తుమ్మపాల: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో కలెక్టర్ రవి పట్టన్శెట్టి, ఎస్పీ కె.వి.మురళీకృష్ణలతో కలిసి వివిధ ఎన్నికల విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికలు రాజకీయంగా, ఖర్చుపరంగా పరిస్థితులు సంక్లిష్టంగా ఉండవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సునిశిత దృష్టితో మెలగుతూ ఎటువంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధనం, మత్తు పదార్థాలు, కానుకలతో ఓటర్లను ప్రలోభపర్చడం, వంటి పరిస్థితులను గమనించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ రకాలుగా పార్శిళ్లు, నగదు రహిత లావేదేవీల నిర్వహణకు వీలులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునే ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పోలీసు, అధికారులపై ఉంటుందన్నారు. అంతకుముందు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా స్వరూప స్వభావాలు, సరిహద్దులు, నియోజకవర్గాలు, రాజకీయు ఆర్థిక పరిస్థితుల గురించి వివరించారు. జిల్లా ఎన్నికల నిర్వహణలో పని చేస్తున్న వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.