పచ్చని సంసారంలో మద్యం చిచ్చు
వెల్గటూర్: మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను రాడ్తో కొట్టి చంపిన సంఘటన ఎండపల్లి మండలం మారేడుపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మారేడుపల్లికి చెందిన వ్యాళ్ల పున్నంరెడ్డికి ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రజితతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు అక్షిత రెడ్డి(11) జన్మించింది. కొద్దిరోజులుగా పున్నంరెడ్డి మద్యానికి బానిసయ్యాడు. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అతిగా మద్యం సేవించిన పున్నంరెడ్డి అర్ధరాత్రి సమయంలో భార్య రజితతో గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో రజిత(38)ను ఇనుపరాడ్తో బలంగా కొట్టడంతో తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. రజిత మృతదేహాన్ని చూసి బంధువులు గుండెలవిసేలా రోదించారు. రజితకు కూతురు అక్షిత రెడ్డి తలకొరివి పెట్టింది. రజిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి రజిత కాటికి.. తండ్రి జైలుకు వెళ్లడంతో వారి కూతురు అనాథగా మారింది.
తాగిన మైకంలో భార్యపై రాడ్తో దాడి
అక్కడికక్కడే చనిపోయిన భార్య
అనాథగా మారిన ఒక్కగానొక్క కూతురు