53వ రోజు పాదయాత్ర డైరీ
05–01–2018, శుక్రవారం
గోడ్కవారిపల్లి శివారు, చిత్తూరు జిల్లా.
గిట్టుబాటు ధర లేకపోతే అన్నదాతలు ఎవరికి మొరపెట్టుకోవాలి?
ఈ రోజు ఉదయం గాండ్లపల్లిలో రోడ్డు పక్కన వరిని తూర్పారపడుతున్న రైతన్నలు, మహిళా కూలీలతో మాట్లాడాను. ‘అన్నా.. ఏళ్ల తరబడి సేద్యాన్నే నమ్ముకున్నాం. కానీ నాలుగేళ్లుగా చాలా ఇబ్బందిపడుతున్నాం’ అన్నారు. ఏమైందన్నా.. అని అడిగాను. ‘లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నాము. రుణమాఫీ కాకపోగా, వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకులు వేధిస్తున్నాయి. దీనికితోడు గిట్టుబాటు ధరలేక నష్టాలపాలవుతున్నాం..’ అని బాధపడ్డారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే వాళ్లు ఎవరికి మొరపెట్టుకోవాలి? వ్యవసాయానికి, రైతులకు ప్రభుత్వాలు కాకపోతే మరెవరు రక్షణ కల్పిస్తారు? ఈ ప్రభుత్వం విచక్షణ కోల్పోయింది.. కాబట్టే గత నాలుగేళ్లలో పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. రైతుల్ని ఇలా గాలికి వదిలేయడంతో ఆహార భద్రత ముప్పు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. గిట్టుబాటు ధర లేకపోవడమన్నది.. రైతుల్ని అప్పులపాలు చేయడమే కాక, ఆ బాధలు, కష్టాలు వారికి బతుకు మీద కూడా విరక్తి కలిగేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నాడు నాన్నగారు, నేడు నేను రైతాంగం గురించి తాపత్రయపడేది అందుకే. రైతుల సంక్షేమమే మా ప్రధాన ఎజెండా.
సదుం దగ్గర కాంట్రాక్టు లెక్చరర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. చాలీచాలని జీతాలతో చాలా కష్టంగా ఉందని, చంద్రబాబుగారు తమను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఎన్నికలకు ముందు ఈ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు వారి ధర్నాలో పాల్గొని అప్పటి ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపిస్తే అందరి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తానని హామీ కూడా ఇచ్చాడు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయింది.. ఏమైంది వారికిచ్చిన హామీ? ఇది మోసం కాదా?
మరికాస్త దూరం నడవగానే 104 ఉద్యోగులు కలిశారు. జీతాలు పెంచడంలేదని, సౌకర్యాలు అంతంత మాత్రమేనని, వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన చెందారు. గ్రామీణులకు వైద్య సేవలు అందించేందుకు నాన్నగారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి, సమర్థవం తంగా నడిపిన ఈ పథకం ఇప్పుడు అవసాన దశలో ఉంది. సిబ్బంది తక్కువ, సౌకర్యాలు కరువు, మందు లూ కొరతే, నిర్వహణ అధ్వానం. ‘చంద్రన్న సంచార చికిత్స’గా పేరు మార్చి పబ్లిసిటీ చేసుకుంటున్నారే తప్ప పరిస్థితి.. పైన పటారం, లోన లొటారంలా తయారైంది.
నడుస్తూ ఉంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి అన్న చెప్పిన విషయాలు విస్తుగొలిపాయి. కోట్లాది రూపాయల తన సొంత భూమిని ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రభుత్వపరం చేస్తే దాన్ని పూర్తిగా అటకెక్కించారట. ఇక్కడి పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సేవాభావంతో ఆస్పత్రి నిర్మాణానికి ఉచితంగా భూమిని ఇస్తే ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణం. నాన్నగారి హయాంలో ఆర్టీసీ డిపో పూర్తయినా ఇప్పుడు బస్సులు కేటాయిం చడంలేదట. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పూర్తయినా బాబుగారు దానికి పైపులైన్లు కూడా వేయడంలేదట.
ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. మీ సొంత జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ఆస్పత్రి నిర్మా ణం నుంచి.. ఆర్టీసీ డిపో దాకా, సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి.. ఇళ్లు, పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాల దాకా.. ఏ పనీ చేయలేదన్నది నిజం కాదా? ఈ వాస్తవాల మధ్య ఈ నియోజకవర్గంలో తిరిగి.. మీ పాలనపై సమీక్ష చేసుకునే ధైర్యం మీకు ఉందా? -- వైఎస్ జగన్
కంభంవారిపల్లె – రెడ్డివారిపల్లె మధ్య తన సమస్యను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్న ఓ మహిళకు ధైర్యం చెబుతున్న జగన్