పశ్చిమగోదావరి ,తణుకు : రోడ్డు ప్రమాదంలో తన స్నేహితురాలి మృతిని తట్టుకోలేని ఆ యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చోళ్ల అశ్విత మృతి చెందడాన్ని తట్టుకోలేని ఉన్నమట్ల సునీల్రాజు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం పట్టణవాసులను కలచి వేసింది. అనూహ్య రీతిలో కేవలం గంట వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందడంపై రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నెలకొంది. చాగల్లు మండలం మార్కొండపాడుకు చెందిన సునీల్రాజు, అశ్వితలు ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురి కావడం... తదనంతరం అశ్విత మృతి చెందడం... ఆ తర్వాత సునీల్రాజు ఆత్మహత్య చేసుకోవడం... ఇదంతా కలగా జరిగిపోయింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని సునీల్రాజు బలవన్మరణానికి పాల్పడటంతో సర్వత్రా చర్చనీయంశమైంది.
శోకసంద్రంలో స్నేహితులు
ఒక్కగానొక్క కూతురు... ఉన్నత చదువులు చదివించుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. వారి కలలకు అనుగుణంగా ఆమె చిన్నతనం నుంచీ చదువులో రాజీ పడకుండా బీటెక్ పూర్తి చేసింది. ఇంటర్ అయ్యాక ఎంసెట్లో సైతం మంచి ర్యాంకు వచ్చింది. నల్లజర్లలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ను ఇటీవలనే పూర్తి చేసింది. ఎప్పుడూ తల్లి చాటు బిడ్డలా ఉన్న అశ్విత ఎక్కడకు వెళ్లినా తల్లిని తోడుకుని వెళ్లేది. అయితే మంగళవారం తణుకులో జరిగిన జాబ్మేళాకు ఒంటరిగానే హాజరైంది. తన ఇంటి సమీపంలోనే నివసిస్తున్న సునీల్రాజు తణుకు వచ్చి ఆమెను మోటారు సైకిల్పై తీసికెళ్లే క్రమంలో ప్రమాదం బారిన పడ్డారు.
అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన అశ్విత తమ మధ్య లేదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేని ఆమె స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బుధవారం బంధువులకు అప్పగించారు. ఆమె మృతదేహాన్ని సందర్శించడానికి ఆమె స్నేహితులు ఇక్కడకు చేరుకున్నారు. ఆమెతో గడిపిన క్షణాలను నెమరు వేసుకున్నారు. ఆమె ప్రేమ వ్యవహారాన్ని ఎప్పుడూ తమ వద్ద ప్రస్తావించలేదని వారు చెబుతున్నారు. అయితే మృతుల కుటుంబాలు సైతం దగ్గరి బంధువులు కావడంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.