అమలాపురం టౌన్: దీపావళి పండగ సందర్భంగా సెలవులు కలిసి రావడంతో ఉద్యోగులైన ఆ దంపతులు తమ ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఇదే అవకాశంగా మలుచుకున్న దొంగలు వారు ఊరు వెళ్లి వచ్చేలోపు తలుపులు పగులగొట్టి ఇంట్లో బంగారం, నగదును దోచుకున్నారు. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన ఈ చోరీలో దొంగలు మొత్తం రూ.17 లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు, నగదు దోచుకున్నారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుడాలి సుజయ్కుమార్, ముమ్మిడివరంలో ఓ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న లక్ష్మీ తులిసీ దంపతులు అమలాపురం హౌసింగ్ బోర్డులోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పనిమనిషి వచ్చే సరికి తలుపులు పగులగొట్టి ఉండడంతో ఆ సమాచారాన్ని ఆ దంపతులకు చేరవేసింది. హుటాహుటీన వచ్చిన భార్యాభర్తలు తమ ఇంట్లో సొత్తును దొంగలు దోచుకున్నారని గుర్తించారు. దొంగలు ప్రధాన ద్వారం తాళం పగొలగొట్టి లోనికి ప్రవేశించారు. బెడ్రూమ్లోని ఇనుప బీరువా తాళాలు కాడా పగులగొట్టి ఈ చోరీకి పాల్పడ్డారు. 272 గ్రాముల బంగారు నగలు, వెండి మొలతాడు, రూ.1.30 లక్షల నగదును దోచుకున్నట్లు భార్యాభర్తలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సొత్తు విలువ రూ.17 లక్షలు ఉంటుందని అంచనా కట్టారు. చోరీ జరిగిన ఇంటిని ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా, అమలాపురం డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్ పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది.
లాక్డ్ హౌస్ మోనటరింగ్ను వినియోగించుకోవాలి
ఎవరైనా ఇంటికి తాళాలు వేసి ఏదైనా ఊరు లేదా క్యాంపునకు వెళుతున్నప్పుడు పోలీసుశాఖ ద్వారా అందుబాటులో ఉన్న లాక్డ్ హౌస్ మోనటరింగ్ సాంకేతిక విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ అంబికా ప్రసాద్ సూచించారు. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లే వారు ఈ విధానం కోసం దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్ను సంప్రదిస్తే ఆ సౌకర్యాన్ని పోలీసులే ఏర్పాటు చేస్తారని తెలిపారు.
అమలాపురంలో
తాళాలు వేసిన ఇంట్లో చోరీ
రూ.17 లక్షల విలువైన సొత్తు అపహరణ