సినీ పక్కీలో పక్కా ప్లాన్‌తో.. | Sakshi
Sakshi News home page

సినీ పక్కీలో పక్కా ప్లాన్‌తో..

Published Sun, May 21 2017 1:15 PM

సినీ పక్కీలో పక్కా ప్లాన్‌తో.. - Sakshi

కర్నూలు: కర్నూలులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, పత్తికొండ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య సినీ ఫక్కీలో చోటుచేసుకుంది. ఎప్పటికప్పుడు ఆయన కదలికలను ముందుగా పసిగట్టి అత్యంత క్రూరంగా హత్య చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఇటీవల తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ రెన్యువల్‌ కోసం పోలీసులకు ఇచ్చిన ఆయన కొద్ది రోజులుగా నిరాయుధుడిగా ఉంటున్నారు. ఆయన అనుచరుల వద్ద కూడా ఎలాంటి ఆయుధాలు లేవు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్న నారాయణ రెడ్డి ఆదివారం నంద్యాలలో సూర‍్యనారాయణరెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు.

ఈ విషయం కూడా హత్య ప్లాన్‌ చేసిన వారికి ముందే తెలిసినట్లుంది. అంతే కాకుండా, ఎప్పటికప్పుడూ ఆయనకు సమీపంలో ప్రత్యర్థుల్లో ఒకరు నిఘా నిర్వహించినట్లు సమాచారం. ఆయన వచ్చే మార్గంలో కూడా ముందస్తుగానే రెక్కీ నిర్వహించి స్పాట్‌ ఫిక్స్‌ చేసుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. వెనుక నుంచి ట్రాక్టర్‌తో ఢీకొట్టించడం, ఎదురుగా ట్రాక్టర్లు పెట్టి వాహనాన్ని కదలకుండా చేయడం, ఆ వెంటనే బాంబులు విసిరేయడం, వేటకొడవళ్లతో దాడి దాదాపు సినీ ఫక్కీలోనే జరిగింది. అంతేకాకుండా, ఆయనతో ఉన్న వారిని పారిపొమ్మని చెప్పి, అడ్డుకుంటే హత్య చేస్తామని బెదిరించి కేవలం ఆయననే టార్గెట్‌ చేసి ఈ అఘాయిత్యానికి తెగబడటం ఎవరివో బలమైన ఆదేశాలతోనే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.

ప్రాణహానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఆయన భద్రత గురించి పోలీసులు పట్టించుకోకపోవడం, లైసెన్స్‌ రివాల్వర్‌ రెన్యువల్‌ విషయంలో వేగమైన నిర్ణయం తీసుకోకపోవడంవంటి చర్యలు చూస్తుంటే పోలీసులపై కూడా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోందని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కర్నూలులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పెరుగుతున్న భారీ ఆదరణ, నారాయణ రెడ్డి కీలక నేతగా పనిచేస్తుండటం వంటి కారణాలతో ప్రభుత్వ పార్టీనే ఈ హత్య చేసిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement