నెల్లూరు(సెంట్రల్): టీడీపీ ముసుగులో అజీజ్ ముస్లింలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు హంజాహుస్సేన్ విమర్శించారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్లో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో అజీజ్కు ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా నెల్లూరు మేయర్ పదవిని ఇచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ధన దాహంతో గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన అజీజ్ చరిత్ర అందరికీ తెలుసన్నారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీల బిల్లుల విషయంలో ముస్లిం చేసిన పోరాటం, జగన్మోహన్రెడ్డి చేసిన కృషి అందరికీ తెలుసన్నారు. ఈ బిల్లులపై కనీసం చంద్రబాబు, టీడీపీ నాయకులు ఏ రోజైనా వ్యతిరేకించారా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, మంత్రి అనిల్కుమార్ను ఎవరైనా విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు షమీ మాట్లాడుతూ అబ్దుల్ అజీజ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు స్మరించకపోతే నిద్రపట్టడం లేదన్నారు. కనీసం వార్డు మెంబరుగా కూడా గెలిచే సామర్థ్యం లేని అజీజ్ను వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న అనిల్కుమార్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కార్పొరేటర్గా గెలిపించి మేయర్ను చేయడానికి ఎంత కష్టపడ్డారో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో అజీజ్ చేసిన ప్రతి దోపిడీపై విచారణ చేయిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ ఖలీల్ అహ్మద్, ఏఆర్ ఇంతియాజ్, ముసవర్, అతహర్బాషా, అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు.