మల్కాపురం (విశాఖ పశ్చిమ): అతి వేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నేవల్ ఏరియా గోస్తని గేటు ప్రాంతంలో ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ ట్రాఫిక్ సీఐ, స్ధానికులు తెలిపిన వివరాలు.. సింధియా సమీపాన నేవల్ క్వార్టర్స్లో నివసిస్తున్న పెట్టీ ఆఫీసర్ ఎ.ఎస్.జి.రాజేంద్రబాబు (35) నీతూ (28)అనే మహిళతో కలిసి ఆదివారం సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై నగరానికి వెళుతుండగా ఎదురుగా సింధియా వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న జార్జి అనే వ్యక్తి ఢీకొన్నాడు.
ఈ సంఘటనలో రాజేంద్రబాబు, నీతూ తల భాగాలకు గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. జార్జికి కూడా తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సీఐ భాస్కర్రావు మృతుడి వద్ద లభించిన ఆధారాలను బట్టి నేవల్ ఉద్యోగి అని గుర్తించారు. అతని వాహనం వెనుక కూర్చున్న నీతూ అతని భార్యా లేక స్నేహితురాలా అన్న విషయం తెలియాల్సివుంది.
సంఘటనలో మృతులు ఇద్దరినీ, గాయపడిన వ్యక్తిని ఐఎన్ఎస్ కళ్యాణి ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై పూర్తి వివరాలు తెలియరాలేదని, బంధువులు, తోటి నేవల్ ఉద్యోగుల నుంచి వివరాలు అందాల్సివుందని పోలీసులు తెలిపారు. మృతుడు ఉత్తర భారతీయుడు.