విధివక్రించి.. జంట మృతి
బైక్పై వెళ్తుండగా ఢీకొట్టిన లారీ
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మరణం
భయంతో రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
మృతులు చాగల్లు మండలం మార్కొండపాడు వాసులు
పశ్చిమగోదావరి ,తణుకు: విధి వక్రించడం అంటే ఇదేనేమో.. తణుకు పట్టణంలో మంగళవారం ఓ జంట అనూహ్య రీతిలో మరణించింది. చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన చోళ్ల అశ్విత (23) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందగా... అదే గ్రామానికి చెందిన ఉన్నమట్ల సునీల్రాజు (26) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మోటారు సైకిల్పై వెళ్తున్న వీరిద్దరిని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన యువతి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. యువతి మృతి చెందిన విషయం తెలుసుకున్న యువకుడు భయంతో ఆస్పత్రి సమీపంలోని రైలు పట్టాలపైకి వెళ్లి అటుగా వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు... బాధితుడిని చికిత్స నిమిత్తం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతులది చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామం. వీరిద్దరి ఇళ్లు ఒకే చోట కాడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
తొలుత రోడ్డు ప్రమాదం
చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన చోళ్ల శ్రీనివాసు, పద్మల ఏకైక కుమార్తె చోళ్ల అశ్విత ఇటీవలే నల్లజర్లలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది. మంగళవారం తణుకులో ఏర్పాటు చేసిన జాబ్మేళాకు హాజరైంది. ఆమె ఇంటి దగ్గర నుంచి బస్సులోనే బయల్దేరిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఉన్నమట్ల ఆనందరావు, నాగమణి దంపతుల కుమారుడు ఉన్నమట్ల సునీల్రాజు పదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం మోటారు సైకిల్పై తణుకు వచ్చిన సునీల్రాజు జాబ్మేళాకు వచ్చిన అశ్వితను కలిశాడు. ఇద్దరూ కలిసి మోటారుసైకిల్పై తిరుగు ప్రయాణమయ్యారు. పదహారో నెంబరు జాతీయ రహదారిపై ఉండ్రాజవరం జంక్షన్కు వచ్చే సరికి వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన అశ్విత తీవ్రంగా గాయపడింది. ఈమెను చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో కొద్ది సేపటికే ఆమె మరణించింది.
భయంతో సునీల్ ఆత్మహత్య...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అశ్వితను ఆస్పత్రికి తరలించేందుకు సాయపడిన సునీల్రాజు చికిత్స పొందుతున్నంతసేపు ఆమెకు సపర్యలు చేశాడు. ఆమె చనిపోయిందని తెలుసుకున్న సునీల్రాజు ఆస్పత్రి సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి అటుగా వస్తున్న సర్కారు ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని స్థానికులు తణుకులోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రెండు కాళ్లూ నుజ్జు కావడంతో అధిక రక్తస్రావమై కొద్ది సేపటికే మృతి చెందాడు. అనూహ్యరీతిలో గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఇద్దరి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.
స్నేహమా.. ప్రేమా..!
అయితే వీరిద్దరూ ప్రేమికులా..? లేకపోతే స్నేహితులా..? అనే విషయం తెలియాల్సి ఉంది. కొద్ది కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని గ్రామానికి చెందిన కొందరు చెబుతుండగా.. ఇద్దరూ ఒకే చర్చికి వెళతారని, దీంతో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించిందని మరికొందరు చెబుతున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.