ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు చేపట్టాలని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్కుమార్ చెప్పారు. ఏలూరు డీఐజీ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఏలూరు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నగరంలో చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు. డీఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ.. ఏలూరులో ట్రాఫిక్ నిర్వహణకు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగ నియంత్రణకు సూచనలు చేయాలన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నళ్లు సక్రమంగా వినియోగిస్తూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా ప్రయాణిస్తూ, ఇళ్ళకు క్షేమంగా చేరేలా పోలీస్ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. ఏలూరులో ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యక్తులు, వీఐపీలు రాకపోకల సమయంలో అన్ని వైపులా ట్రాఫిక్ నిలిపివేయటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలా కాకుండా వారు వెళ్ళే మార్గం మాత్రమే రోడ్డు క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కాలేజీలు విడిచిపెట్టే సమయంలో రద్దీ ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మంది సిబ్బందిని నియమించి, ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని డీఐజీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ కేవీఎస్ వరప్రసాద్, ఎస్ఐలు శ్రీధర్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు ఉన్నారు.