కామారెడ్డి క్రైం: వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన జిల్లాల అదనపు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ ప్రాంతాలలో రాగల మూడు రోజులలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. వర్షాలకు ధాన్యం తడిచినా రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. తడిచిన ధాన్యాన్ని ఎండబెట్టిన అనంతరం కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి ధాన్యం తడిసిపోకుండా చూసుకోవాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో కామారెడ్డి నుంచి అదనపు కలెక్టర్ చంద్రమోహన్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానంద, డీఏవో భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.