● ఇసుక అక్రమ రవాణాపై ఎందుకు స్పందించడం లేదు ● జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధు
మంథని: ఇసుక ఓవర్లోడ్, అక్రమ రవాణాతోనే మంథని–పెద్దపల్లి రోడ్డు నిర్మించిన నాలుగు నెలల్లోనే ధ్వంసమైందని, ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ప్రశ్నించారు. మంథని–పెద్దపల్లి మధ్య వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట ఛిద్రమైన రోడ్డును ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనేక అబద్ధాలు చెప్పిన మంథని ఎమ్మెల్యే.. ఇసుక అక్రమ రవాణాపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకవిధంగా, లేనప్పుడు మరోలా మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్ఎస్తోపాటు తనపై అనేక ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. ఇసుక క్వారీలు, లారీలు తనవేనని అబద్ధపు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వందలకొద్ది లారీలు అక్రమంగా, ఓవర్లోడ్తో ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. మంథని అక్రమ దందాలకు నిలయమైందని ఆయన ధ్వజమెత్తారు.