వనపర్తి: జిల్లాలో మంగళవారం నుంచి హోం ఓటింగ్ ప్రారంభమైందని.. పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి పోలింగ్ రోజున ఏర్పాటు చేసే వెబ్క్యాస్టింగ్, ఓటరు కార్డుల ముద్రణ, పంపిణీ, సువిధ యాప్, సి–విజిల్ యాప్ వినియోగం తదితర అంశాలను వివరించారు. సమావేశంలో ఆర్ఓ ఎస్.తిరుపతిరావు, ఆర్డీఓ పద్మావతి, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
ఎన్నికల సంఘం కల్పించిన హోం ఓటింగ్ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ పవార్ కోరారు. నియోజకవర్గంలో 437 మంది హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రెండ్రోజుల పాటు రెండు రూట్లలో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా.. మొదటిరోజు మంగళవారం 226 మందికిగాను 143 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారని వివరించారు. మిగిలిన వారికి 23వ తేదీన అవకాశం కల్పిస్తామని చెప్పారు.