వనపర్తిటౌన్: అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో తమ ఓటు హక్కు విధిగా వినియోగించుకోవాలని స్వీప్ నోడల్ అధికారి రాంమహేశ్వర్రెడ్డి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ‘నేను తప్పనిసరిగా ఓటు వేస్తా’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు అనే వజ్రాయుధాన్ని సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు వినియోగించాలన్నారు. యువత కుటుంబంతో పాటు గ్రామంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో ఓటింగ్ శాతం మెరుగ్గానే ఉందని.. పట్టణాల్లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొత్త ఓటర్లు ఈవీఎంలో జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు. ఎవరైనా ఇబ్బందులు, ప్రలోభాలకు గురిచేస్తే సి–విజిల్ యాప్, 1950 గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదు చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి వస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీహెచ్ఈడౠ్ల్య సిబ్బంది వాణి, సుమ, సలోమి, డీసీపీయూ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
స్వీప్ నోడల్ అధికారి రాంమహేశ్వర్రెడ్డి