సాక్షి, మునగపాక(యలమంచిలి): మునగపాక మండలం నాగులాపల్లిలోని ఓ కుటుంబంలో గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు కరోనాతో ఒకరు మృతి చెందగా, మరొకరు శ్యాసకోశ సంబంధిత వ్యాధితో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా నాగులాపల్లిలో కల్వరికింగ్డమ్ పీస్టెంపుల్ చర్చిలో కె.డానియల్(65), అతని కోడలు ఎప్సిబాకుమారి(35)లు పాస్టర్లుగా పని చేస్తున్నారు. ఇద్దరూ కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రెండురోజుల కిందట ఎప్సిబాకుమారికి శ్వాస సమస్య పెరగడంతో కేజీహెచ్కు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
మెరుగైన వైద్యం కోసం ఆమెను విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి ఆమె మృతి చెందింది. తన కోడలు ఎప్సిబాకుమారి ఆరోగ్యం బాగుండాలని విమ్స్లో అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో డానియల్ ప్రార్థనలు చేశారు. అనంతరం స్వగ్రామం చేరుకున్నారు. గదిలోకి విశ్రాంతి తీసుకుంటుండగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఊపిరితిత్తుల సమస్య బాధించడంతో కుటుంబసభ్యులు విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. మృతదేహాలకు అనకాపల్లి శారదానది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలు ఎప్సిబాకుమారికి భర్త కిరణ్కుమార్ (పాస్టర్)తోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
చదవండి: భర్త రెండో పెళ్లికి ప్లాన్.. ప్రాణాలు తీసుకున్న భార్య