కడప అర్బన్: జిల్లాలోని ఖాజీపేట, చెన్నూరు, చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లను అప్గ్రేడ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అప్గ్రేడ్ పోలీస్స్టేషన్ల సంఖ్య 20కి చేరింది.
నేడు డయల్ యువర్ ఆర్ఎం
కడప కోటిరెడ్డిసర్కిల్: ఆర్టీసీ సంబంధిత సమస్యల పరిష్కారానికి గురువారం ‘డయల్ యువర్ ఆర్ఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. సమస్యలు, సూచనలు, సలహాలను 99592 25848 నంబరులో తెలియజేయచ్చన్నారు.
శబరిమలైకి మరో రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం విజయవాడ నుంచి కడప మీదుగా కొట్టాయంకు మరో ప్రత్యేక రైలు (07139)ను నడపనున్నారని కడప రైల్వే చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ ఉమర్బాష తెలిపారు. విజయవాడ నుంచి కొట్టాయంకు డిసెంబరు 15, 22.. జనవరి 3వ తేదీన ఈ రైలు బయలుదేరుతుందన్నారు. ఈ రైలుకు కడప, ఎర్రగుంట్ల స్టేషన్లలో మాత్రమే స్టాపింగ్ కల్పించారన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07140) కొట్టాయం నుంచి విజయవాడకు డిసెంబరు 17, 24.. జనవరి 7వ తేదీన బయలుదేరుతుందన్నారు.
అరక్కోణం ప్యాసింజర్ రద్దు
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–రేణిగుంట మార్గంలో రోలింగ్ కారిడార్ పనులు జరుగుతుండటంతో కడప–అరక్కోణం మధ్య నడుస్తున్న ప్యాసింజర్ రైలును డిసెంబరు 3వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ ఉమర్బాష, కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్లు తెలిపారు. కాగా, పూణె–కన్యాకుమారి మధ్య నడుస్తున్న జయంతి ఎక్స్ప్రెస్(16381/82)ను దారిమళ్లింపు 3వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అలాగే మధురై–ఓకా వారాంతపు రైలును డిసెంబరు 1వ తేదీన దారి మళ్లించినట్లు తెలిపారు. రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి మీదుగా ఈ రైలు నడవాల్సి ఉండగా రైల్వే పనుల వల్ల కాట్పాడి, పాకాల, ధర్మవరం, గుత్తి మీదుగా నడపనున్నామన్నారు.
జిల్లాలో ఓ మోస్తరు వర్షం
కడప అగ్రికల్చర్: బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పెండ్లిమర్రి మండలంలో అత్యధికంగా 6.6 ఎంఎం వర్షం కురవగా, సింహాద్రిపురం మండలంలో అత్యల్పంగా 0.4 మిల్లీమీటర్లు కురిసింది. అలాగే సిద్దవటంలో 5.2 ఎంఎం, వేములలో 4.2 ఎంఎం, బద్వేల్లో 3 ఎంఎం, ఒంటిమిట్ట, గోపవరం, అట్లూరు, జమ్మలమడుగు మండలాల్లో 2.4 ఎంఎం, బి.మఠం, కాశినాయన మండలాల్లో 2 ఎంఎం, బి.కోడూరులో 1.4 ఎంఎం, వీఎన్పల్లెలో 1 ఎంఎం వర్షం కురిసింది. దీనివల్ల ఆరుతడి పంటలకు కొంతమేర మేలు జరిగింది.
ఫెలోస్ నియామకానికి దరఖాస్తులు
కడప సెవెన్రోడ్స్: యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగామ్లో భాగంగా చింతొమ్మదిన్నె, జమ్మలమడుగు మండలాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పద్దతిన ఫెలోస్ను నియమిస్తున్నట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకోసం హెచ్టీటీపీఎస్://కడప.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు.
నాట్యాచార్యులు
‘చల్లా’ కన్నుమూత
కడప కల్చరల్: ప్రముఖ నాట్యాచార్యులు చల్లా జగజ్జీవన్రావు (61) కడప నాగరాజుపేటలోని ఆయన స్వగృహంలో బుధవారం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డారు. దాదాపు 40 సంవత్సరాలుగా సంప్రదాయ నృత్య గురువుగా ఆయన వెయ్యి మందికి పైగా నర్తకులను తీర్చిదిద్దారు. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో ఆయన తన శిష్య బృందంతో ప్రదర్శనలు ఇచ్చారు. గురువారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె హిమ హారతి నాట్యంలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.