● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడు నామినేషన్లు ఉపసంహరణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నామినేషన్లు పరిశీలనంతరం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 261 మంది అభ్యర్థులు ఆమోదం పొందగా, మంగళవారం ఏడుగురు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం 254మంది పోటీదారులుగా ఉన్నారు. వీరిలో ఎవరెవరు పోటీనుంచి తప్పుకుంటారో బుధవారం సాయంత్రానికి తేలిపోనున్నది. మంగళవారం మానకొండూర్ అసెంబ్లీలో ఒకరు, చొప్పదండిలో 2, మంథనిలో 2, కోరుట్లలో 1, వేములవాడలో 1 చొప్పున మొత్తం ఏడుగురు తమ నామినేషన్లు ఉపసహరించుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల బరిలో 15మంది అభ్యర్థుల కన్నా మించితే రెండు ఈవీఎంలు ఉపయోగించాల్సి వస్తుందని, పోటీలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులతో మంతనాలు కొనసాగిస్తూన్నారు. వారిని పోటీ నుంచి తప్పుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో నేడు ఉపసంహరణ గడువు ముగిసేలోపు మరికొంతమంది తమ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు బరిలో ఉన్నవారు
కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో 31 మంది, చొప్పదండిలో 15, మానకొండూర్లో 12, పెద్దపల్లి 25, మంథని 22, రామగుండం 26, జగిత్యాల 19, కోరుట్లలో 19, ధర్మపురి నుంచి 18, హుజూరాబాద్ 25, సిరిసిల్లలో 23, వేములవాడ నుంచి 19 మంది మొత్తంగా ఇంకా 254 మంది బరిలో ఉన్నారు.
జాతీయ అవార్డులకు ఎంపిక
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్, దుంపెన రమేశ్ జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. తెలుగు–వెలుగు సాహితీ వేదిక జా తీయ స్వచ్ఛంద సేవా సంస్థ, విశ్వకర్మ గాయత్రి నాట్య కళావేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 10న విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులు అందజేయనుంది. శ్యామంతు ల అనిల్ గత ఇరువై ఏళ్లుగా కార్వింగ్, పేయింటింగ్లలో చూపుతున్న ప్రతిభకు జాతీ య అవార్డుకు ఎంపికయ్యారు. దుంపెన రమేశ్ గత పన్నెండేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
16, 17వ తేదీల్లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
సిరిసిల్లటౌన్: జిల్లాస్థాయిలో అండర్–14, అండర్–17 బాలురు, బాలికల చెస్, క్యారమ్స్, ఎలిజిబిలిటీ సెలక్షన్స్ ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి దేవత ప్రభాకర్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎలిజిబిలిటీ ఫామ్, స్టడీ సర్టిఫికెట్, ఓరిజినల్ ఆధార్ కార్డుతో పాటు గతేడాది ప్రోగ్రెస్ జిరాక్సు కాపీతో సిరిసిల్లలోని మినీస్టేడియంలో హాజరు కావాలని కోరారు. ఉదయం 9గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.