జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం ఎంపిక చేసిన జయప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలోని హాళ్లు, స్ట్రాంగ్ రూంలలో అవసరమైన మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే ఆదివారంలోగా పూర్తిచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవినాయక్ అన్నారు. శుక్రవారం ఆయన ఎస్పీ హర్షవర్ధన్తో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, అదేవిధంగా స్ట్రాంగ్ రూంలుగా ఎంపిక చేసిన హాళ్లలో అవసరమైన మార్పులు గుర్తించాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి వచ్చే అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ అధికారులు, సిబ్బంది, మీడియా కోసం వేర్వేరు దారులు, బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, వాహనాలు నిలిపేందుకు కౌంటింగ్ కేంద్రానికి దూరంలో పార్కింగ్ సదుపాయం కల్పించాలని, స్ట్రాంగ్ రూంలు కట్టుదిట్టంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మహబూబ్నగర్, దేవరకద్ర రిటర్నింగ్ అధికారులు అనిల్కుమార్, నటరాజ్, పీఆర్ఈఈ నరేందర్, డీఆర్ఓ రవికుమార్, ఏఎస్పీ రమణారెడ్డి, పీఆర్డీఈ విష్ణు, ఏఆర్ఓలు నాగార్జున, శ్రీనివాస్, బ్రహ్మంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లకు అవగాహన కల్పించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరు ఓటు వేసేలా తమవంతుగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. ఆర్వీఎంలో ఎన్నికల స్వీప్ నోడల్ అధికారి, డీఈఓ ఆధ్వర్యంలో ఎంఈఓలు, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సంఘం ఓటు వేసేందుకు వచ్చే వారి కోసం వేచి ఉండేందుకు టెంట్లు, కుర్చీలు, తాగునీళ్లు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, 80 ఏళ్లు పైబడిన దివ్యాంగ ఓటర్లకు హోం ఓటింగ్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఉపాధ్యాయులు తమ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం పెంచేలా చూడాలని కోరారు.