● అప్పులు రూ.7.50 కోట్లు ● ఎన్నికల అఫిడవిట్లో వెల్లడి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తమ కుటుంబ ఆస్తులు దాదాపు రూ.54.80 కోట్లు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. గతేడాది ఇన్కాంట్యాక్స్ రూ. 29,58,050 చూపించగా తన భార్య సురేఖ పేరిట రూ.4,50,280 చూపించారు. పీఎస్సార్ వద్ద రూ.6,26,300, సురేఖ వద్ద రూ. 4,22,350 నగదుతో పాటు ఇతర చరాస్తులన్నీ కలిపి పీఎస్సార్ వద్ద రూ.13,64,80,168, సురేఖ వద్ద రూ.1,12,00,654 ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తుల్లో కాసిపేట మండలం కొండాపూర్లో 9.08 ఎకరాల భూమి, హైదరాబాద్లోని బేగంపేట్, మంచిర్యాలలో భవనం ఉన్నాయి. వాటి విలువ రూ.35,65,11,900, వారసత్వంగా వచ్చిన ఆస్తి రూ.90,80,000, తన భార్య పేరిట స్థిరాస్తులు 3,14,00,000, వీటన్నింటి విలువ రూ.54,80,81,052గా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటితో పాటు వివిధ బ్యాంకుల్లో రుణాలు, ఫైనాన్స్ రూపంలో రూ.7.50 కోట్ల అప్పు, ప్రభుత్వానికి వివిధ రూపాల్లో చెల్లించాల్సిన బకాయిలు రూ. 2,64,08,801గా చూపించారు. ప్రేమ్సాగర్రావు దంపతులు పలు వ్యాపారాలు, పెన్షన్ రూపంలో ఆదాయం వస్తున్నట్లు చూపించారు. ప్రేమ్సాగర్రావు మీద ఉట్నూర్, మంచిర్యాల, సీసీసీ నస్పూర్, లక్సెట్టిపేట్, హాజీపూర్, సికింద్రాబాద్, నాంపల్లిలో మొత్తం 40 కేసులు నమోదైనట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.