గీసుకొండ: భానోదయ నాట్య మండలి (సురభి) 30వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఎలుకుర్తిహవేలి గ్రామంలో గురువారం రాత్రి ప్రదర్శించిన శ్రీ కృష్ణ లీలలు నాటకం వీక్షకులను అలరించింది. ఈ సందర్భంగా నాటకం ప్రారంభ కార్యక్రమంలో గిన్నిస్బుక్ రికార్డు హోల్డర్ డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య, కళాకారుడు నాయికోటి బాబూరావు, సురభి అధ్యక్షుడు రేకందార్ నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్ షోను
విజయవంతం చేయాలి
రాయపర్తి: తొర్రూరు పట్టణంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే రోడ్డు షోను విజయవంతం చేయాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ గెలుపు కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రోడ్డు షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ మండల ఇన్చార్జ్ గుడిపూడి గోపాల్రావు, మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, ఆకుల సురేందర్రావు, పీఏసీఎస్ చైర్మన్ జక్కుల వెంకట్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎండీ.నయీం, ముత్తడి సాగర్రెడ్డి, తాళ్లపల్లి సంతోష్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ప్రజలంతా బీజేపీ వైపే..
వర్ధన్నపేట: ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని కాశగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ షేక్ నసియాతోపాటు 100 మంది ముస్లింలు హనుమకొండలోని అరూరి రమేశ్ నివాసంలో గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. కశ్మీర్లో సమస్యను తీర్చి అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించిందని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. వరంగల్ ఎంపీగా తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో షేక్హైదర్, గుమ్షా, షేక్బాషా, మహ్మద్రియాజ్, మహ్మద్ జియాబీ, జానీబీ, సల్మా, కాశీంబీ, కరీం, యాకూబ్, ఆరిస్, రషీద్, హర్షద్ తదితరులు ఉన్నారు.
మద్యం స్వాధీనం
గీసుకొండ: మండలంలోని చింతలపల్లి గ్రామంలో భూపతి ఇందిర నిర్వహిస్తున్న బెల్ట్షాపుపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. రూ. 9,190 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.
స్టాండ్ లైటింగ్ జిగేల్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ ఆవరణలో ఏర్పాటు చేసిన కలర్ ఫుల్ లైటింగ్ జిగేల్ జిగేల్మంటూ ఆకట్టుకుంటోంది. ఇనుప గద్దెలోనుంచి ఒక పోల్ మాదిరిగా రూపొందించిన లైటింగ్లో రెడ్, ఆరెంజ్ కలర్లలో వెలుగుతోంది. నిట్లోని నెస్కెఫే ఎదురుగా, హెలికాప్టర్ పక్కన, కలామ్ గెస్ట్ హౌస్ ఎదుట మొత్తంగా మూడు ప్రాంతాల్లో పోల్, స్టాండ్ లైటింగ్ను ఏర్పాటు చేశారు.