ముగ్గురు అర్చకులకు జిల్లా స్థాయి ఉగాది పురస్కారాలు
Published
Tue, Apr 9 2024 1:45 PM
అరసవల్లి: క్రోధి నామ సంవత్సరం ఉగాది పర్వ దినం సందర్భంగా జిల్లా స్థాయిలో ముగ్గురిని ఉత్తమ అర్చకులుగా ఎంపిక చేశామని జిల్లా దేవదాయ శాఖాధికారి బీఆర్వీవీ ప్రసాద్పట్నాయక్ తెలియజేసారు. శ్రీనివాసాచార్యులు (శ్రీకాకుళం–శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయం, దూదివారికోవెల), సీహెచ్ జగన్నాథాచార్యులు (పాతపట్నం–శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం), ఇప్పిలి సూర్యనారాయణ మూర్తి (కళ్లేపల్లి–శ్రీమణి నాగేశ్వర స్వామి వారి ఆలయం)లకు జిల్లా స్థాయి ఉగాది పురస్కారాలను జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో మంగళవారం జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నామని ప్రకటించా రు. రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు వీరికి చెరో రూ.10,116 నగదుతో పాటు వస్త్రాలు, ప్రశంసా పత్రం అందజేస్తామని తెలియజేశారు.
అరసవల్లి ఆదిత్యాలయంలో..
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు నిర్వహించనున్నామని ఆలయ ఈఓ ఎస్.చంద్రశేఖర్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు తెలియజేశారు. అలాగే ఉత్తమ అర్చకులుగా ఇప్పిలి కాశ్యపశర్మ, ఇప్పిలి ఫణీంద్రశర్మ, వేదపారాయణదారుడు ధర్భముళ్ల శ్రీనివాస శర్మలకు ఈ ఏడాదికి ఉగాది పురస్కారాలను అందజేస్తున్నామని ప్రకటించారు. వీరికి రూ.10,116 నగదు, ప్రశంసాపత్రాలను అందజేస్తామని వెల్లడించారు. అలాగే మంగళవారం ఉదయం, సాయంత్రం కూడా ఉగాది పంచాంగ పఠనం అనివెట్టి మండపంలో నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు.