ఇది రైతన్నల పొలికేక

Bhatti Vikramarka Fires On KCR - Sakshi

రైతు వ్యతిరేక విధానాలకు ప్రజలు బుద్ధి చెబుతారు

కేసీఆర్ పతనం మొదలైంది

భట్టి ర్యాలీకి జన ఘన స్వాగతం

ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన వేల ట్రాక్టర్లు

సాక్షి, ఖమ్మం : రైతులకు వ్యతిరేకంగా బిల్లులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, నియంత్రణ పంటలతో రైతులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మల్లు అన్నారు. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్, మోదీ ఖబర్దార్ అని ఈ సందర్భంగా భట్టి నిప్పులు చెరిగారు. ట్రాక్టర్ల యాత్ర అనంతరం జరిగిన భారీ బహిరంగ సభల్లో భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు. ఈ సభలో భట్టితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుంకుమార్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్, సీనియర్ నేత వీ హనుమంత రావు, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

రైతు పొలికేక సభలో భట్టి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సరపరంపర గుప్పించారు. అందులో ప్రధానంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నను నష్టాలపాలు చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని అటు మోదీ, ఇటు కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల ఆగ్రహాన్ని పాలకులకు చెప్పేందుకే ఈ ట్రాక్టర్ ర్యాలీ చేసినట్లు భట్టి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆయన కొడుకు, అల్లుడు కోసం మాత్రమే పని చేస్తున్నారని మండి పడ్డారు. నియంత్రణ పంటలతో రైతుల నోట్లో మట్టి గొట్టారని అన్నారు. సన్నాలు వేయాలని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు మాత్రం వాటికి మద్దతు ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ట్రాక్టర్ల ర్యాలీతో ఖమ్మం రైతులు అటు మోడీకో, ఇటు కేసీఆర్ కు స్పష్టమైన సంకేతాలు జారీ చేసారని అన్నారు. ఖమ్మం రైతుల పొలికేకతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వణుకు మొదలు అవుతుందని అన్నారు. ఇక్కడ అసెంబ్లీ, అక్కడ పార్లమెంట్ రెండు కూడా రైతుల ఆగ్రహంతో దద్దరిల్లుతుందని భట్టి నిప్పులు చెరిగారు. 

భట్టికి అడుగడుగునా జన నీరాజనం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో ప్రజలు, రైతులు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ర్యాలీకి ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పలికారు. ప్రతి గ్రామంలో భట్టి బృందానికి పూలు జల్లుతూ.. డప్పులతో మోత మోగిస్తూ ఘన స్వాగతం పలికారు. మాధిరలో మొదలైన ర్యాలీకి ప్రతి గ్రామంలో రైతులు తమంతకు తాముగా చేరారు. ఒకానొక దశలో ర్యాలీ అనుకన్న సమయం కన్నా ఆలస్యంగా ముందుకు సాగింది.

వేలల్లో ట్రాక్టర్లు
మధిర నుంచి మొదలైన ట్రాక్టర్ల ర్యాలీకి మొదట నుంచి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ర్యాలీలో దాదాపు 1500 ట్రాక్టర్లు, 400 కార్లు, దాదాపు వెయ్యికి పైగా మోటార్ సైకిళ్ళు పాల్గొన్నాయి. అడుగడుగునా భట్టి బృందానికి మహిళలు తిలకం దిద్ది ఆశీర్వదించడం విశేషం. ప్రతి గ్రామంలో భట్టికి పూల జల్లుతూ, డప్పులతో స్వాగతం చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top