కొండాపూర్(సంగారెడ్డి): లోక్సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం కొండాపూర్ మండలం మల్కాపూర్లో మెదక్ లోక్సభ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు రైతు బంధు పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బిచ్చం వేసినట్లుగా పూటకోసారి రైతుబంధు వేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు ఎకరాలలోపు ఉన్న రైతులందరికీ ఏక కాలంలో డబ్బులు వేశామని గుర్తు చేశారు. మళ్ళీ ఎన్నికలు వస్తుండడంతో కేసీఆర్ కుటుంబమంతా పగటి వేషగాళ్ల మాదిరిగా రోడ్ల పైకి వస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అనేక నిర్బంధాలకు గురయ్యామని పేర్కొన్నారు రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అక్రమ కేసుల నమోదు, జైలుకెళ్లామని తెలిపారు. జనాల్లో ఉన్నాం.. అందుకే ప్రజలు ఆదరించి మళ్లీ పట్టం కట్టారన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధును ఎంపీగా గెలిపించి లోక్సభకు పంపించాలని కోరారు.
సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. సంగారెడ్డిలో నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి నీలం మధుకు లక్ష ఓట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పారు.
ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. మెదక్ ఎంపీగా గెలిపిస్తే ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో మాజీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుం కుమార్, మాజీ ఎంపీపీ ఆంజనేయులు, గ్రంథాలయ మాజీ చైర్మన్ అనంత కిషన్, రఘుగౌడ్, రామ్రెడ్డి, షఫీ, జార్జ్, సత్తన్న, బుచ్చి రాములు, సిద్దు, ప్రభు, మోతిలాల్, కూన సంతోష్, బల్వంత్ రెడ్డి, కిరణ్ గౌడ్, శ్రీ రామ్ పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ