న్యూఢిల్లీ:మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియాతో ఆరంభం కానున్న ట్వంటీ 20 సిరీస్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆసీస్ తో వన్డే సిరీస్ లో భార్యకు అనారోగ్యం కారణంగా మొత్తం సిరీస్ కు దూరమైన ధావన్.. ట్వంటీ 20లకు అందుబాటులోకి వచ్చాడు. వన్డే జట్టులో ఆడిన అజింక్యా రహానే స్థానంలో ధావన్ కు జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీనిలో భాగంగా ఎన్డీటీవీ ఎక్స్ క్లూజివ్ చాట్ లో భారత జట్టు సక్సెస్ కు సంబంధించి పలు విషయాల్ని ధావన్ పంచుకున్నాడు.
'మా జట్టులో యువ క్రికెటర్లతో అనుభవజ్ఞులైన క్రికెటర్లు కూడా ఉన్నారు. ప్రస్తుత జట్టు ప్రతిభావంత క్రికెటర్లతో నిండి వుంది. భారత జట్టు ఈరోజు నంబర్ వన్ స్థాయికి వచ్చిందంటే.. నమ్మకం, పరిపక్వత. అదే మా సక్సెస్ సీక్రెట్' అని ధావన్ పేర్కొన్నాడు. ప్రస్తుత భారత్ బెంచ్ కూడా చాలా బలంగా ఉందని, దాంతోనే ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందని అన్నాడు. ఇలా పోటీ ఉంటేనే ప్రతీ ఒక్క ఆటగాడు వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి దోహదం చేస్తుందని ధావన్ తెలిపాడు.