హిందూపురం టౌన్: బంగారం తాకట్టు పెట్టి మోసపోయిన ఓ బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు చిన్న ఆచారి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు... పట్టణానికి చెందిన చిన్న ఆచారి తన అవసరాల కోసం పట్టణంలోని ధనలక్ష్మీ రోడ్డులో ఉన్న కీర్తన గోల్డ్ లోన్లో ఈ సంవత్సరం ఏప్రిల్లో తన బంధువులకు సంబంధించిన సుమారు రెండు లక్షలు విలువ చేసే బంగారు నగలు తాకట్టు పెట్టాడు. దీనికి సంబంధించి ఇదే సంవత్సరం జూలై 27న వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యూవల్ చేశారు. అయినప్పటికీ కీర్తన గోల్డ్ లోన్ కార్యాలయ సిబ్బంది సెప్టెంబర్ 9న కేవలం ఒక నోటీసు జారీ చేసి, అదే నెల 30న విజయవాడలో అతని బంగారు ఆభరణాలతో పాటు పట్టణంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారి బంగారు ఆభరణాలను వేలం వేసింది. దీనిని నిరసిస్తూ వారం రోజులు బాధితులు ప్రతిరోజూ కీర్తన గోల్డ్ లోన్స్ వద్దకు వచ్చి వాళ్ల గోడును వెళ్లబోసుకున్నారు. అయితే శుక్రవారం బాధితుడు చిన్న ఆచారి కీర్తన గోల్డ్ లోన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, బాధితుడితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.