నల్లగొండ: నామినేషన్ల స్వీకరణలో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. నామినేషన్ల స్వీకరణకు నియమించిన అధికారులు, సిబ్బందితో మంగళవారం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు సమర్పించే బ్యాంకు ఖాతా, ఫొటోగ్రాఫ్, ప్రతిపాదకులు తదితర అంశాలకు సంబంధించి సూచనలు చేశారు. నామినేషన్లపై సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజూ ఎన్నికల సంఘానికి పంపించే నివేదికలు జాగ్రత్తగా పరిశీలించి పంపాలని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీఆర్ఓ డి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సిద్ధంగా ఉండాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఆమె మంగళవారం వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల నుంచి అవసరమైన సిబ్బంది వివరాలను, అందుబాటులో ఉన్న బ్యాలెట్ బాక్స్ల వివరాలను సమర్పించాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికలలో నోడల్ అధికారులుగా వ్యవహరించిన వారినే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోడల్ అధికారులుగా నియమించాలన్నారు. ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఆమె తెలియజేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హరిచందన