కర్నూలు(అర్బన్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన అన్నారు. ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నవభారత నిర్మాణంలో అంబేడ్కరర్ పోషించిన పాత్ర విశేషమైనదన్నారు. ప్రపంచానికే ఆదర్శమైన రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ అపర మేధావి అని కొనియాడారు. త్యాగం, కృషి, పట్టుదల, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, క్ర శిక్షణ, అకుంఠిత దీక్షా దక్షతకు ఆయన నిదర్శనమన్నారు. ఆయన మేధానిరతికి రెండు చేతులు జోడించి హృదయ పూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. దేశంలో నేడు అన్ని వ్యవస్థలు క్రమ పద్ధతిలో నడుస్తున్నాయంటే అందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. ఐక్యరాజ్య సమితితో పాటు 132 దేశాల్లో అంబేడ్కర్ జయంతిని జరుపుకుంటున్నారని, దీన్ని బట్టి చూస్తే ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సంచుక్త సంచాలకులు జే రంగలక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన