ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం రాత్రి నాఖబలి (పుష్పయాగం) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ముక్కామల వెంకట నారాయణ శర్మ, ఎల్లాప్రగడ మణికంఠ శర్మ, ఎల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మలు ఉదయం పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాన్ని ప్రత్యేక వేదమంత్రాలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి..
ఐదురోజుల సీతారాముల కల్యాణోత్సవంలో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం రామాలయంలో నాఖబలి (పుష్పయాగం) కార్యక్రమాన్ని వేదపండితులు వెంకటనారాయణ, మణికంఠశర్మలు నిర్వహించారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి రంగులతో ముగ్గులు వేసి పూజలు చేశారు. 12 రకాల పూలతో శ్రీ సీతారామ దేవతమూర్తులకు పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. 12 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు. నాఖబలి కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమం భక్తులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు..
ఏటూరునాగారం మండల కేంద్రంలోని సీతా రామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఉద యం 6.37 నిమిషాలకు స్వామి వారి అలంకరణ పూర్తయిన అనంతరం సూర్యకిరణాలు నేరుగా రాముడి నుదిటిపై పడడం కనిపించింది. ఈ అద్భుతాన్ని అర్చకుడు నాగేశ్వరరావు శర్మ గమనించాడు. అయోధ్యలో శ్రీ బాలరాముడు ప్రతిష్ఠాపన అనంతరం రామాలయాల్లో ఇలా జరగడం ఒక విశేషమన్నారు. పైగా శ్రీరాముడికి జరిగిన కల్యాణం అనంతరం ఈ విధంగా కనిపించడం మరో విశేషమన్నారు.