బలిజిపేట: మండలంలోని అజ్జాడ గ్రామంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు, ఒక పశువుల శాల దగ్థమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.2లక్షల వరకు ఆస్తినష్టం సంభవించి ఉంటుందని గ్రామస్తుల అంచనా. గ్రామానికి చెందిన గెంబలి జయమ్మ, గొడబ రవణల పూరిళ్లు ప్రమాదంలో దగ్ధం కాగా జి.ఫకీరు పశువులశాల కాలిపోయింది. జయమ్మ ఇంటివద్ద వంటపనిచేస్తుండగా ప్రమాదం సంభవించినట్లు గ్రామస్తులు తెలిపారు. నివాసగృహాలలోని నిత్యావసర సరుకులు, డబ్బులు, వంటపాత్రలు పూర్తిగా కాలిపోవడంతో బాధితులు రోడ్డుపై పడ్డారని గ్రామస్తులు చెప్పారు. ఈ ప్రమాదంపై అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ముక్కాంలో కాలిన ఇల్లు
భోగాపురం: మండలంలోని ముక్కాం గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెంఇన మైలపల్లి రాము కమ్మల ఇల్లు కాలిపోయినట్లు సమాచారం అందుకున్న వీఆర్ఓ లక్ష్మి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. సుమారు రూ.30 వేల వరకు ఆస్తినష్టం జరిగినట్లు వీఆర్ఓ అంచనా వేశారు.
మరుపల్లిలో నాలుగు ఇళ్లు..
శృంగవరపుకోట: మండలంలోని బొడ్డవర పంచాయతీ పరిధి కొత్త మరుపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం నాలుగు పూరిళ్లు దగ్ధమ య్యాయి. గ్రామానికి చెందిన సోకుల కొండమ్మ ఇంట్లో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు రేగి గ్యాస్స్టవ్, బట్టలు, వస్తుసామగ్రికి వ్యాపించాయి. అలాగే ఆ ఇంటి పక్కనే ఉన్న చింతల మల్లేష్, దురిమి ఎర్నాయుడు, పొన్నకాయల రాములమ్మ, ఇళ్లకు మంటలు విస్తరించడంతో ఒక్కసారిగా నాలుగు పూరిళ్లు కాలిపోయాయని బాధితులు వాపోయారు. ప్రమాద వార్త తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి వచ్చి మంటలు అదుపుచేశారు. ఈ ప్రమాదంలో రూ.9.5లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని, మరో రూ.20లక్షల నష్టాన్ని నివారించ గలిగామని ఎస్ఎఫ్ఓ మదీనా చెప్పారు.