న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు స్థల వివాదంపై డిసెంబర్ 5 నుంచి తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదాలు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. మసీదును కూల్చివేసి డిసెంబర్ 6కు పాతికేళ్లు పూర్తి కానుండటం గమనార్హం.
తీవ్ర వాదోపవాదాల అనంతరం జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని ఈ కేసులోని ముగ్గురు పార్టీలైన సున్నీ వక్ఫ్బోర్డు, నిర్మోహి అఖారా, రామమందిరాలకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషన్లను కోర్టు విచారిస్తోంది.