అనంతపురం అర్బన్: ప్రతి పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకునే లక్ష్యంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ తెలిపారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించడంలో భాగంగా రూపకల్పన చేసిన ఎన్నికల మస్కట్ను కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, మస్కట్ రూపకర్త, ఆర్ట్స్ కళాశాల విద్యార్థి గూడురు ప్రశాంత్కుమార్తో కలసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. రూపకర్తను అభినందిస్తూ రూ.5 వేలు నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అలాగే మస్కట్ రూపకల్పన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మస్కట్ ప్రోగ్రాం చేయాలని ముందుగా జెడ్పీ సీఈఓ నిదియా దేవి ఆలోచన చేశారన్నారు. మస్కట్ రూపకల్పన క్రెడిట్ మొత్తం ఆమెదేనన్నారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. డీఈఓ, సమగ్ర శిక్ష అధికారులతో మాట్లాడి విద్యార్థులను ప్రోత్సహించేలా చిత్రలేఖనం, ఆర్ట్స్ కాంపిటీషన్లు నిర్వహించాలని జెడ్పీ సీఈఓకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
రూపకర్త ప్రశాంతకు రూ.5వేలు బహుమతి