Sakshi News home page

No Headline

Published Sat, Apr 13 2024 1:20 AM

- - Sakshi

జంతువుల ఆవాసాల్లోనే..

అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చ.కి.మీ., అభయారణ్యం కాగా 445.02 చ.కి.మీ., బఫర్‌ జోన్‌ ఉంది. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేటర్‌ (ఎన్జీసీఏ) లెక్కల ప్రకారం ప్రస్తుతం 32 పులులు, 176 చిరుతలు ఉన్నాయి. అలాగే 300 ఎలుగుబంట్లు, 10 వేలకుపైగా అడవి పందులు, మచ్చల జింకలు, దుప్పులు, మనుబోతులు, ముళ్ల పందులు, నక్కలు, తోడేళ్లు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లతోపాటు అరుదైన వివిధ రకాల పక్షులు, సర్పాలు, కీటకాలు, వృక్ష సంపద నల్లమల సొంతం. ప్రతిఏటా వన్యప్రాణుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. అయితే ఎండాకాలంలో నీటి ఎద్దడితో అటవీ జంతువుల ఇబ్బందులు వర్ణనాతీతం. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో 4 కి.మీ., పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ., పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జల వనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. బల్మూర్‌ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో మాత్రమే కొద్దిగా నీరు ఉంది. దీంతో అత్యధికంగా వన్యప్రాణులు అక్కడి వస్తుంటాయి.

సహజ వనరులపై దృష్టి..

నీటి కుంటలు, సోలార్‌ పంపులు, ర్యాంపు వెల్స్‌ లేని ప్రదేశాల్లో ఎత్తైన ప్రాంతంలో 1,150 సీసీ సాసర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్‌ ద్వారా నీరు నింపి వన్యప్రాణులకు అందిస్తారు. బేస్‌క్యాంపు సిబ్బంది, బీట్‌ అధికారులు నాలుగు రోజులకోసారి సాసర్లను నింపే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఐసీఐసీ ఫౌండేషన్‌ నుంచి 5 ట్రాక్టర్లు, వాటర్‌ ట్యాంకులను ఉచితంగా అందజేశారు. వీటి ద్వారా కొన్ని రేంజ్‌ల పరిధిలో నీరు సరఫరా చేస్తున్నారు. గతంలో అత్యధికంగా సాసర్ల ద్వారా అందించేవారు. దీంతో ట్రాక్టర్‌ శబ్దంతో వన్యప్రాణులు భయపడే అవకాశం ఉన్నందున ఈ పద్ధతి కొంత మేర తగ్గించి సహజ వనరులపై దృష్టిసారించారు. నిఘా ఉంచేందుకు ఒక్కో సాపర్‌ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

సోలార్‌ పంపులు..

ఏటీఆర్‌లో సోలార్‌ విద్యుత్‌ ద్వారా నడిచే పంపుల ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో 30 సోలార్‌ పంపుల ద్వారా కుంటల్లోకి నీటిని పంపించే సౌకర్యం కల్పించారు. ఎండల తీవ్రతకు కుంటల్లో నీరు ఇంకిపోయే అవకాశం ఉంది. దీంతో సోలార్‌ పంపుల ద్వారా నీటిని కుంటల్లోకి వదులుతున్నారు.

ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మనుషులు మొదలుకొని పశుపక్షాదులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో.. వాగులు, వంకలు, ఊటకుంటలు, చెలిమెలు, చెక్‌డ్యాంలు పూర్తిగా ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లో వన్యప్రాణులు తాగేందుకు నీరు దొరకడం లేదు. దీంతో అడవి జంతువులు దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, జనావాసాల వైపు పరుగులు తీస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. వ్యవసాయ బావుల్లో పడటమో.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడమో జరుగుతుంది. ప్రతిఏటా ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండేది. ఈసారి మార్చిలోనే ఎండలు ఎక్కువ కావడంతో సమస్య మరింత జఠిలమైంది. అయితే మూగజీవాల దాహం తీర్చడంతోపాటు వాటి మనుగడకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

– అచ్చంపేట

Advertisement
Advertisement