గోవుకు అరుదైన ఆపరేషన్‌ | Sakshi
Sakshi News home page

గోవుకు అరుదైన ఆపరేషన్‌

Published Tue, Apr 23 2024 8:40 AM

ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్య బృందంతో 
జేడీ డాక్టర్‌ వై.సుబ్రహ్మణ్యం  - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: పశుశాఖ శింగనమల ఏడీ డాక్టర్‌ జి.పద్మనాభం మరో అరుదైన శస్త్రచికిత్సతో ఓ వీధి ఆవుకు ప్రాణం పోశారు. వివరాలు... గర్భంతో ఉన్న ఓ వీధి ఆవు ప్రసవం కాక అనంతపురంలోని పశుశాఖ కార్యాలయం సమీపంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆ శాఖ జేడీ డాక్టర్‌ వై.సుబ్రహ్మణ్యం గుర్తించి, అత్యవసర వైద్యం చేయాలని డాక్టర్‌ జి.పద్మనాభంకు సూచించారు. వెంటనే సలకంచెరువు పశువైద్యశాల డాక్టర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డితో కలసి అక్కడకు చేరుకున్న డాక్టర్‌ పద్మనాభం... ఆవును పరీక్షించి కటి కుహరం చాలా చిన్నదిగా ఉండడంతో దూడ బయటకు రాలేక లోపలే చనిపోయినట్లు నిర్ధారించారు. విషయాన్ని జేడీ దృష్టికి తీసుకెళ్లి, ఆయన అనుమతితో శస్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 గంటలకు ఆపరేషన్‌ చేశారు. చీకట్లో వాహనం హెడ్‌లైట్లను ఉపయోగించుకున్నారు. దూడను ముక్కలుగా చేసి వెలికి తీసి, ఆవు ప్రాణాలు కాపాడారు. అరుదైన ఈ శస్త్రచికిత్సలో సిబ్బంది శివ, ప్రవీణ్‌, చైతన్య, రజాక్‌, నరేష్‌, ఆంజనేయులు, డ్రైవర్‌ రామసుబ్బారెడ్డి సహకరించారు. ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత వైద్య బృందాన్ని జేడీ అభినందించారు.

అనుబంధ కమిటీల నియామకం

అనంతపురం కార్పొరేషన్‌: సీఎం, పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీలను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుజ్జల శివయ్య, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోకుల్‌ రెడ్డి (శింగనమల) నియమితులయ్యారు.

Advertisement
Advertisement