ప్రజావిశ్వాస యాత్ర: ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
ప్రస్తుతం జరుగుతున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రలు... ప్రజావిశ్వాస యాత్ర లని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనా ర్టీలను మోసం చేసిన టీడీపీపై దండయాత్రలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. నాలుగున్నరేళ్లుగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం చేసిన మేలును తెలియజేయడమే యాత్రల ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతిహామీని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని, దీనికి సాధికార యాత్రలకు లభిస్తున్న జనస్పందనే నిలువెత్తు సాక్ష్యమన్నారు.
సామాజిక అభివృద్ధి కనిపిస్తోంది:
ఎంపీ బెల్లాన
జగన్మోహన్రెడ్డి సర్కారు నాలుగున్నరేళ్లలో సామాజిక వర్గాలను ఆదుకుందని, ఈ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిచోట జరుగుతున్న సామాజిక సాధికార బస్సుయాత్రలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలకు పదవులు, ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు.
పేదలు– పెత్తందారుల మధ్యే పోరు: జెడ్పీ చైర్మన్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పేదలు– పెత్తందారుల మధ్య పోరు జరగనుందని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పేదవర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారని, టీడీపీ కార్పొరేట్కు కొమ్ముకాస్తోందని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో గత ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 ఎమ్మెల్యే స్థానాలు, మూడు ఎంపీ స్థానాలు దక్కించుకున్నామని, ఈ దఫా కూడా శతశాతం విజయం మనదేనని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు చెప్పే అబద్ధపు హామీలు నమ్మవద్దని ప్రజలను కోరారు.
టీడీపీది దోపిడీ పాలన:
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
టీడీపీది దోపిడీచేసే నైజమని, గతంలో కులవృత్తులకు పరికరాలు ఇచ్చినట్టు నటించి టీడీపీ కార్యకర్తలకు ముట్టజెప్పిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. పాలకొండ నియోజకవర్గంలో సామాజిక వర్గానికి వచ్చిన నాలుగు చక్రాల సబ్సిడీ వాహనాలను టీడీపీ పాలకొండ నియోజకవర్గ నేత, వీరఘట్టం నేతలు తమ సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మరింత దూరంపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.