మెగాస్టార్కు పునర్జన్మ ఈ ఆస్పత్రిలోనే..
బెంగళూరు: సెయింట్ పిలోమినా ఆస్పత్రి. మదర్ థెరిసా రోడ్డులో గల ఈ ఆస్పత్రిలో సరిగ్గా 34 ఏళ్లకిందట ఆగస్టు 2 వ తేదిన అందులోని వైద్యులు, నర్సులు పడిన హడావుడి, కంగారు అంతాఇంత కాదు. ఓ రకంగా ఆగస్టు 2 వారికి ప్రత్యేకమైనది కూడా. ఎందుకంటే ఆ రోజు వారు వైద్యం చేసింది మాములు వ్యక్తికి కాదు. బాలీవుడ్ దిగ్గజం, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు. అవును ఆ రోజు ఆయన మరోసారి పునర్జన్మ పొందారు. కూలీ సినిమా షూటింగ్ సమయంలో తీవ్రంగా పొత్తకడుపు గాయాలతో కుప్పకూలిన ఆయన స్పృహకోల్పోగా ఈ ఆస్పత్రిలోనే చేర్పించి వైద్యం చేయించారు.
బెంగళూరు యూనివర్సిటీలో ఓ ఫైట్ సీన్ కు సంబంధించి జంప్ చేసే సమయంలో ఆయనకు తీవ్ర గాయం అయింది. ఆయన ఓ టేబుల్ పై దూకాల్సిందిపోయి దాని మూల భాగంపై పడటంతో ఆయన పొత్తకడుపుకు తీవ్ర గాయం అయ్యి స్పృహకోల్పోయాడు. దీంతో ఆయనను వెంటనే సెయింట్ పిలోమినా ఆస్పత్రిలో చేర్పించి శస్త్ర చికిత్స నిర్వహించి తిరిగి కోలుకునేలా చేశారు. ఈ గాయం కారణంగా కొన్ని నెలలపాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఆస్పత్రికి చెందిన వైద్య బృందం పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంది. అలాంటి లెజెండ్ నటుడికి ప్రాణంపోయడాన్ని గర్వంగా భావిస్తున్నామని పేర్కొంది.