సాక్షి, మేడ్చల్ : రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ దుర్మరణ చెందారు. బైకును కారు ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఏదో పనిమీద ట్రాఫిక్ ఆర్ఎస్ఐ లక్ష్మణ్ తన బైకు మీద గురువారం రాత్రి బయటకు వెళ్లారు. ఓల్డ్ కాప్రాలో తన వాహనంపై వెళ్తుండగా మృత్యురూపంలో ఓ కారు ఆయనపైకి దూసుకొచ్చింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఆర్ఎస్ఐ లక్ష్మణ్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఆయన బ్రెయిడ్ డెడ్ కావడంతో మృతిచెందారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు లక్ష్మణ్ అవయవాలను దానం చేశారు.
ప్రమాదం జరిగిన తర్వాత కనీసం ఆ వ్యక్తి ఎవరు, గాయాలేమైనా అయ్యాయా కూడా చూడకుండా కారులోని గుర్తుతెలియని వ్యక్తులు అక్కడినుంచి ఉడాయించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగుచూసింది. లక్ష్మణ్ మియాపూర్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐగా పనిచేసేవారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.