కథలాపూర్: కథలాపూర్ శివారులో సీరం శంకర్ అనే రైతుకు చెందిన బోరుబావిలో చుక్కనీరు రాకపోవడంతో చేతికందే వరిపొలం ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఎస్సారెస్పీ వరదకాలువలో నీళ్లుంటే బోరుబావి ద్వారా పొలం పారించుకునేది. వరదకాలువలో నీరు అడుగంటిపోవడంతో బోరుబావిలో చుక్కనీరు రాలేదు. పంటను కాపాడుకునేందుకు ఇదిగో ఇలా.. ట్యాంకర్ను అద్దెకు తెచ్చుకొని రెండు ఎకరాల పొలానికి నీళ్లందిస్తున్నట్లు రైతు చెబుతున్నాడు. వరదకాలువను నమ్ముకుంటే పరిస్థితులు తలకిందులయ్యాయని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు.
పంట పశువుల పాలు
సారంగాపూర్: భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. జనవరిలో 10 గంటలపాటు నీరందించిన బావులు, బోర్లు.. ప్రస్తుతం గంట నుంచి రెండు గంటల వరకే పరిమితం అవుతున్నాయి. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. సారంగాపూర్కు చెందిన నలువాల రాజయ్య తాను కౌలుకు తీసుకున్న పొలం గొలుసు దశకు చేరుకున్నాక నీటి లభ్యత లేకపోవడంతో ఇదిగో ఇలా.. తన పశువులను మేపుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
‘రైతు సమస్యలపై బీఆర్ఎస్ నేతల తీరు విడ్డూరం’
మెట్పల్లి: రైతు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు అమ్మిన ధాన్యంలో నుంచి క్వింటాల్కు 10 నుంచి 15 కిలోలు కోత పెడితే ఏమాత్రం పట్టించుకోని ఆ పార్టీ నేతలు ప్రస్తుతం ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. వర్షాభావ పరిస్థితులతో అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయే తప్ప ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ఎలాల జలపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్రెడ్డి, నరేశ్ రెడ్డి, గుగ్గిళ్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.