సులోచన సంపత్ ఇకలేరు | Sulochana Sampath passes away | Sakshi
Sakshi News home page

సులోచన సంపత్ ఇకలేరు

Jun 7 2015 3:36 AM | Updated on May 24 2018 12:10 PM

అన్నాడీఎంకే సీనియర్ మాహిళా నాయకురాలు, ఆ పార్టీ నిర్వాహక కార్యదర్శి సులోచన సంపత్(86) శనివారం హఠాన్మరణం పొందారు.

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే సీనియర్ మాహిళా నాయకురాలు, ఆ పార్టీ నిర్వాహక కార్యదర్శి సులోచన సంపత్(86) శనివారం హఠాన్మరణం పొందారు. ఆమె మరణ సమాచారంతో సీఎం జయలలిత దిగ్భ్రాంతికి లోనయ్యారు. అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆదివారం న్యూ ఆవడి రోడ్డులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ కుటుంబానికి చెందిన సులోచన సంపత్ జీవిత కాలం మహిళా అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగడంతో పాటుగా, అన్నాడీఎంకేలో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పార్టీ అధినేత్రి జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉండడమే కాకుండా, పార్టీ నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు.

 కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆమె బాధ పడుతున్నారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్నారు. శనివారం వెప్పేరిలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. జయలలిత దిగ్భ్రాంతి : సులోచన సంపత్ మరణ సమాచారంతో సీఎం జయలలిత దిగ్భ్రాంతికి లోనయ్యారు. హుటా హుటిన తన నెచ్చెలి శశికళతో కలిసి వెప్పేరిలోని సులోచన సంపత్ ఇంటికి చేరుకున్నారు. ఆమె భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. సంతాప ప్రకటనలో సులోచన సంపత్ మరణం తనకు , అన్నాడీఎంకే పార్టీకి తీరని లోటుగా పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 తనతో అత్యంత సన్నిహితంగా ఉండే వారని, తన  కుటుంబం కన్నా, పార్టీ కోసం అహర్నిషలు శ్రమించారని కొనియాడారు. పెరియార్ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె మహిళా అభ్యన్నతి కోసం , సమాన అవకాశాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగారని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కల్గాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య సంతాప ప్రకటన విడుదల చేశారు.  రాష్ట్ర ప్రభుత్వంలో పలు పదవుల్లో సులోచన సంపత్ పనిచేశారని గుర్తు చేస్తూ, ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

నేతల నివాళి : సులోచన సంపత్ మృతితో వెప్పేరిలోని ఆమె ఇంటికి అన్ని పార్టీల నాయకులు, రాష్ట్ర మంత్రులు , అన్నాడీఎంకే వర్గాలు పరుగులు తీశాయి. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, ద్రవిడ కళగం నేత కీ వీరమణి, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరంలతో పాటుగా పలువురు ప్రముఖులు ఆమె భౌతిక కాయం వద్ద పూల మాలలు వేసి, పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సులోచన సంపత్ భౌతిక కాయానికి ఆదివారం పది గంటలకు న్యూ ఆవడి రోడ్డులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, పీఎంకే అధినేత రాందాసులతో పాటుగా పలువురు తమ సానుభూతిని తెలియజేశారు. తల్లిని కోల్పోయిన తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధి, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్ తమ సానుభూతి తెలియజేశారు.

సర్వం పార్టీయే :  ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సోదరుడు ఈవీ కృష్ణ స్వామి కోడలు సులోచన సంపత్. ఈమె తండ్రి తిరుపత్తూరు స్వామి నాయుడు. అప్పట్లో జస్టిస్ పార్టీలో ఆయన కీలక భూమిక పోషించి ఉన్నారు. సులోచన భర్త సంపత్ ద్రవిడ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నేత. ఈ దంపతులకు ఈవీకేఎస్ ఇళంగోవన్, ఈవీకేఎస్ గౌతమన్, ఇనియన్ సంపత్ కుమారులు. నాగమ్మాల్, అన్భలహి కుమార్తెలు. ఈవీకేఎస్ ఇళంగోవన్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భర్త మరణానంతరం అన్నాడీఎంకేకు తనను అంకితం చేసుకున్నారు. జయలలితతో సన్నిహితంగా ఉంటూ, పార్టీ పరంగా పలు పదవుల్ని చేపట్టి తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సోషియల్ వెల్ఫేర్ బోర్డు సభ్యురాలిగా, అన్నా వర్సిటీ సిండికెట్ సభ్యురాలుగా, స్లమ్ క్లియరన్స్ బోర్డు, ఇండస్త్రీయల్ కార్పొరేషన్, టెక్స్ బుక్ సొసైటీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లకు చైర్ పర్సన్లుగా వ్యవహరించి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement