ఉరి వేసుకుని భార్య... రైలు కిందపడి భర్త ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని భార్య... రైలు కిందపడి భర్త ఆత్మహత్య

Published Tue, Mar 3 2015 11:24 PM

family commits suicide

పెనుకొండ(అనంతపురం): కుటుంబ కలహాలతో ఉపాధ్యాయ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో మంగళవారం కలకలం రేపింది. బుక్కపట్టణం మండలం అగ్రహారానికి చెందిన చంద్రశేఖర్(27)కు తాడిపత్రికి చెందిన ఏఎస్‌ఐ రామచంద్రారెడ్డి కుమార్తె రమాదేవి(23)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె తేజస్విని(2) ఉంది. వీరు పెనుకొండ ఆల్విన్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ సోమందేపల్లి మండలం జూలుకుంట ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. రమాదేవి డీఎస్సీ రాసేందుకు సిద్ధమవుతుండడంతో కుమార్తెను కొంతకాలం పాటు తల్లిదండ్రుల వద్ద వదులుదామని చంద్రశేఖర్ అన్నారు. అయితే తమ పుట్టింట్లోనే ఉంచాలని రమాదేవి పట్టుబట్టింది.

 

ఈ విషయంపై రెండు రోజులుగా వాదోపవాదాలు జరిగాయి. సోమవారం రాత్రి వారు వేర్వేరు గదుల్లో పడుకున్నారు. ఉదయం చంద్రశేఖర్ చూసేటప్పటికి రమాదేవి ఉరి వేసుకుని చనిపోయి ఉంది. దీంతో చలించిన చంద్రశేఖర్ వెంటనే కొండాపురం రైల్వేలైన్ వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, రమాదేవి గర్భిణి అని తెలిసింది.

Advertisement
Advertisement