అసైన్డ్ డొంక కదులుతోంది | government Possession of assigned lands in rangareddy district | Sakshi
Sakshi News home page

అసైన్డ్ డొంక కదులుతోంది

May 26 2016 4:30 PM | Updated on Mar 28 2018 11:26 AM

అసైన్డ్ డొంక కదులుతోంది - Sakshi

అసైన్డ్ డొంక కదులుతోంది

చేతులు మారిన అసైన్డ్ భూముల డొంక కదులుతోంది. పరాధీనమైన భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.

చేతులు మారిన అసైన్డ్ భూముల డొంక కదులుతోంది. పరాధీనమైన భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకొని సొంతదారులకు అప్పగించాలని, లేనిపక్షంలో పీఓటీ చట్టం-1977 కింద వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సర్కారు అధికారులను ఆదేశించింది. భూమిలేని పేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేటాయించిన  భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఈ నెల 30వ తేదీలోపు అసైన్డ్ భూముల లెక్క తీయాలని ఆదేశించింది.   

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా నిరుపేదలకు పంపిణీ చేసిన 1.58 లక్షల ఎకరాల భూముల చిట్టాను సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. క్షేత్రస్థాయిలో సర్వే చేయడం ద్వారా అసైన్డ్‌దారుల వద్దే భూమి ఉందా? ఆ భూమిలో సేద్యం చేస్తున్నారా? అనే వివరాలను సేకరించాలని తహసీల్దార్లకు జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఈ మేరకు నిర్దేశించిన ఒక నమూనాను పంపింది. జిల్లాలో వివిధ సందర్భాలలో 1,15,218 మందికి 1,58,646.25 ఎకరాలను ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. ఈ భూములను వ్యవసాయోగ్యంగా మలుచుకునేందుకు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రుణాలను కూడా మంజూరు చేస్తోంది. అయితే, భూముల విలువలు ఆకాశన్నంటడం.. లబ్ధిదారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా కొన్నిచోట్ల ఇవి చేతులు మారాయి. వాస్తవానికి పీఓటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు చెల్లవు. అయినప్పటికీ, లోపాయికారి ఒప్పందాల ద్వారా ఈ భూ క్రయవిక్రయాలు జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరాధీనమైనట్లు గుర్తించిన భూములను గ తంలో జిల్లా యంత్రాంగం పెద్దఎత్తున స్వాధీనం చేసుకొని సొంత దారులకు (ఓరిజినల్ అసైనీ) అప్పగించింది. జాయింట్ కలెక్టర్లుగా పనిచేసిన శేషాద్రి, రిజ్వీ హయాంలో దాదాపు 20 వేల ఎకరాలను పీఓటీ కింద వెనక్కి తీసుకుంది. ఇలా తీసుకున్న భూమిలో కొంత పేదలకు పంపిణీ చేసింది.

10 ఎకరాలు పక్కదారి
జిల్లావ్యాప్తంగా దాదాపు పది వేల ఎకరాల మేర అన్యాక్రాంతమైనట్లు రెవెన్యూ యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. నగరీకరణ నేపథ్యంలో ఈ భూములపై కూడా కన్నేసిన భూ మాఫియా కారుచౌక గా వీటిని కొల్లగొట్టింది. మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, మహేశ్వరం, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ తదితర మండలాల్లో అసైన్డ్‌దారుల నుంచి కొనుగోలుచేసినట్లు తేలింది. దీంట్లో కొన్ని చోట్ల ఫామ్‌హౌజ్‌లు పుట్టుకురాగా... కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయ తోటలు సాగయినట్లు తేల్చింది. వాస్తవానికి కొన్ని చోట్ల మాత్రం అసైన్డ్ చేసిన భూమి రాళ్లు, రప్పలతో వ్యవసాయానికి యోగ్యంగా లేకపోవడంతో తక్కువ ధరకే వాటిని వేరొకరికి ధారదత్తం చే శారు. అలాగే, నగర శివార్లలో మాత్రం భారీగా నిర్మాణాలు వెలిశాయి. వీటిని తొలగించడం అనుకున్నంత సులువు కాదని అధికారవర్గాలే చెబుతున్నాయి. ఇలా పుట్టుకొచ్చిన కట్టడాలను క్రమబద్ధీకరించడమే ఉత్తమమనే వాదనలు వినిపిస్తున్నాయి.
 
 జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి
 కేటగిరీ    అసైన్డ్‌దారులు    విస్తీర్ణం(ఎకరాల్లో)

 ఎస్సీ       38,225                47,374.11
 ఎస్టీ        14,533                 26,890.17
 బీసీ        45,918                 64,864.15
 ఓసీ        8,258                  12,938.17
 మైనార్టీ    8,284                 6,579.05

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement