సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : నగరంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రౌడీషీటర్ సువ్వాడ మహేష్ (32) హత్య కేసులోని నిందితులకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలు అందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మంగళవారం రాత్రి పిఠాపురం కాలనీలోని బిస్మిల్లా మటన్ సెంటర్ వద్ద గేదెల రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడు, రౌడీషీటర్ మహేష్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకు ముందు ఇద్దరు స్నేహితులతో మహేష్ మద్యం సేవించాడని, ఆ తర్వాతే హత్యకు గురయ్యాడని అతని సోదరుడు పోలీసులకు చెప్పుకొచ్చాడు.
ఆ ముగ్గురిలో మాటా మాటా వచ్చి మహేష్పై వారిద్దరూ తెగబడ్డారా.. లేదా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హతమార్చారా అన్నది బుధవారం మధ్యాహ్నం వరకు మిస్టరీగానే ఉంది. కానీ బుధవారం సాయంత్రానికి పోలీసులకు విషయం కొలిక్కి వచ్చింది. అదుపులో ఉన్న ఆ ఇద్దరు అనుమానితులకు ఎమ్మెల్యే అనుచరులు వకాల్తా పుచ్చుకోవడంతో పోలీసులకు కేసు విచారణలో అప్పుడే ప్రతిబంధకాలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది.
హతుడు రౌడీషీటర్ కాగా, నిందితులుగా భావిస్తున్న ఆ ఇద్దరిలో ఒకడు ఆటో డ్రైవర్, మరొక వ్యక్తి చికెన్ షాపులో పనిచేస్తుంటాడని తెలిసింది. ఇలాంటి వ్యక్తులకు కూడా ఎమ్మెల్యే అనుచరులు వకాల్తా పుచ్చుకోవడం ఒకింత షాక్కు గురిచేసిందని పోలీసులకు అంటున్నారు. అయితే రౌడీషీటర్లను పెంచిపోషిస్తూ విశాఖ నగరంలో నయా సంస్కృతికి తెరదీసిన ఆ ఎమ్మెల్యే... భవిష్యత్ ఎన్నికల్లో తన తరఫున పనిచేసే నేరస్తుల సంఖ్యను పెంచుకునే వ్యూహంలో భాగంగానే నిందితులకు వకాల్తా పుచ్చుకున్నారని అంటున్నారు.