సీతక్క నామినేషన్ దాఖలు
ములుగు : ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీతక్క బుధవారం నామినేషన్ను దాఖలు చేశారు. తొలుత జిల్లా కేంద్రంలోని గట్టమ్మ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో గట్టమ్మ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ట్రాఫిక్ సమస్య నెలకొంది. క్లియర్ చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గట్టమ్మ నుంచి నామినేషన్ కేంద్రానికి వచ్చే రూట్ను వన్ వే చేశారు. నామినేషన్ వేయడానికి సీతక్కతో పాటు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జాతీయ కాంగ్రెస్ యువజన అధికార ప్రతినిధి రాం మోహన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఆక రాధాకృష్ణలతో కలిసి రిటర్నింగ్ అధికారి, ఐటీడీఓ పీఓ అంకిత్కు నామినేషన్ అందజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు, డీఎల్ఆర్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడారు. ప్రజలకు అండగా నిలబడుతున్న తనను అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఆమె వెంట కిసాన్ కాంగ్రెస్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం సీతక్క ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు.
భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు