సుభాష్నగర్: ఇందూరు జిల్లా కో–ఆపరేటీవ్ మార్కెటింగ్ సొసైటీ (ఐడీసీఎంఎస్) ఇన్ఛార్జి చైర్మన్గా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డికి (బీబీపేట్ సొసైటీ చైర్మన్) బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారు మోహన్ నల్లవెల్లి సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయగా, డీసీవో శ్రీనివాస్రావు ఆమోదం తెలిపారు. దీంతో ఐడీసీఎంఎస్ చైర్మన్, మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ పదవులను సాంబారు మోహన్ కోల్పోయారు. చైర్మన్ స్థానం ఖాళీ కావడంతో నూతన చైర్మన్ను ఎన్నుకునే వరకూ ఇన్చార్జి చైర్మన్గా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి వ్యవహరించనున్నారు. అధికారిక ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.
చైర్మన్ పదవికి పోటీ..!
ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవిని ముగ్గురు డైరెక్టర్లు ఆశిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు జిల్లాకు చెందిన వారు కాగా, మరొకరు కామారెడ్డి జిల్లాకు చెందిన వారు. ప్రస్తుతం వారంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్నికలకు మరో 10 నెలలు మాత్రమే గడువుంది. కాగా ఎన్డీసీసీబీ, ఐడీసీఎంఎస్ ఉమ్మడి జిల్లాల పరిధిలోకి వస్తాయి. ఒక పదవి నిజామాబాద్, మరో పదవి కామారెడ్డి జిల్లా వారిని ఎన్నుకోవడం ఆనవాయితీ. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్గా నిజామాబాద్కు చెందిన కుంట రమేశ్రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవిని కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిని ఎన్నుకుంటారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు చెరో పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ నాయకులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది.
చైర్మన్ రాజీనామాతో
ఖాళీ అయిన పదవి
నేడో, రేపో అధికారికంగా అందనున్న ఉత్తర్వులు