఆరో శతకం సాధించిన కేకేఆర్ బ్యాటర్
ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్, ఆ జట్టు వికెట్కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్భాజ్ తన వన్డే కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్లో కేకేఆర్కు ఆడుతున్న ఈ 22 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్.. తన 39 మ్యాచ్ల కెరీర్లో ఆరో శతకం సాధించాడు. ఇంత స్వల్ప కెరీర్లో ఇన్ని సెంచరీలు సాధించడమంటే ఆషామాషీ విషయం కాదు. గుర్బాజ్ కెరీర్లో ఈ ఆరు శతకాలతో పాటు నాలుగు అర్దశతకాలు కూడా ఉన్నాయి. pic.twitter.com/J3sHi6z0OD— CricTracker (@Cricketracker) March 7, 2024 మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా షార్జా వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో గుర్బాజ్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 117 బంతులు ఎదుర్కొన్న గుర్బాజ్ 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. గుర్బాజ్తో పాటు మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (60), వెటరన్ మొహ్మద్ నబీ (40), కెప్టెన్ షాహిది (50 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో థియో వాన్ వోర్కోమ్ 3 వికెట్లు పడగొట్టగా.. హ్యూమ్, క్రెయిగ్ యంగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్కు ముందు ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో వారికంటే పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్కు పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను మట్టికరిపించింది. -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్.. ఆరేళ్ల నిరీక్షణకు తెర
ఐర్లాండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. రెడ్బాల్ క్రికెట్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తమ ఆరేళ్ల నిరీక్షణకు తెరదించింది. 2018లో టెస్టు హోదా పొందిన ఐర్లాండ్.. అప్పటి నుంచి తొలి గెలుపు కోసం ఆరేళ్లగా ఎదురుచూస్తోంది. ఇక ఈ మ్యాచ్లో 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండీ బల్బిర్నీ (58) నాటౌట్గా నిలిచి తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. అతడితో పాటు లారెన్ టక్కర్(27) పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 2 వికెట్లు, మసూద్, రెహ్మన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అఫ్గానిస్తాన్.. ఐర్లాండ్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఐర్లాండ్కు 108 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్తాన్ ఐర్లాండ్ ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్లో 8 వికెట్లతో సత్తాచాటిన ఐరీష్ పేసర్ మార్క్ అడైర్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరించింది. చదవండి: NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి -
263 పరుగులకే ఆలౌటైన ఐర్లాండ్.. అయినా 108 పరుగుల ఆధిక్యం
అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో ఐర్లాండ్ పైచేయి సాధించింది. ఈ జట్టు తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకే ఆలౌటైనా.. 108 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో వెటరన్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కర్టిస్ క్యాంఫర్ (49), లోర్కాన్ టక్కర్ (46), ఆండీ మెక్బ్రైన్ (38), హ్యారీ టెక్టార్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్లు మూర్ (12), బల్బిర్నీ (2), వాన్ వోర్కోమ్ (1), అదైర్ (15), మెక్కార్తీ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ పతనాన్ని శాశించిన రెహ్మాన్.. ఆఫ్ఘన్ బౌలర్లలో జియా ఉర్ రెహ్మాన్ (5/64) ఐర్లాండ్ పతనాన్ని శాశించగా.. నవీద్ జద్రాన్ 3, నిజత్ మసూద్, జహీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 155 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ చేసిన 53 పరుగులే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్గా ఉంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ కరీం జనత్ (41 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహీది (20), నవీద్ జద్రాన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఐదేసిన అదైర్.. రహ్మత్ షా (0), రహ్మానుల్లా గుర్బాజ్ (5), నసీర్ జమాల్ (0), జియా ఉర్ రెహ్మాన్ (6), నిజత్ మసూద్ (0), జహీర్ ఖాన్ (0) దారుణంగా విఫలమయ్యారు. మార్క్ అదైర్ (5/39) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించగా.. కర్టిస్ క్యాంఫర్, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు, బ్యారీ మెక్కార్తీ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో నలుగురు డకౌట్లు కావడం మరో విశేషం. -
ఓపెనర్లుగా బాబాయ్-అబ్బాయ్.. ఒకరు హిట్టు, ఒకరు ఫట్టు
ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ జట్ల మధ్య అబుదాబీ వేదికగా ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 28) ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన బాబాయ్-అబ్బాయ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అబ్బాయ్ ఇబ్రహీం జద్రాన్ (53) అర్దసెంచరీతో రాణించగా.. బాబాయ్ నూర్ అలీ జద్రాన్ 7 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. బాబాయ్-అబ్బాయ్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ ఇద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఆ మ్యాచ్ బాబాయ్ నూర్ అలీ జద్రాన్కు అరంగేట్రం మ్యాచ్ కాగా.. అబ్బాయ్ ఇబ్రహీం జద్రాన్కు అప్పటికే ఐదు మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. 35 ఏళ్ల వయసున్న బాబాయ్ నూర్ అలీ.. 22 ఏళ్ల అబ్బాయ్ ఇబ్రహీం చేతుల మీదుగా టెస్ట్ అరంగేట్రం క్యాప్ను అందుకున్నాడు. కాగా, ఇబ్రహీం బాబాయ్ నూర్ అలీ లేటు వయసులో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అతని అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడో 15 ఏళ్ల కిందటే జరిగింది. నూర్ అలీ 2009లోనే వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ పరిమిత ఓవర్ల జట్టులో నూర్ అలీ రెగ్యులర్ సభ్యుడు. నూర్ అలీ ఇప్పటివరకు 51 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. ఇతను వన్డేల్లో సెంచరీ, ఏడు అర్ధసెంచరీల సాయంతో 1216 పరుగులు.. టీ20ల్లో 4 అర్దసెంచరీల సాయంతో 586 పరుగులు చేశాడు. మరోవైపు అబ్బాయి ఇబ్రహీం జద్రాన్ ఇప్పటివరకు 6 టెస్ట్లు, 28 వన్డేలు, 30 టీ20లు ఆడి 5 సెంచరీలు, 13 అర్దసెంచరీల సాయంతో దాదాపు 2500 పరుగులు చేశాడు. ఇబ్రహీం తన కెరీర్లో చేసిన ఐదు సెంచరీలు వన్డేల్లో చేసినవే కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. తొలి ఇన్నింగ్స్లో 155 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ చేసిన 53 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్గా ఉంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ కరీం జనత్ (41 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహీది (20), నవీద్ జద్రాన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఐదేసిన అదైర్.. రహ్మత్ షా (0), రహ్మానుల్లా గుర్బాజ్ (5), నసీర్ జమాల్ (0), జియా ఉర్ రెహ్మాన్ (6), నిజత్ మసూద్ (0), జహీర్ ఖాన్ (0) దారుణంగా విఫలమయ్యారు. మార్క్ అదైర్ (5/39) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించగా.. కర్టిస్ క్యాంఫర్, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు, బ్యారీ మెక్కార్తీ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో నలుగురు డకౌట్లు కావడం మరో విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. పీటర్ మూర్ (12), ఆండ్రూ బల్బిర్నీ (2), కర్టిస్ క్యాంఫర్ (49), వాన్ వోర్కమ్ (1) ఔట్ కాగా.. హ్యారీ టెక్టార్ (32), పాల్ స్టిర్లింగ్ (2) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
విజయంతో ముగింపు
రూర్కెలా: పురుషుల ప్రొ హాకీ లీగ్ భారత అంచె పోటీలను టీమిండియా విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. భారత్ తరఫున నీలకంఠ శర్మ (14వ ని.లో), ఆకాశ్దీప్ సింగ్ (15వ ని.లో), గుర్జంత్ సింగ్ (38వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో భారత జట్టు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. -
ఐర్లాండ్: వాసవి మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు..
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో త్రిశక్తి స్వరూపిణి, సకల వేద స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘశుద్ధ విదియ రోజు వందమందికి పైగా వాసవి మాత భక్తులు, కమిటీ సభ్యులందరు కలిసి ఉదయాన్నే అనుకున్నట్టుగా కింగ్స్వుడ్ ప్రాంతమునందున్న స్థానిక వినాయగర్ ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. మొదటగా పిల్లలు తరువాత మహిళలంతా కలిసి చక్కగా అమ్మవారికి భక్తిశ్రద్దలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. తరువాత అమ్మవారికి వివిధరకాల పుష్పాలతో అలంకరించిన పిమ్మట లలిత సహస్రనామ పఠనము, మణిదీపవర్ణన, సామూహిక కుంకుమార్చన నిర్వహించగా.. విశాలి రమేష్, శృతి, అనూష చేసిన అమ్మవారి గీతాలాపనలో భక్తులందరూ తన్మయత్వం చెందారు. అటుపిమ్మట అమ్మవారికి మహిళలందరూ వడిబియ్యం సమర్పించి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అంకిత ఈ కార్యక్రమం మొత్తాన్ని చక్కగా సమన్వయము చేసారు. చిరంజీవి-లక్ష్మి హాసిని వాసవి పురాణం నుండి సేకరించిన ధర్మసూత్రాలను ఆంగ్లంలోకి అనువదించిన వాసవి దివ్యకథను భక్తులందరికీ చదివి వినిపించారు. అమ్మవారి నామస్మరణతో భక్తులందరూ పులకించిపోయారు. సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు పెద్దలు ఆనందంగా వారి ఒకరోజు సమయాన్ని ఇలా అమ్మవారి సేవలో గడపటం చాలాా ఆనందంగా ఉందని కోర్-కమిటీ సభ్యుల్లో ఒకరైన అనీల్ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఆలయ సెక్రటరీ, డైరెక్టర్ బాలకృష్ణన్ దంపతులకు కార్యవర్గ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ముత్తుస్వామిని ఘనంగా సత్కరించారు. బాలకృష్ణన్ మాట్లాడుతూ అమ్మవారి కార్యక్రమాలు వినయాగర్ ఆలయం నందు నిర్వహించడం అందులో భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందమైన విషయమని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ అభిలాషించారు. సరసమైన ధరలకే భోజన ప్రసాదాలు అందించిన బిర్యానీవాలా రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్కి, దీనికి సహకరించిన ప్రశాంత్కి కమిటీ కార్యవర్గ సభ్యులు శివ కుమార్, నవీన్ సంతోష్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. హాజరైన సభ్యులందరు ముక్తకంఠంతో ఐర్లాండ్ నందు ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఎంతో శుభపరిణామమని ఆనందించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు రేణుక దినేష్, రజిత సంతోష్, నితేశ్ గుప్తాలకు కమిటీ సభ్యులు సత్కరించి కృతఙ్ఞతలు తెలియజేసారు. అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో మాధవి, దివ్య మంజుల, శృతి, మాధురి, రేణుక, అంకిత, మణి, లావణ్య తదితరులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. తదుపరి కార్యక్రమంలో అధ్యక్షులు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి జీవిత విశేషాలను ప్రస్తుత సమాజం ఎలా స్వీకరించాలో ఉదాహారణలతో వివరించి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సంబంధమైన విషయాలను లోతుగా వివరించి చెప్పారు, హాజరైన సభ్యులకు భక్తులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. చివరిగా.. అందరూ భోజన ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమం మొత్తం ముందుకు సాగడంలో కీలకంగా కోర్-కమిటీ సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా గంగా ప్రసాద్, లావణ్య, సంతోష్ పారేపల్లి, శ్రీనివాస్, సతీష్, మాణిక్, శ్రవణ్ తదితరులు పాల్గొని విజయవంతంగా ముగించారు. -
ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం.. రెండు సిరీస్లలోనూ గెలుపు
అంతర్జాతీయ వన్డేల్లో ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. జింబాబ్వే గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచింది. అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0 తేడాతో జయభేరి మోగించింది. కాగా మూడు టీ20, మూడు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఐరిష్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా.. డిసెంబరు 7న మొదలైన టీ20 సిరీస్ను 2-0తో సొంతం చేసుకున్న ఐర్లాండ్.. వన్డేల్లోనూ సత్తా చాటింది. బుధవారం (డిసెంబరు 13) నాటి తొలి మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో జింబాబ్వేపై నెగ్గిన ఐర్లాండ్.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుత విజయం సాధించింది. హరారే వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాల్ స్టిర్లింగ్ బృందం జింబాబ్వేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఐరిష్ పేసర్లు గ్రాహం హ్యూమ్, కర్టిస్ కాంఫర్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో 40 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 197 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ జాయ్లార్డ్ గుంబీ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, వన్డౌన్ బ్యాటర్ కైటానో 13 పరుగుల వద్ద రనౌట్గా వెనుదిరిగారు. అయితే, వర్షం ఆటంకం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఐర్లాండ్ టార్గెట్ను 201గా నిర్దేశించారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరిష్ జట్టుకు ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ అదిరిపోయే ఆరంభం అందించాడు. మొత్తంగా 102 బంతుల్లో 82 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(8) నిరాశపరచగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన కర్టిస్ కాంఫర్ 40, హ్యారీ టెక్టార్ 33 పరుగులు సాధించారు. బల్బిర్నీతో కలిసి లోర్కాన్ టకర్ 29 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో జింబాబ్వేతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఐర్లాండ్ 2-0తో సొంతం చేసుకుంది. బల్బిర్నీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. కర్టిస్ కాంఫర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. కొత్త ఆక్షనీర్ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్? -
ఆరేసిన జాషువ లిటిల్.. జింబాబ్వేకు మరో షాకిచ్చిన ఐర్లాండ్
ఐర్లాండ్ జట్టు తమ కంటే కాస్త మెరుగైన జింబాబ్వేకు షాక్ల మీద షాక్లు ఇస్తుంది. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఐరిష్ టీమ్.. తొలుత జరిగిన టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుని తాజాగా ఆతిథ్య జట్టుకు మరో షాకిచ్చింది. వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జాషువ లిటిల్ ఆరు వికెట్లు (10-2-36-6) తీసి జింబాబ్వేను ఒంటిచేత్తో ఓడించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. లిటిల్ ధాటికి 42.5 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో మసకద్జ (40), ర్యాన్ బర్ల్ (38), క్లైయివ్ మదాండే (33), ముజరబానీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లిటిల్కు జతగా మార్క్ అడైర్ (1/23), క్రెయిగ్ యంగ్ (1/30), ఆండీ మెక్బ్రెయిన్ (1/34), హ్యారీ టెక్టార్ (1/5) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. 40.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్టిస్ క్యాంఫర్ (66) అర్ధసెంచరీతో రాణించగా.. లోర్కాన్ టక్కర్ (28), మార్క్ అడైర్ (25 నాటౌట్), హ్యారీ టెక్టార్ (21) ఒ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాండన్ మవుటా, ముజరబానీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ నగరవ, చివంగ తలో వికెట్ దక్కించుకున్నారు. సిరీస్లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 17న జరుగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. -
సికందర్ రజా ఆల్రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో జింబాబ్వే గెలుపు
సికందర్ రజా ఆల్రౌండ్ ప్రదర్శనతో (4-0-28-3, 42 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో స్వదేశంలో ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20లో జింబాబ్వే వికెట్ తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో 11వ నంబర్ ఆటగాడు ముజరబానీ ఆఖరి బంతికి 2 పరుగులు తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లలో ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ను జింబాబ్వే ఆటగాళ్లు ఆఖరి బంతి వరకు తీసుకెళ్లారు. 18 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో జింబాబ్వే ఆటగాళ్లు తడబడ్డారు. 18వ ఓవర్లో వికెట్ నష్టపోయి 5 పరుగులు, 19వ ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 4 పరుగులు, ఆఖరి ఓవర్లో వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసి అతి కష్టం మీద విజయతీరాలకు చేరారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. సికందర్ రజా, నగరవ (4-0-23-2), ముజరబానీ (4-0-24-2), సీన్ విలియమ్స్ (3-0-18-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఐరిష్ ఇన్నింగ్స్లో ఓపెనర్ బల్బిర్నీ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. సికందర్ రజా రాణించడంతో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో ఐర్లాండ్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని జింబాబ్వేకు గెలుపును అంత ఈజీగా దక్కనీయలేదు. అతి కష్టం మీద జింబాబ్వే చివరి బంతికి విజయం సాధించింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జార్జ్ డాక్రెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రజాకు ఈ ఏడాది టీ20ల్లో ఇది ఎనిమిదో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం. కాగా, 3 టీ20లు, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
ఐర్లాండ్ రాజధానిలో చెలరేగిన హింస: ప్రధాని దిగ్భ్రాంతి,కొత్త చట్టాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ సిటీ సెంటర్లో గత రాత్రి (గురువారం, నవంబరు 23) కత్తి పోట్ల ఘటన తీవ్ర అల్లర్లు , భారీ విధ్వంసానికి దారి తీసింది. పాఠశాల వద్ద ఓ వ్యక్తి పొడవాటి కత్తితో విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, మహిళ (స్కూల్ కేర్ అసిస్టెంట్) తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన అనంతరం సెంట్రల్ డబ్లిన్ అంతటా హింసాత్మక నిరసన చెలరేగింది. ఈ ఘటన తరువాత దేశంలో మరింత అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఐర్లాండ్ పోలీసు చీఫ్ హెచ్చరించారు. శుక్రవారం నాటికి రాజధాని ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలతో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు బీభత్సం సృష్టించారు. 11 పోలీసు వాహనాలను ధ్వంసం చేయగా, 13 దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో మరిన్నిదుకాణాలను దుండగులు లూటీ చేశారు. మూడు గంటలకు పైగా జరిగిన అల్లర్లలో మూడు బస్సులు, ఒక రైలు(ట్రామ్ను) తగుల బెట్టారు. అనేక మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇలాంటి హింస గతంలో ఎన్నడూ చూడలేదని ఐరిష్ పోలీసు కమీషనర్ డ్రూ హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డబ్లిన్ తగులబడిపోతున్నట్టుగా అనిపించిందంటూ స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రధాని దిగ్భ్రాంతి, కొత్త చట్టాలు కత్తిపోట్ల ఘటనపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది అల్లర్లలో పాల్గొన్నారని , వీరంతా జాతికే అవమానం తెచ్చారని మండిపడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలోనే కొత్తచట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు. We are all shocked by the incident which has taken place in Parnell Square. A number of people have been injured, some of them children. Our thoughts and our prayers go out to them and their families. — Leo Varadkar (@LeoVaradkar) November 23, 2023 50 ఏళ్ల ఐరిష్ పౌరుడిని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నాడు. నిరాయుధులను చేసి, పోలీసులు వచ్చే వరకు అతన్ని నేలపై పిన్ చేశారు. అతను ఆసుపత్రిలో మరియు కాపలాగా చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి కారణం ఏంటి అనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. JUST IN: Another hotel on fire in Dublin, Ireland… Citizens set fire to the Holiday Inn that is used to house immigrants following the violent stabbing of three children..pic.twitter.com/51Y7Gj4dXC — Chuck Callesto (@ChuckCallesto) November 24, 2023 -
ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట!
పాములు లేని ఊరు, గ్రామం ఉండు. కానీ కొన్ని దేశాల్లో అస్సలు పాము అనేదే కనిపించదట. ముఖ్యంగా ఓ దేశంలో అయితే ఇంతవరకు పాము కనిపించిన దాఖలాలు లేవని తేల్చి చెబుతున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఎందువల్ల అక్కడ పాములు కనిపించవు? రీజన్ ఏంటి తదితరాల గురించే ఈ కథనం!. బ్రిటన్ , ఐర్లాండ్లో పామలు అస్సలు కనపించవట. అందుకు కారణంగా అతి శీతల ప్రదేశాలు కావడం వల్ల అని అంటుంటారు. గడ్డకట్టే చలిలో ఆ సరిసృపాలు జీవించలేవని అందువల్లే ఇక్కడ పాములు లేవని చెబుత్నున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు ఒక్క పాము కూడా కనిపించనట్లు రికార్డుల్లో కూడా లేదని చెప్పారు. పురాణాల ప్రకారం క్రీస్తు శకంలో సెయింట్ పాట్రిక్ అనే క్రైస్తవ మత పెద్ద ఐర్లాండ్ ద్వీపం నలుమూలలోని పాములను తరిమేసి సముద్రంలోకి పడేశాడని అందువల్లే ఇక్కడ పాములు ఉండవని కథలు కథలుగా చెబుతుంటారు. అంతేగాదు సుమారు పదివేల సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరిత్యం వల్ల హిమనీనదాలు కరిగిపోవడంతో ఈ ఐర్లాండ్ ద్వీపం కొన్నేళ్ల వరకు మునిగిపోయిందని, అందువల్లే పాములు లేవని చెబుతుంటారు. పురావస్తు రికార్డుల ప్రకారం, బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో పాములు లేవని వెల్లడించింది. ఐతే ఆ తర్వాత మరికొన్ని పరిశోధన కారణంగా ఈ దేశాల్లో మూడు రకాల పాము జాతులను గుర్తించారు. గడ్డి పాములు, ఎడ్డర్ పాములు, సాధారణ పాములు వంటి సరీసృపాలు జాతులను మాత్రమే గుర్తించారు. అలాగే న్యూజిలాండ్లో కూడా ఒక్క పాము కూడా కనిపించదట. ఇది ఎన్నో రకాల అడవి జంతువులకు నిలయమైన ఇక్కడ కూడా ఒక పాము కూడా కనిపించదట. (చదవండి: నిద్ర సమస్యల్ని ఈజీగా పట్టేస్తుంది ఈ వాచ్!) -
CWC 2023: టీ20 వరల్డ్కప్ 2022 సీన్ను ఇంగ్లండ్ మళ్లీ రిపీట్ చేస్తుందా..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పటిష్టమైన ఇంగ్లండ్ను మట్టికరిపించారు. ప్రపంచకప్ టోర్నీల్లో తమకంటే చిన్న జట్ల చేతుల్లో ఓడటం ఇంగ్లండ్కు ఇది తొలిసారేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఈ జట్టు పసికూనల చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది. 1992లో జింబాబ్వే చేతిలో, 2011లో ఐర్లాండ్ చేతిలో, 2015 వరల్డ్కప్లో బంగ్లాదేశ్ చేతిలో, తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ టీమ్ ఊహించని ఎదురుదెబ్బలు తినింది. వన్డే ప్రపంచకప్ల్లో పరిస్థితి ఇదైతే.. టీ20 వరల్డ్కప్లోనూ ఇంగ్లండ్కు ఇలాంటి అనుభవమే ఓసారి ఎదురైంది. 2022 ఎడిషన్లో హేమాహేమీలతో నిండిన ఇంగ్లండ్ టీమ్.. ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో ఐర్లాండ్ ప్రత్యక్షంగా ఇంగ్లండ్ను ఓడించనప్పటికీ.. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్ను విజేతగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. నాడు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్.. ఆతర్వాత ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయి వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది. ప్రస్తుత వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ మరోసారి 2022 టీ20 వరల్డ్కప్ సీన్ను రిపీట్ చేస్తుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, నిన్నటి (అక్టోబర్ 15) మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. -
పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..!
పసికూన ఐర్లాండ్పై వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రతాపం చూపింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఇంగ్లండ్ టీమ్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ నమోదు చేయడంతో పాటు పలు రికార్డులు కొల్లగొట్టింది. ఓపెనర్గా వచ్చిన ఫిలిప్ సాల్ట్ కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి, ఐర్లాండ్ బౌలర్లకు ముచ్చమటలు పట్టించాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న సాల్ట్ 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. సాల్ట్కు విల్ జాక్స్ (21 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ జాక్ క్రాలే (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (54 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. డకెట్తో పాటు సామ్ హెయిన్ (4) క్రీజ్లో ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, వాన్ వొయెర్కోమ్ ఓ వికెట్ పడగొట్టారు. మరో 25 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్లో రికార్డు స్కోర్ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది. ఈ మ్యాచ్లో ఇప్పటికే నమోదైన పలు రికార్డులు.. వన్డే పవర్ ప్లేలో ఇంగ్లండ్ అత్యధిక స్కోర్: 107/2 8 ఓవర్లలోనే ఇంగ్లండ్ 100 పరుగుల మార్కును తాకింది వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున ఐదో వేగవంతమైన హాఫ్ సెంచరీ: ఫిలిప్ సాల్ట్ (22 బంతుల్లో) కాగా, ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ సిరీస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్ రెగ్యులర్ టీమ్ సభ్యులంతా వరల్డ్కప్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ టీమ్కు జాక్ క్రాలే నాయకత్వం వహిస్తున్నాడు. -
ఒక్కటీ గెలవలేదు.. హోదా ఇచ్చి తప్పుచేశారు! అన్నిటికంటే చెత్త విషయం ఇదే..
Getting Test status was...: న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ఐర్లాండ్ క్రికెట్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు టెస్టు హోదా కల్పించడం అన్నింకంటే చెత్త విషయమని పేర్కొన్నాడు. టెస్టు జట్టుగా మారడం ఐర్లాండ్ క్రికెట్కు హానికరంగా పరిణమించిందని వ్యాఖ్యానించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో పసికూన అనే ముద్రను చెరిపేసుకునేందుకు కృషి చేస్తున్న ఐరిష్ టీమ్.. 2017లో టెస్టు జట్టు హోదాను దక్కించుకుంది. ఆ మరుసటి ఏడాది పాకిస్తాన్తో తమ తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన ఐరిష్ జట్టు.. 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత.. అఫ్గనిస్తాన్తో ఒకటి, ఇంగ్లండ్తో రెండు, శ్రీలంకతో రెండు టెస్టులాడింది. వీటన్నింటితో పాటు ఈ ఏడాది బంగ్లాదేశ్తో ఆడిన ఏకైక టెస్టులోనూ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ జట్టు పరాభవాలను ఉద్దేశించి సైమన్ డౌల్ స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ఫ్యాన్స్ను కోల్పోతానని తెలుసు ‘‘ఇలా మాట్లాడటం వల్ల నా అభిమానుల్లో కొంతమందిని కోల్పోతానని తెలుసు.. కానీ ఐర్లాండ్ విషయంలో జరిగిన చెడు ఏమిటంటే ఆ జట్టుకు టెస్టు హోదా రావడమే. నేను మాట్లాడేది సిల్లీగా అనిపించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడాలనేది ఇప్పటికీ ఐర్లాండ్లోని కొద్ది మంది ప్లేయర్లకు మాత్రమే కల. అప్పుడు కౌంటీ క్రికెట్లో ఆడుతూ కానీ రానున్న 15-20 ఏళ్లలో ఇలాగే ఉంటుందని చెప్పలేం. నిజానికి తమ క్రికెటర్లు కౌంటీ క్రికెట్ ఆడేటపుడు ఐర్లాండ్ జట్టు అత్యుత్తమంగా ఉండేది. యూకేలో అత్యున్నత ప్రమాణాల స్థాయికి తగ్గట్లు వాళ్లు ఆడేవారు. దానినే జాతీయ జట్టులోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉండేవారు. ఒత్తిడి ఎలా జయించాలో తెలిసిన అనుభవజ్ఞులు జట్టులో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఐర్లాండ్ టీమ్ను చూస్తే అలా కనిపించడం లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా చెత్త ప్రదర్శనల నేపథ్యంలో టెస్టు హోదా వల్ల ఐర్లాండ్కు పెద్దగా ఒరిగిందేమీ లేదని.. భవిష్యత్తులో ఆ జట్టు మనుగడ కష్టమేనన్న ఉద్దేశంలో సైమన్ డౌల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
వరల్డ్కప్కు ముందు జో రూట్ ఆసక్తికర నిర్ణయం
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఆ జట్టు వరల్డ్కప్ జట్టు సభ్యుడు జో రూట్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో రేపు (సెప్టెంబర్ 20) జరుగబోయే తొలి మ్యాచ్లో బరిలోకి దిగేందుకు సర్వం సిద్దం చేసుకున్నాడు. ఇందుకోసం అతను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అనుమతిని తీసుకున్నాడు. రూట్ గత కొన్ని మ్యాచ్లుగా ఫామ్లో లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్లోకి రావడం కోసం రూట్ పడుతున్న తాపత్రయాన్ని చూసి ఈసీబీ సైతం అతనికి పర్మీషన్ను ఇచ్చింది. వరల్డ్కప్కు ముందు ఫామ్లోకి వచ్చేందుకు రూట్కు ఇది చాలా ఉపయోగపడుతుందని ఈసీబీ సైతం భావిస్తుంది. కాగా, ప్రపంచకప్కు ఎంపిక చేసిన సభ్యులను ఇంగ్లండ్ సెలెక్టర్లు ఐర్లాండ్ సిరీస్కు ఎంపిక చేయలేదు. రూట్ ప్రస్తుతం పట్టుబట్టి మరీ ఇంగ్లండ్ జట్టులో చేరాడు. కీలకమైన వరల్డ్కప్కు ముందు ఆటగాళ్లు గాయాలు బారిన పడకూడదని ఈసీబీ ఐర్లాండ్ సిరీస్కు తమ మెయిన్ స్ట్రీమ్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే, ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరీస్తో రూట్ చాలాకాలం తర్వాత వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది జులైలో సౌతాఫ్రికాతో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన రూట్.. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. రూట్ నాలుగు మ్యాచ్ల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వన్డేలో 6 పరుగులు చేసిన రూట్.. ఆతర్వాత రెండో వన్డేలో డకౌట్, మూడో వన్డేలో 4 పరుగులు, నాలుగో వన్డేలో 29 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఐర్లాండ్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ జట్టు.. జాక్ క్రాలే (కెప్టెన్), సామ్ హెయిన్, బెన్ డకెట్, జో రూట్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, లూక్ వుడ్, ఫిలిప్ సాల్ట్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్,జార్జ్ స్క్రిమ్షా, టామ్ హార్ట్లీ -
వానతో ముగిసిన ఆట!
డబ్లిన్: భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వర్షంతో ముగింపు లభించింది. బుధవారం జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వాన కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. నిర్విరామంగా కురిసిన వర్షం తెరిపినివ్వకపోవడంతో టాస్ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మధ్యలో కొద్దిసేపు వాన తీవ్రత తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించినా... కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. దాంతో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ రద్దుపై అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. దాంతో తొలి రెండు మ్యాచ్లలో గెలిచిన భారత్ ఖాతాలో 2–0తో సిరీస్ చేరింది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ‘చంద్రయాన్’ను వీక్షిస్తూ... మ్యాచ్ రోజు డబ్లిన్లో భారత క్రికెటర్లు టీవీలో ‘చంద్రయాన్–3’ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ సమయం గడిపారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెట్టిన క్షణాన సంబరాలు చేసుకుంటూ భావోద్వేగంతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. మరోవైపు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టార్ ప్లేయర్ కోహ్లి తదితరులు తమ సంతోషాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్లో ‘ఇస్రో’కు అభినందనలు తెలియజేశారు. -
IND VS IRE 3rd T20: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
భారత్-ఐర్లాండ్ మధ్య ఇవాళ (ఆగస్ట్ 23) జరగాల్సిన నామమాత్రపు మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణమైంది. ఫలితంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో తొలి టీ20లో 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. టాప్ స్కోరర్గా రుతురాజ్.. కాగా, ఈ సిరీస్లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2 మ్యాచ్ల్లో 77 పరుగులు) టాప్ స్కోరర్గా ఉండగా, ఐరిష్ బ్యాటర్ ఆండ్రూ బల్బిర్నీ (2 మ్యాచ్ల్లో 76) సెకెండ్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్ నిలిచారు. ఈ ముగ్గురు మ్యాచ్కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రాణదాత ఆ పోలీసు
నూకాంబిక హుండీ ఆదాయం రూ.66.69 లక్షలు
ఈ పాపం ఎవరిది?
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement