సాక్షి, హైదరాబాద్: అర్హులందరికీ బీసీ రాయితీ రుణాలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణ య్య డిమాండ్ చేశారు. గురువారం బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధుల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రాయితీ రుణాలను టీఆర్ఎస్ పార్టీ వారికే ఇచ్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 60లక్షల బీసీ కుటుంబాలుంటే 5.7 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆధారంగా లెక్కిస్తే రూ.7వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ వెయ్యికోట్లతో సర్దుబాటు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బడ్జెట్ను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. రుణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం వెంటనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని, క్షేత్రస్థాయి సమస్యలను వారి దృష్టికి తెచ్చేందుకు సమావేశానికి బీసీ సంఘ ప్రతినిధులనూ ఆహ్వానించాలన్నారు. సమావేశంలో జి.కృష్ణ, ఎన్.వెంకటేశ్, భూపేశ్ సాగర్, నందగోపాల్ పాల్గొన్నారు.