టాయిలెట్‌ కోసం బస్సు ఆపలేదని దూకిన మహిళ | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 5 2019 11:15 AM

Woman Falls off Bus After Driver Refuses to Stop for Toilet Break - Sakshi

చెన్నై : తమిళనాడులోని విరుద్‌ నగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  అత్యవసరంగా టాయిలెట్‌ వెళ్లడం కోసం బస్సును ఆపాలన్న ఓ మహిళ కోరికను డ్రైవర్ తిరస్కరించడంతో ఆమె బస్సులో నుంచి దూకేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇడయాన్ కుళం ప్రాంతానికి చెందిన పాండియమ్మాళ్ అనే వివాహిత అదే గ్రామంలోని ఓ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తోంది. ఆదివారం అనారోగ్యం నుంచి కోలుకున్న తన తండ్రిని చూసేందుకు భర్త, పెద్ద కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లింది.అదే సాయంత్రం ఆండిపట్టి నుంచి శ్రీవిల్లి పుత్తూర్‌కు బయలుదేరిన బస్సు ఎక్కి తిరుగు ప్రయాణమైంది. 

అయితే మార్గమధ్యంలో ఆమె అత్యవసరంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. బస్సును ఒక్క నిమిషం ఆపాలని ఆమె డ్రైవర్‌ను, కండక్టర్‌ను ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. తన భర్త డ్రైవర్‌తో గొడవపడుతుండగా ఆమె బుస్సులో నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను తొలుత విల్లిపుత్తూర్ ప్రభుత్వాసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం మధురై రాజాజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఓ మహిళ అత్యవసర పరిస్థితిని అర్థం చేసుకోలేని డ్రైవర్‌, కండక్టర్‌పై అందరూ మండిపడుతున్నారు.

Advertisement
Advertisement