-
అధిక వడ్డీ..35 కోట్లు టోకరా
-
టీవీ-5 సాంబశివరావు బాగోతం.. మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: చెప్పేవి నీతులు.. చేసేవి తప్పుడు పనులు.. నిత్యం టీవీ5 వేదికగా రాజకీయ ప్రవచనాలు వల్లించే సాంబశివరావుపై గచ్చిబౌలి పీఎస్లో మరో కేసు నమోదైంది. తమ కంపెనీనిలో సాంబశివరావు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పని చేస్తూ మోసం చేశాడంటూ సంధ్యా హోటల్స్ ప్రై.లిమిటెడ్ అకౌంటెంట్ ఫిర్యాదు చేశారు. కంపెనీ నిధులతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కారు కొనుగోలు చేశాడంటూ ఫిర్యాదు చేశారు. సంధ్యా హోటల్స్ అకౌంటెంట్ ఫిర్యాదుతో సాంబశివరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ గచ్చిబౌలి పెట్రోల్ బంక్ ల్యాండ్ విషయంలో ఫోర్జరీ కేసు నమోదైన విషయం తెలిసిందే. హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్పీసీఎల్)కు, సంధ్య కన్స్ట్రక్షన్కు మధ్య జరిగిన పెట్రోల్ బంక్ ఒప్పందం వివాదంలో టీవీ–5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు అసలు వాస్తవాలను దాచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని సంధ్య కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సరనాల శ్రీధర్రావు ఇటీవల ఆరోపించారు. స్థలం సాంబశివరావుది కాదు.. పెట్టుబడీ ఆయనది కాదు.. కానీ, పెట్రోల్ బంక్ డీలర్షిప్ మాత్రం ఆయన వాళ్ల పేరు మీద పెట్టుకుని బాగోతం నడిపారని విమర్శించారు. ఇదీ చదవండి: టీవీ 5 సాంబశివరావు చెప్పేవన్నీ అబద్ధాలే! -
నకిలీ పత్రాలు.. ఫోర్జరీ సంతకాలు
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోర్జరీ డాక్యుమెంట్లతో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)కు బురిడీ కొట్టించాలనుకున్న టీవీ–5 సాంబశివరావుకు బుర్ర తిరిగిపోయే ఎదురుదెబ్బ తగలింది. పచ్చ మీడియాలో ఒకటైన టీవీ–5లో సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. కాగా భూ యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలతో హైదరాబాద్లోని మాదాపూర్లో ఆయ న నడిపిస్తున్న పెట్రోల్ బంక్ను హెచ్పీసీఎల్ ప్రతినిధులు బుధవారం సీజ్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో ప్లాట్ను అగ్రిమెంట్ చేసుకొని, దాన్ని హెచ్పీసీఎల్కు లీజుకు ఇచ్చాడని ప్లాట్ యజమాని సరనాల శ్రీధర్రావు హెచ్పీసీఎల్కు చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు. ఫోర్జరీ చేసిన స్థలానికి బుధవారం కంచె వేయడంతో పాటు పెట్రోల్ బంక్ను పాక్షికంగా సీజ్ చేశారు. ఆ స్థలంలో ఉన్న పెట్రోల్ పంపులను మూసి వేశారు. ఆయిల్ సంస్థలతో మంచి సంబంధాలున్నాయని నమ్మించి.. సాంబశివరావుపై ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సరనాల శ్రీధర్ భార్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామం, సర్వే నంబరు–64, హుడా టెక్నో ఎన్క్లేవ్, సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో 600 చదరపు మీటర్ల (717.60 చదరపు గజాలు) స్థలం ఉంది. 2018లో సాంబశివరావు వీరిని కలిసి, తనకు ఆయిల్ సంస్థలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలర్షిప్ ఇప్పిస్తామని నమ్మించాడు. ప్లాట్కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీపత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భూ యజమానులకు తెలియకుండా పెట్రోల్ బంక్ డీలర్షిప్ను డాక్టర్ కొల్లి సౌమ్య పేరు మీదకు సాంబశివరావు బదలాయించాడు. జర్నలిస్టులు, పోలీసుల పేరుతో భయపెట్టి.. తన స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్ను నడుపుతున్నట్లు తెలుసుకున్న శ్రీధర్రావు షాక్కు గురయ్యారు. 2021లో దీనిపై సాంబశివరావును నిలదీశారు. దీంతో సాంబశివరావు ఎదురుదాడికి దిగాడు. హెచ్పీసీఎల్తో డీలర్షిప్ అగ్రిమెంట్కు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. రాజకీయ నాయకులు, జర్నలిస్ట్లు, పోలీసు అధికారులతో తనకున్న పరిచయాలను ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతులకు గురైన శ్రీధర్రావు ఆ డీలర్షిప్ను తమ పేరు మీదకు బదలాయించాలని కోరారు. లక్షల్లో వసూలు చేసి డీలర్షిప్ బదలాయించకుండా.. అయితే కొంత నగదు చెల్లిస్తేనే డీలర్షిప్ను బదలాయిస్తానని సాంబశివరావు చెప్పాడు. వేరే దారిలేక 2021, మార్చిలో రూ.లక్షల్లో నగదు బదలాయించామని శ్రీధర్రావు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. అయినప్పటికీ డీలర్షిప్ను బదలాయించకపోవడంతో ఈ ఏడాది జనవరి 31న శ్రీధర్రావు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్పీసీఎల్ ప్రతినిధులకు సైతం శ్రీధర్రావు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హెచ్పీసీఎల్ అధికారులు సాంబశివరావు నడుపుతున్న పెట్రోల్ బంక్ను సీజ్ చేశారు. చీటింగ్ కేసును నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
యాంకర్ సాంబశివరావు అక్రమాలకు చెక్
హైదరాబాద్, సాక్షి: టీవీ5 యాంకర్ సాంబశివ రావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. తమనే బురిడీ కొట్టించిన ప్రయత్నంపై హెచ్పీసీఎల్(Hindustan Petroleum Corporation Limited ) తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో.. మాదాపూర్లో నకిలీ ల్యాండ్ ధ్రువ పత్రాలతో నడుపుతున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని హెచ్పీసీఎల్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై మొన్నీమధ్యే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ల్యాండ్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు సాంబశివుడిపై, ఆయన కుటుంబ సభ్యులపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా.. ఇటు భూమి యజమానిని, అటు హెచ్పీసీఎల్ను సాంబశివరావు కుటుంబం బురిడీ కొట్టించాలని చూశాడు. ఈ క్రమంలో.. ల్యాండ్ ఓనర్ కి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంక్ నడుపుతున్న విషయాన్నీ హెచ్పీసీఎల్ గుర్తించింది. ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ చెప్పింది కూడా. అంతేకాదు.. ఈ వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఆక్రమిత బంక్ స్థలాన్ని అధికారులు సీజ్ చేశారు. పచ్చమీడియాలో భాగమైన టీవీ5 ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారన్నది బాధితుల ఆరోపణ. దీని పైన తాము సాంబశివరావును, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదికే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. ఎంత కాలం అయినా చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఫిర్యాదు దారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిశారు. అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము HPCLకు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు.. ఈ డాక్యుమెంట్లు అన్నీ దురుద్దేశపూర్వకంగా రూపొందించినట్టు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులకు బాధితులు అసలు విషయాన్ని మొర పెట్టుకున్నారు. -
Sambasiva Rao: సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: నిత్యం టీవీ5 వేదికగా తాను వల్లించేవి రాజకీయ ప్రవచనాలుగా ఫీలయ్యే సాంబశివరావు పైన కేసు నమోదైంది. భూ వ్యవహారంలో తమను మోసం చేసారంటూ హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేసారు. మీడియా వృత్తితో పాటు సాంబశివరావు పెట్రోల్ బంకుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ పెట్రోల్ బంకు నిర్వహణకు స్థలం లీజుకు ఇచ్చిన వ్యవహారంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూస్థాన్ పెట్రోలియంకు తాము సంతకాలు చేయకుండానే తమ సంతకాలతో లీజు డాక్యుమెంట్లు సృష్టించారన్నది ప్రధాన అభియోగం. పచ్చమీడియాలో భాగమైన టీవీ5 ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారని బాధితుల ఆరోపణ. దీని పైన తాము సాంబశివరావును, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదికే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. ఎంత కాలం అయినా చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఫిర్యాదు దారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిశారు. అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము HPCLకు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు.. ఈ డాక్యుమెంట్లు అన్నీ దురుద్దేశపూర్వకంగా రూపొందించినట్టు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులకు బాధితులు అసలు విషయాన్ని మొర పెట్టుకున్నారు. దీంతో కంగారు పడ్డ కంపెనీ అధికారులు.. మూడేళ్లుగా లీజు ఎరియర్స్ చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. కానీ, స్థలం విషయంలో సాంబశివరావు, కుటుంబ సభ్యులు చేసిన మోసానికి ఏం చేయలేమని చేతులెత్తేయడంతో బాధితులు మాదాపూర్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కింద చూడవచ్చు. -
రూ.50 లక్షలకు టీడీపీ నేత టోకరా
బొమ్మలసత్రం (నంద్యాల): తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేద్దామని చెప్పి ఓ డీఎస్పీ కుమారుడ్ని నిండా ముంచేసిన ఘటనలో మైదుకూరు టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి మల్లిఖార్జునయాదవ్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్యాదవ్ సన్నిహితుడు, కాంట్రాక్టర్ మల్లిఖార్జునయాదవ్ హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో నివాసముంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, కొల్లాపూర్ మధ్య కేతిపల్లి గ్రామంలో వంతెన నిర్మాణ పనులకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో నంద్యాలలో నివశిస్తున్న కర్నూలు, నంద్యాల జిల్లాల ఇంటెలిజెన్స్ విభాగం ఇన్ఛార్జ్ డీఎస్పీ యుగంధర్ కుమారుడు చిరంజీవిని భాగస్తుడిగా చేసుకుని కాంట్రాక్ట్ పనులు పూర్తి చేశారు. మల్లిఖార్జునయాదవ్ తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడనే అనుమానంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో చిరంజీవికి రూ.80 లక్షలు చెల్లించేలా మల్లిఖార్జునయాదవ్ ఒప్పందం చేసుకున్నాడు. అయితే రూ.30 లక్షలు చెల్లించి.. మిగతా రూ.50 లక్షలు చెల్లించకుండా మొండికేశాడు.దీంతో చిరంజీవి నంద్యాల తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మల్లిఖార్జునయాదవ్పై కేసు నమోదు చేసినట్లు సీఐ దస్తగిరిబాబు తెలిపారు. -
TS: రూ.5 కోట్లు చీటింగ్.. బీఆర్ఎస్ నేత అరెస్టు
సాక్షి,హైదరాబాద్: గత ప్రభుత్వంలోని ముఖ్య నేతల సంతకాలు ఫోర్జరీ చేసి ఓ కంపెనీని రూ.5 కోట్లు మోసం చేసిన కేసులో బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిడ్ డే మీల్స్ కాంటట్రాక్టు ఇప్పిస్తానని బీఆర్ఎస్ నేత అరవింద్ తమ వద్ద రూ. 5 కోట్లు తీసుకున్నాడని బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో బెంగళూరు కంపెనీ ఫిర్యాదు చేయడంతో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు అరవింద్ను అదుపులోకి తీసుకున్నారు. కంపెనీ వద్ద రూ.5 కోట్లు తీసుకుని మిడ్ డే మీల్స్ స్కీమ్కు సంబంధించి అరవింద్ ఏకంగా ఒక ఫేక్ జీవోను కూడా తయారు చేశాడు. ఇదీచదవండి.. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ -
మహిళను వంచించి.. పెళ్లొద్దన్న ఎంపీ కుమారుడు!
సాక్షి,బళ్లారి: బళ్లారి లోక్సభ సభ్యుడు దేవేంద్రప్ప తనయుడు రంగనాథ్పై వంచన కేసు నమోదైంది. శుక్రవారం బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్– 420, 417, 506 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. వివరాలు.. మైసూరు మహారాజా కాలేజీలో ఎంపీ తనయుడు రంగనాథ్ ఉద్యోగం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం నుంచి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాంఛలు తీర్చుకుని వదిలేశాడని సదరు మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని తెలిపింది. నాకూ ఫోన్ చేసింది: ఎంపీ ఈ ఘటనపై ఎంపీ దేవేంద్రప్ప దావణగెరె జిల్లా అరసికెరెలో స్పందించారు. తన కుమారుడిపై కుట్రతో కేసు నమోదు చేశారన్నారు. ఆరు నెలల క్రితం ఓ మహిళ తనకు కూడా ఫోన్ చేసి తన కొడుకు గురించి ఫోన్లో చెప్పిందన్నారు. అయితే తప్పు చేసి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కోర్టులు ఉన్నాయని సూచించానన్నారు. ఆమె డబ్బు కోసం బెదిరిస్తోంది: రంగనాథ్ మైసూరు: డబ్బుల కోసం యువతి ఒకరు బ్లాక్ మెయిల్ చేస్తోందని మైసూరులోని మహారాజ కళాశాల లెక్చరర్ రంగనాథ్ (42) విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. తన స్నేహితుడు అయిన కల్లేష్ అనే వ్యక్తి నుంచి దేవిక (24) అనే యువతి పరిచయమైంది. 2, 3 సార్లు ఆమె కలిసిన తరువాత ప్రేమిస్తున్నానని చెప్పింది. కానీ నేను ప్రేమించడం లేదని చెప్పినట్లు రంగనాథ్ అన్నారు. పెళ్లి చేసుకుంటానని మోసగించాడు బనశంకరి: బళ్లారి ఎంపీ దేవేంద్రప్ప కుమారుడు రంగనాథ్ అమ్మనాన్నకు పరిచయం చేస్తానని తెలిపి ప్రైవేటు హోటల్కు తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నారని ఓ యువతి ఆరోపించింది. వివాహం చేసుకుంటానని నమ్మించి నన్ను మోసం చేశాడని శుక్రవారం బెంగళూరు బసవనగుడి మహిళాపోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేశారు. తరువాత ఆమె విలేకరులతో మాట్లాడింది. అతనికి గతంలోనే వివాహమైనట్లు తనకు తెలియదన్నారు. పెళ్లి చేసుకోవాలని నేను ఎంత బ్రతిమాలినప్పటికీ ఒప్పుకోలేదు, డబ్బు ఇస్తాను, నన్ను వదిలి వెళ్లిపో అని ఒత్తిడి చేశాడని ఆమె పేర్కొంది. -
ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు: కంపెనీ క్లారిటీ ఇది
తన కుమారుడికి మరణానికి కారణమంటూ ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలైన కేసుపై సంస్థ స్పందించింది. మృతుడు నడిపిన స్కార్పియో వాహనంలోని ఎయిర్బ్యాగ్స్లో ఎలాంటి లోపం లేదంటూ ఆరోపణలను తోసిపుచ్చింది. సెప్టెంబర్ 23, 2023న దాఖలైన ఎఫ్ఐఆర్కు సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ప్రకటన జారీ చేసింది. దాదాపు రూ. 20 లక్షల ఖరీదు చేసే కారులో భద్రతా ఫీచర్లపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తిన నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. సంబంధిత కారులో ఎయిర్బ్యాగులు ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే వాహనం బోల్తా పడిన కారణంగా కారులో ఎయిర్బ్యాగ్లు ఓపెన్ కాలేదని తెలిపింది.అంతేకాదు ఈ కేసు 18 నెలలకు పైగా పాతది ఈ సంఘటన జనవరి 2022లో జరిగిందని తెలిపింది. 2020లో తయారైన స్కార్పియో S9 వేరియంట్లో ఎయిర్బ్యాగ్లు ఉన్నాయని ధృవీకరింకరించింది. తమ పరిశీలనలో ఎయిర్బ్యాగ్ల లోపం లేదని తేలిందని వాహనం బోల్తా పడినపుడు ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ కావని తెలిపింది. దీనిపై గత ఏడాది అక్టోబర్లో తమ టీం వివరణాత్మక సాంకేతిక పరిశోధన నిర్వహించినట్టు కూడా తెలిపింది. ఈ విషయం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది, విచారణకు తాము పూర్తి సహకరిస్తున్నామని పేర్కొంది. అలాగే బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. కాగా ఉత్తరప్రదేశ్కి చెందిన రాజేష్ మిశ్రా ఫిర్యాదు మేరకు మిశ్రా తన కుమారుడు అపూర్వ్కు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బ్లాక్ స్కార్పియో కారును బహుమతిగా ఇచ్చారు. 2022 జనవరి 14న అపూర్వ్ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్బ్యాగులు ఓపెన్ కాకపోవడం వల్లనే తనకు తీరని నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదు చేశారు.కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందంటూ ఆనంద్ మహీంద్రాతో పాటు, ఇతర కీలక ఉద్యోగులపై చీటింగ్ కేసు, 506 (నేరపూరిత బెదిరింపు), 102-B (నేరపూరిత బెదిరింపు)కేసులుపెట్టిన సంగతితెలిసిందే. -
జనసేన నేతపై చీటింగ్ కేసు
కోవూరు: జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిశోర్ తన వద్ద రూ.5 లక్షలు డబ్బు తీసుకొని మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్నాడని ఇందుకూరుపేటలోని పడమటివీధికి చెందిన ఎస్కే ఆసిఫ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని కథనం మేరకు తాను వృత్తిపరంగా హైదరాబాద్లో ఉంటున్నానని, తనతో కలిసి డిగ్రీ చదివిన గునుకుల కిశోర్ నెల్లూరులోని గాం ధీబొమ్మ సెంటర్లో లగేజ్ ల్యాండ్ బ్యాగ్ షోరూం నిర్వహిస్తున్నాడని తెలిపారు. కిశోర్ తన షాపులో పార్టనర్షిప్ ఇస్తానని నమ్మబలికి 2016 మార్చి 9న ఆసిఫ్ ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.3 లక్షలు, 2018 మార్చి 21న యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.2 లక్షలు మొత్తం రూ.5 లక్షలు కిశోర్ ఖాతాకు జమ చేయించుకున్నట్లు బాధితుడు తెలిపాడు. కొద్దిరోజుల తరువాత వ్యాపారంలో లాభాలు పంచుతానని మాయమాటలు చెప్పాడని, అనంతరం తన ఫోన్ తీయకుండా కంటికి కన్పించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితుడు వాపోయా డు. సోమవారం ఇందుకూరుపేట నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళుతున్న క్రమంలో కిశోర్ కన్పించగా తనకు ఇవ్వాల్సిన రూ.5 లక్షల ఇవ్వాలని కోరడంతో తనపైన దాడి చేసి అసభ్యకర పదజాలంతో దూషించాడని తెలిపాడు. తనను నమ్మించి మోసం చేసిన గునుకుల కిశోర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్కొన్నారు. అంతేకాక కిశోర్ తనతోపాటు పలువురిని మోసం చేశాడని ఆసిఫ్ ఆరోపించారు. కిశోర్ తీరుపై జనసేన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా వారు ఏ మాత్రం పట్టించుకోకపోగా, వ్యక్తి గత విషయమైనందున మీరే తేల్చుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితుడు వాపోయాడు. ఇక గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించినట్లు ఆసిఫ్ తెలిపాడు. -
మార్గదర్శి కేసు: రామోజీరావుకు షాక్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మార్గదర్శి చిట్స్లో మోసాలపై మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యజమాని చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్తో పాటు విజయవాడ లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, పలువురు సిబ్బందిపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గురువారం చీటింగ్ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది. సక్రమంగా వాయిదాలు చెల్లించినా, చిట్లో పాడుకొన్ని నగదు ఇవ్వకుండా మార్గదర్శి యాజమాన్యం నాలుగు నెలలుగా ఇబ్బందులు పెడుతోందని బాధితుడు, న్యాయవాది ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 420 (చీటింగ్), 120బి, సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. 64 ఏళ్ల వయసున్న బాధితుడు ముష్టి శ్రీనివాస్ టాక్స్ కన్సల్టెంట్గా, కొన్ని కంపెనీలకు లీగల్ అడ్వైజర్గా పని చేస్తున్నారు. 2021 సెప్టెంబర్లో మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్లో చిట్ వేశారు. 50 నెలల పాటు నెలకు రూ. లక్ష చిట్లో పాల్గొన్నారు. 19 నెలలు (రూ.19 లక్షలు) చిట్ నగదు సక్రమంగానే చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 37.50 లక్షలకు చిట్ పాడారు. అయితే, ఆయన చెల్లించాల్సిన నగదును మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ ఇప్పటివరకు చెల్లించకపోవడంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు రాణా తెలిపారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో బ్యాంక్ ఖాతా ఉండాల్సి ఉండగా, బ్రాంచ్లో ఒకే బ్యాంక్ ఖాతాను అన్ని గ్రూపులకు వినియోగిస్తూ, డిపాజిట్లు సేకరిస్తూ మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్, పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్నట్ల తెలిపారు. మరికొందరు ఉద్యోగులు, సిబ్బందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఇది కూడా చదవండి: గూగుల్ టేక్ అవుట్ తప్పు.. మాటమార్చిన సీబీఐ! -
AP: జాబ్ పేరుతో నిరుద్యోగులకు టోకరా.. వీఆర్వో రేఖ అరెస్ట్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులను టార్గెట్ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన మహిళా వీఆర్వోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విజయవాడ పరిధిలో చోటుచేసుకుంది. నిరుద్యోగులకు ఔట్ సోర్సింగ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు మహిళ డబ్బులు వసూలు చేసింది. వివరాల ప్రకారం.. వీఆర్వో రేఖ కొంత మందితో కలిసి నిరుద్యోగులకు టోకరా వేసింది. ఔట్ సోర్సింగ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడింది. ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల నుంచి రూ.8లక్షల చొప్పున వసూలు చేసింది. దీంతో, ఉద్యోగాల విషయమై ఆమెను ప్రశ్నించడంతో ముఖం చాటేసింది. ఈ నేపథ్యంలో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక, బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్లింట తీవ్ర విషాదం.. వరుడు సహా అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనం -
మాజీ రంజీ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అరెస్ట్
చీటింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ నాగరాజు బుడుమూరు అరెస్టయ్యాడు. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారికి ఫోన్ చేసి వర్ధమాన క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ ఆటగాడు రికీ భుయ్కు రూ.12 లక్షల స్పాన్సర్షిప్ కావాలని కోరిన కేసులో నాగరాజును ముంబై సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినంటూ వ్యాపారిని బురిడీ కొట్టించిన నాగరాజు.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రికీ భుయ్ల పేర్లు వాడుకుని సొమ్మును కాజేశాడు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన నాగరాజు.. గతంలో ఓ రాజకీయ నాయకుడు చేసిన మోసం వల్ల తాను ఈ తరహా మోసాలకు అలవాటు పడినట్లు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల నాగరాజు.. 2021లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ పలు కార్పొరేట్ కంపెనీలను రూ. 40 లక్షలు వరకు మోసగించినందుకు అరెస్టయ్యాడు. నాగరాజు 2018 నుంచి ఇప్పటి వరకు స్పాన్సర్షిప్ పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 60కిపైగా కంపెనీలను రూ.3 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఎంబీఏ చదువుకున్న నాగరాజు 2014-2016 మధ్యలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు (రంజీ ట్రోఫీ మ్యాచ్లలో), 2016-2018 మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఇండియా-బి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. నాగరాజు.. 2016లో క్రికెట్కు సంబంధించి గిన్నిస్ రికార్డుకు కూడా ప్రయత్నించాడు. సుదీర్ఘ సమయం నెట్ సెషన్లో పాల్గొన్న బ్యాటర్ విభాగంలో నాగరాజు గిన్నిస్ రికార్డుల్లోకెక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. -
కోడెల శివరామ్కు బిగ్ షాక్!
తెనాలిరూరల్: టీడీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్పై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్, అతడి భార్య పద్మప్రియ విజ్ఞప్తి మేరకు శివరామ్కే చెందిన కైరా ఇన్ఫ్రా కంపెనీలో 2016లో గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన పాలడుగు బాలవెంకటసురేష్ రూ.24.25 లక్షల పెట్టుబడి పెట్టారు. మరో ముగ్గురు సుమారు రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టారు. అందుకు సంబంధించి చెక్కుల ద్వారా లావాదేవీ జరిపారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా శివరామ్, అతడి భార్య ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. బాలవెంకటసురేష్ పిటిషన్పై కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు శివరామ్పై 420, 407, 403, 386, 389, 120బి, 506, 509 ఐపీసీ, 156(3) సీఆర్పీసీ సెక్షన్ల కింద రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. -
‘జలకన్య కన్ను’ పేరుతో బురిడీ
సాక్షి, హైదరాబాద్: జలకన్య కన్నుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, దీంతో మీకు అంతా శుభం జరుగుతుందని, కోరుకున్న పని ఇట్లే జరిగిపోతుందని కల్లబొల్లి మాటలు చెప్పి అందినకాడికి దండుకోవాలని భావించిన నిందితుల ఆటకట్టించారు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు. వరంగల్కు చెందిన చందు, యాప్రాల్కు చెందిన సాంబశివ ఇద్దరు స్నేహితులు. తీర్థయాత్రల నిమిత్తం షిరిడీకి వెళ్లిన ఇరువురు.. తిరుగు ప్రయాణంలో స్థానికంగా దొరికే రంగు రాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్కు తిరిగొచ్చాక ఆ రంగురాయిలో బ్యాటరీ సహాయంతో చిన్నపాటి లైట్ను అమర్చారు. లైట్ అమర్చిన రంగురాయికి నీళ్లు తాకగానే దాని కాంతి రెట్టింపు అవుతుంది. దీన్ని గమనించిన చందు, శివలకు దుర్బుద్ధి పుట్టింది. రంగురాయికి శక్తులు ఉన్నాయని నమ్మించి అమాయకులకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కాప్రాలో పలువురు వ్యాపారులు, స్థానికులకు చూపించి..ఈ రంగురాయి సాగరకన్య నోటిలో నుంచి తీసిన జలకాంతం అని మాయమాటలు చెప్పారు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని నమ్మించారు. రూ.2 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ రాములు బృందం ఇద్దరు నిందితులు చందు, సాంబశివలను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. (చదవండి: సమరానికి సై.. ఫార్ములా–ఈ పోటీలకు రేసర్లు రెడీ.. ) -
ఇన్స్టాలో ఐఫోన్ అగ్గువ.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న నిట్ విద్యార్థిని
సాక్షి, వరంగల్: ఇన్స్టాగ్రామ్లో అతి తక్కువ ధరకే ఐఫోన్ లభిస్తుందని వచ్చిన ఓ ప్రకటన చూసి అత్యాశకు పోయిన ఓ నిట్ విద్యార్థి రూ.42,497 నగదు పోగొట్టుకుంది. విద్యార్థిని తన ఫోన్లో ఇన్స్టా యాప్ చూస్తుండగా ఐఫోన్, డెల్ ఐ–5 ల్యాప్టాప్ తక్కువ ధరకు ఉందనే ప్రకటన చూసి ఆర్డర్ పెట్టింది. వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ల్యాప్టాప్ లేదని, వన్ ప్లస్ మొబైల్ ఉందని చెప్పగా.. రూ.42,497 నగదును ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. రోజులు గడుస్తున్నా ఫోన్ రాకపోవడంతో ఆ నంబర్కు ఫోన్ చేయగా అవతలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని కాజీపేట పోలీసులను ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. రూ. 34 వేలు పోగొట్టుకున్న చిరు వ్యాపారి.. హనుమకొండ విజయపాల్ కాలనీకి చెందిన చిరువ్యాపారి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.34 వేలు పోగొట్టుకున్నాడు. నిట్ వరంగల్ కలాం విశ్రాంతి గృహానికి బిస్లరీ వాటర్ బాటిళ్లు పంపించాలని గుర్తు తెలియని వ్యక్తి చిరువ్యాపారికి ఫోన్ చేశాడు. బాటిళ్లను ఎన్ఐటీకి తీసుకెళ్లగా ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి అక్కడ లేడు. దీంతో వ్యాపారి ఫోన్ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తి రూ.20 నగదు మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. రూ.34వేలు పంపిస్తే రూ. 68 వేలు పంపిస్తానని మాయమాటలు చెప్పాడు. చిరువ్యాపారి రూ.34 వేలు పంపించాడు. ఆతర్వాత అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించిన బాధితుడు కాజీపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి తెలిపారు. చదవండి: లైట్ తీస్కోవద్దు.. నాకేమవుతుందనుకుంటే ప్రమాదమే, తస్మాత్ జాగ్రత్త! -
దీపక్ చహర్ భార్యకు బెదిరింపులు
టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు సదరు దుండగులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు. ఈ విషయమై దీపక్ చహర్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయంలోకి వెళితే.. రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పరేక్ జయ భరద్వాజ్ దగ్గర రూ. 10లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆన్లైన్లో రూ.10 లక్షలు పంపించారు. కానీ ఆ డబ్బును వారు దుర్వినియోగం చేసినట్లు తెలుసుకున్న జయా భరద్వాజ్ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగారు. అయితే తండ్రి, కొడుకులు డబ్బు తిరిగి ఇవ్వడమే కాకుండా ఫోన్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడారని.. చంపేస్తామంటూ బెదిరించారని దీపక్ చహర్ తండ్రి పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. మోసం చేసిన వారిద్దరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో సంబంధం ఉన్నట్లు తెలియడంతో కంపెనీ యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా దీపక్ చహర్ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. దీపక్, జయ భరద్వాజ్ల వివాహం గతేడాది జూన్ 1న జరిగింది. వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ఆల్రౌండర్గా సేవలందిస్తున్నాడు చహర్. చహర్ టీమిండియా తరపున ఏడు వన్డేల్లో 10 వికెట్లు, 24 టి20 మ్యాచ్ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
హీరోయిన్ అనుష్క పేరు చెప్పి రూ.51 లక్షలు మోసం!
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పలానా హీరో, హీరోయిన్ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని, సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటూ పలువురు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పి రూ.51లక్షలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనుష్క, మణిశర్మలతో అపాయింట్మెంట్ ఇప్పిస్తానంటూ మేనేజర్ ఎల్లారెడ్డి.. విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, వర్ధమాన నిర్మాత లక్ష్మన్ చారీ నుంచి రూ. 51 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అనుష్కతో సినిమా డేట్స్ అంటూ నిర్మాతను పలు మార్లు బెంగళూరు తీసుకెళ్ళిన ఎల్లారెడ్డి.. మొదటగా రూ.26 లక్షలు వసూలు, తర్వాత మణిశర్మ పేరు చెప్పి మరికొన్ని డబ్బులు.. మొత్తంగా రూ.51 లక్షలు వసూలు చేసి అపాయింట్మెంట్ ఇప్పించలేదు. ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానని గుర్తించిన లక్ష్మణాచారి.. ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు. దీంతో మొదట డబ్బు వెనక్కి ఇస్తా అని చెప్పిన మేనేజర్, తరువాత తిరగపడ్డాడు.డబ్బులు అడిగితే ఇంట్లోని ఆడవాళ్లతో కేసులు పెట్టిస్తాని బెదిరించాడు. చివరకు చేసేదేమి లేక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
భారత క్రికెటర్కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడని నమ్మి పని ఇస్తే నట్టేట ముంచాడు. ఫ్లాట్ కొనుగోలు పేరిట ఉమేశ్ యాదవ్ను బురిడీ కొట్టించి రూ. 44 లక్షలు ఎగనామం పెట్టాడు. విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్పూర్లోని కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఠాక్రే (37)తో ఉమేశ్ యాదవ్కు ఎంతోకాలంగా స్నేహం ఉంది. శైలేష్ కు ఉద్యోగం లేపోవడంతో ఉమేశ్ తన మేనేజర్ గా జూలై 2014లో నియమించుకున్నాడు.ఎంతో నమ్మకంగా ఉండటంతో శైలేష్ కు ఆర్థిక వ్యవహారాలు కూడా అప్పగించాడు. ఉమేశ్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు. ఈ క్రమంలో రూ.44లక్షలకే భూమి ఇప్పిస్తానని ఉమేశ్ ను నమ్మించి ఆ ఫ్లాట్ ను తన పేరిట రిజిస్ట్రర్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని క్రికెటర్ ఉమేశ్ యాదవ్ నివ్వెరపోయాడు. నమ్మిన స్నేహితుడే తనను మోసం చేశాడని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని శైలేష్ను కోరాడు. అయితే డబ్బు ఇవ్వడానికి శైలేష్ నిరాకరించడంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు.ఉమేశ్ యాదవ్ ఫిర్యాదుతో పోలీసుల రంగంలోకి దిగారు. ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇక 2011లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్ కొంతకాలంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. 12 ఏళ్ల కెరీర్లో ఉమేశ్ యాదవ్ 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టి20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'భారీ స్కోర్లు రావడం లేవని తెలుసు.. కచ్చితంగా సెంచరీ కొడతా' -
Hyderabad: కానిస్టేబుల్ నిర్వాకం.. యువతితో 4 ఏళ్ల ప్రేమ.. బర్త్డే పేరుతో!
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏఆర్ కానిస్టేబుల్ యువతిని మోసం చేసిన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎమ్.ఎస్ మక్తాకు చెందిన యువతికి కామన్ ఫ్రెండ్ ద్వారా ఏఆర్ కానిస్టేబుల్ ఎ.నిఖిల్ (27)తో 4 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం తన పుట్టిన రోజు అని చెప్పి యువతిని బయటకు తీసుకెళ్లాడు. మాయమాటలతో నమ్మించి ఓ రూమ్కు తీసుకెళ్లి ఆమెతో శారీరకంగా కలిశాడు. అప్పటి నుంచి యువతిని నమ్మించి పలుమార్లు లైంగికదాడి చేశాడు. వివాహం చేసుకోమని యువతి డిమాండ్ చేసిన ప్రతిసారి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో యువతి ఆరా తీయగా మరో యువతితో నిఖిల్కు సంబంధం ఉందని తెలిసింది. అప్పటి నుంచి బాధితురాలు నిఖిల్ను దూరం పెట్టడం ప్రారంభించింది. రెండున్నర నెలల క్రితం తన ఇంటికి రావాలని మాట్లాడుకుందామని చెప్పడంతో యువతి నమ్మి వెళ్లింది. ఇంట్లోనే యువతిపై కానిస్టేబుల్ అఘాయిత్యానికి పాల్పడంతో యువతి గర్భం దాల్చింది. దీంతో తననుపెళ్లి చేసుకోవాలని అడగ్గా కానిస్టేబుల్ అందుకు నిరాకరించాడు. తాను పోలీస్నని తనను ఎవరూ ఏమి చేయలేరని బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ టీంను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న నిఖిల్ బాధితురాలి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భం ఇప్పుడే వద్దంటూ కొన్ని మాత్రలు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని అడగగా ముఖం చాటేస్తున్నాడు. దీంతో ఆమె పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ నిర్మాత అరెస్ట్.. కారణం ఇదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
తమిళ సినిమా: ఆరుద్ర గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ మోసం కేసులో కాంచీపురం బ్రాంచ్ నిర్వాహకుడు, సినీ నటుడు, నిర్మాత రుసో(42)ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించారు. వివరాలు.. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఆరుద్ర గోల్డ్ ఫైనాన్స్కు చెందిన బ్రాంచ్లు ఉన్నాయి. ఈ కంపెనీ 30 శాతం వడ్డీ చెల్లిస్తామని ప్రచారం చేసి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. బోర్డు తిప్పేయడంతో బాధితులు చెన్నై క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెన్నై అమంజికరైలోని ఆరుద్ర గోల్డ్ ఫైనాన్స్ ప్రధాన కార్యాలయం డైరెక్టర్ సెంథిల్ను అరెస్ట్ చేసి విచారించారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆయన బ్యాంకు అకౌంట్ నుంచి కాంచీపురం బ్రాంచ్ నిర్వాహకుడు రుసో బ్యాంకు అకౌంటుకు భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. దీంతో రుసో ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.8 లక్షల నగదు, బంగారం, ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆయన బ్యాంకులోని రూ.1.40 కోట్లను సీజ్ చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, రుసో రూ.10 కోట్లతో కొత్త భవనాన్ని, ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. కాగా ఆర్కే సురేశ్ దర్శకత్వంలో రుసో చిత్రాన్ని నిర్మిస్తూ అందులో కథానాయకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది. చదవండి: అలాంటి వాటిపై నమ్మకం లేదు.. కానీ భయమేస్తుంటుంది: నయన్ -
ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...
సాక్షి, హిందూపురం: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వమూ దోచేసిన యువకుడు.. పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేశాడంటూ ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. హిందూపురం మండలానికి చెందిన ఓ యువతి అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే కర్నూలు జిల్లా పెద్దకడుబూరు ప్రాంతానికి చెందిన గణేష్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్ల పాటు తనతో పాటు తిప్పుకున్నాడు. ప్రస్తుతం దళితురాలిననే కారణం చూపి పెళ్లికి అంగీకరించడం లేదు. గణేష్ చేసిన మోసంపై ఇప్పటికే పోలీసు స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలసి ఫిర్యాదు చేసింది. దీనిపై 20 రోజుల క్రితం హిందూపురం రూరల్ పోలీసులు పిలిపించుకుని విచారణ చేశారు. అయినా తనకు న్యాయం చేకూరలేదంటూ శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేవీపీఎస్ నాయకులతో కలసి భైఠాయించి నిరసన వ్యక్తంచేసింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని పేర్కొంది. కార్యక్రమంలో బాధితురాలితో పాటు తల్లి, కేవీపీఎస్ నాయకులు అన్నమయ్య, రమణ, రాము, జ్యోతమ్మ, మధు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం రూరల్ సీఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అబ్బాయిని పిలిపించి విచారిస్తే అతను ఒప్పుకోవడం లేదన్నారు. బాధితురాలు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. (చదవండి: అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష ) -
దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కాబోయే భార్య... దెబ్బకు వరుడు అరెస్టు
రేపు పెళ్లి అనంగా ఒక వ్యక్తి అరెస్టు అయ్యాడు. అతని నిజ స్వరూపాన్ని కాబోయే భార్య బట్టబయలు చేసింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రీలో నివాసం ఉంటున్న హసిన్ సైఫీ అనే వ్యక్తి ఒక ఒక మహిళకు తన పేరు ఆశిష్ ఠాకూర్గా(నకిలీ పేరుతో) పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఒక రోజు ఆమెకు ఉద్యోగం పోయింది. దీన్నే అవకాశంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆశిష్ ఆమె ఉంటున్న ఫ్లాట్కి వచ్చి ఉండటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక కొద్దిరోజులకే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వారి పెళ్లి ఈ నెల డిసెంబర్ 12న జరగాల్సి ఉంది. ఐతే ఆ జంట ఇంట్లో లేనప్పుడు ఒక పెద్దాయన తన కొడుకు హసన్ ఆచూకీ కోసం ఇరుగుపోరుగు వారిని ఆరా తీశాడు. ఐతే ఇక్కడ ఆశిష్ అనే వ్యక్తి ఇటీవలే కొత్తగా వచ్చి ఉంటున్నాడని హసన్ కాదని వారు చెప్పారు. ఈ విషయం సదరు మహిళ తెలుసుకుని ఆ పెద్దాయనను కలుసుకుంది. ఆయన ద్వారా అతడి పేరు ఆశిష్ కాదని హసీన్ సైఫీ అని తెలుసుకోవడమే గాక అతడి చేసిన మోసం అంతా తెలుసుకుని షాక్ తింటుంది. దీంతో ఆమె తనను మోసం చేయడమేగాక బలవంతంగా పెళ్లిచేసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) దినేష్ కుమార్ తెలిపారు. (చదవండి: పెళ్లైపోతుందనంగా... వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ...) -
హైటెక్ దందా.. బోర్డు తిప్పేసిన సంకల్ప్ మార్ట్!
మోర్తాడ్(బాల్కొండ): నిత్యావసర సరుకులు, ఎర్రచందనం మొక్కల వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభాల్లో వాటా పొందవచ్చని, ఉన్నంతలో మనమూ కూడా ఆర్థికంగా ఎదగవచ్చని నమ్మించి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన సంకల్ప్ మార్ట్ సంస్థ బోర్డు తిప్పేసింది. రూ. వెయ్యి నుంచి ఎంత మొత్తమైనా పెట్టుబడి పెడితే రోజువారీగా కొంత ఆదాయం డిపాజిట్దారుల ఖాతాల్లో జమ చేస్తామని నమ్మించిన సంస్థ ప్రతినిధులు ఇప్పుడు ముఖం చాటేయడంతో సదరు సంస్థలో పెట్టుబడి పెట్టినవారు లబోదిబోమంటున్నారు. కాగా, విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న సంకల్ప్ మార్ట్ సంస్థకు మోర్తాడ్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రతినిధులుగా వ్యవహరించారు. దాదాపు నాలుగు వందల మందితో రూ. 50లక్షల వరకు డిపాజిట్ చేయించారు. సంస్థలో పెట్టుబడి పెట్టినవారికి ఆన్లైన్లో లాగిన్ కావడానికి ఐడీ, పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసి ఇచ్చారు. కొంత మందికి మొదట్లో రూ. వెయ్యి నుంచి రూ. 1,500ల వరకు లాభాలు వచ్చాయని నమ్మించి ఖాతాల్లో జమ చేయించారు. ఇలా లాభాలు పొందినవారి పేర్లు చెబుతూ తమ ఖాతాదారుల సంఖ్యను భారీగా పెంచుకున్నారు. కొన్ని రోజులపాటు సంస్థ ఆన్లైన్ లాగింగ్ పనిచేయగా గత నెలాఖరులో లాగిన్ పనిచేయడం స్తంభించింది. ఆన్లైన్లో లాగిన్ పనిచేయకపోవడంతో పెట్టుబడి పెట్టినవారికి అనుమానం వచ్చి సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. సంస్థ యజమానిగా చలామని అవుతున్న వ్యక్తి అరెస్టు అయ్యాడని అతను బైలుపై బయటకు రాగానే సంస్థ కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని ప్రతినిధులు నమ్మిస్తున్నారు. డిపాజిట్లు చేసిన వారు తమ సొమ్ము వాపసు చేయాలని సంస్థ ప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయింది. ప్రశ్నించినవారు ‘రిమూవ్’.. సంస్థలో చేరిన వారితో ప్రతినిధులు ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. గ్రూపులో సంస్థ కార్యకలాపాలు ఎందుకు నిలిచిపోయాయి, తమ సొమ్మును ఎవరు వాపసు ఇస్తారు.. తమను చేర్పించిన ప్రతినిధులే బాధ్యత వహించాలని కొందరు సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఇలా ప్రశ్నిస్తున్న వ్యక్తులను వాట్సాప్ గ్రూప్ నుంచి సంస్థ ప్రతినిధులు తొలగిస్తున్నారని బాధితులు వాపోయారు. మరి కొందరు మాత్రం మున్ముందు ఏమైనా సమాచారం రావచ్చనే ఉద్దేశంతో వాట్సాప్ గ్రూప్లో ఉండిపోయారు. ఇదిలా ఉండగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన సంస్థ ఎలాంటిదో యజమానులు ఎలాంటివారో తమకు తెలియదని బాధితులు చెబుతున్నారు. తమకు సదరు సంస్థపై నమ్మకం కలిగించి తమతో పెట్టుబడి పెట్టించినవారే డబ్బులు వాపసు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ముద్ర అనే సంస్థ డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేయగా ఇప్పుడు సంకల్ప్ మార్ట్ సంస్థ అదే కోవలో బోర్డు తిప్పేయడంతో అమాయకులు మోసపోయారు. -
ఇన్స్టాగ్రామ్ లవ్ ఆ్రస్టాలజర్ను నమ్మిన ఐటీ ఉద్యోగిని.. ఆ తర్వాత..
సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో లవ్ ఆ్రస్టాలజర్ గోపాల్ శాస్త్రిగా ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారిని నిండా ముంచుతున్న పంజాబ్లోని మొహాలీ ప్రాంతానికి చెందిన లలిత్ ఎట్టకేలకు చిక్కాడు. నగర యువతి నుంచి రూ.47.11 లక్షలు కాజేసిన ఇతడిని అక్కడ అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చినట్లు జాయింట్ సీపీ డాక్టర్ గజరావ్ భూపాల్ సోమవారం ప్రకటించారు. వివరాల ప్రకారం.. లలిత్ తండ్రి గోపాల్ చాంద్ జ్యోతిష్యుడు. ఆయన నుంచి వారసత్వంగా ఈ విద్యను నేర్చుకుని వృత్తి చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఖాతాలు తెరిచిన లలిత్ ఆన్లైన్ జ్యోతిష్యమంటూ గూగుల్, యూట్యూబ్స్లో యాడ్స్ ఇచ్చాడు. నగరానికి చెందిన ఓ యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. జాతకాలు, పూజలపై నమ్మకం ఉన్న ఆమె కొన్ని వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేసింది. ఇలా ఉండగా ఆన్లైన్లో వచ్చిన ఓ ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. అందులోని ఫోన్ నంబర్లో సంప్రదించింది. తన విషయాన్ని గోపాల్ శాస్త్రిగా చెప్పుకున్న లలిత్కు చెప్పగా సమస్యలు పరిష్కరిస్తానంటూ నమ్మబలికాడు. తొలుత ఆమె వివరాలు తెలుసుకున్న బురిడీ బాబా ఏదో పరిశీలనలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. చివరకు జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని, నివారణ పూజలు చేసి సరిదిద్దుతానని నమ్మబలికాడు. పూజ ప్రారంభించడానికి, ఇతర ఖర్చులకు రూ.32 వేలు చెల్లించాలని కోరాడు. ఇలా మొదలెట్టిన అతగాడు పలు దఫాలుగా రకరకాల పేర్లు చెప్పి ఆమె నుంచి రూ.47.11 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కె.హరిభూషణ్రావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. లలిత్ను మొహాలీలో అరెస్టు చేసి పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చింది. గతంలో పాతబస్తీకి చెందిన ఓ మహిళ కూడా ఇదే తరహాలో రూ.4 లక్షలు కోల్పోయింది. ఆ నేరంలో ఇతడి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పనులు త్వరగా పూర్తి చేయండి
ఖానాపూర్లో రాత్రి భోజనం చేసిన కేటీఆర్
నిర్మల్
రాజన్న సేవలో ప్రముఖులు
బీజేపీ, బీఆర్ఎస్లను నమ్మే పరిస్థితి లేదు
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి
బతుకమ్మ చీరలతో బతుకులేకుండా చేశారు
సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం
సిరిసిల్ల జిల్లా ఉండాల్నా.. వద్దా?
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement